ఎల్కతుర్తి, నవంబర్ 3 : ఈ ఫొటోలో కన్పిస్తున్న వృద్ధురాలి పేరు గొర్రె మార్త(70). స్వగ్రామం ఎల్కతుర్తి మండలం దామెర గ్రామం. జీవిత చరమాంకంలోనూ అవ్వను కష్టాలు వీడడం లేదు. 12 ఏళ్లకే పెళ్లయిన వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేశారు. తెలిసీ తెలియని వయసులోనే ఓ బిడ్డకు తల్లయింది. మొదటి భార్య తిరిగి రావడంతో మార్తను భర్త వదిలేశాడు. తల్లి ఊరైన దామెరకు తీసుకొచ్చిన మేనమామలు మరో పెళ్లి అయిన వ్యక్తికి ఇచ్చి వివాహం చేశారు. భార్యభర్తలిద్దరు రెక్కలు ముక్కలు చేసుకొని రెండెకరాల భూమిని సంపాదించడంతో పాటు ఇంటిని కూడా నిర్మించుకున్నారు. బిడ్డకు ఘనంగా పెళ్లి చేశారు. కొంతకాలానికి భర్త చనిపోగా, మార్త బిడ్డ వద్దకు వచ్చింది. ఈ క్రమంలో ఆమె కూతురు కమల రెండెకరాల భూమితో పాటు ఇల్లును కూడా అమ్ముకొని, మార్తను ఇంటి నుంచి గెంటేసింది. మార్త కొన్నాళ్లు వృద్ధాశ్రమంలో ఉన్నప్పటికీ డబ్బులు చెల్లించకపోవడంతో మళ్లీ వీధిన పడింది.
గ్రామంలోని పలు ఇండ్లల్లో కొన్నాళ్లు గడిపింది. ప్రస్తుతం దిక్కుతోచని స్థితిలో ఇందిరానగర్ వద్ద నేషనల్ హైవే పక్కనే ఉన్న బస్షెల్టర్లో ఉంటున్నది. 6 నెలలుగా అక్కడే జీవితాన్ని గడుపుతున్నది. ప్రభుత్వం ఇస్తున్న ఆసరా పెన్షన్ బాసటగా నిలుస్తున్నది. ఈ క్రమంలో విషయం తెలుసుకొని చలించిపోయిన పోలీసులు ఆమెను చేరదీశారు. కాజీపేట ఏసీపీ శ్రీనివాస్, సీఐ శ్రీనివాస్, ఎస్సై పరమేశ్ గురువారం ఆమె వద్దకు వెళ్లి మాట్లాడారు. ఇల్లు కట్టించేందుకు ఉపక్రమించారు. స్థానిక మహిళ పుష్పలీల తన ఇంటి ముందున్న జాగను ఇస్తానని ముందుకొచ్చింది. దీంతో అప్పటికప్పుడే ఇంటికి ముగ్గు పోసిను ప్రారంభించిన పోలీసులు పది, పదిహేను రోజుల్లో ఇంటిని పూర్తి చేసి మార్తకు అప్పగిస్తామని వాగ్ధానం చేశారు. ఏసీపీ రూ. 5వేలు, ఎల్కతుర్తి సీఐ శ్రీనివాస్, ఎస్సై పరమేశ్ రూ. 10వేలు ఇంటి నిర్మాణం కోసం అందజేశారు. వృద్ధురాలి యోగక్షేమాలు తానే చూసుకుంటానని పుష్పలీల పోలీసులకు చెప్పింది.
బియ్యం, దుప్పట్లు, నిత్యావసర సరుకులను పోలీసులు వృద్ధురాలికి అందించారు. దీంతో గ్రామస్తులు పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు. మరికొందరు దాతలు సైతం సహాయం చేసేందుకు ముందుకొచ్చారు. కాగా, 70 ఏళ్ల వయసులో తల్లిని ఇంట్లో నుంచి గెంటేసిన మార్త కూతురు కమలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కాజీపేట ఏసీపీ శ్రీనివాస్ అన్నారు. ఈమె భూమిని అమ్మిన విషయంపై కూడా ఆర్డీవోకు ఫిర్యాదు చేస్తామన్నారు. మార్తకు పోలీసు శాఖ తరఫున సాయమందిస్తామని చెప్పారు. వృద్ధాప్యంలో తల్లిదండ్రులను పిల్లలే జాగ్రత్తగా చూసుకోవాలన్నారు.