భూపాలపల్లి రూరల్, మార్చి 28: ప్రజలకు పోలీస్ అధికారులు అందుబాటులో ఉంటూ సమస్యలను పరిష్కరించాలని కాళేశ్వరం మల్టీ జోన్-1 ఐజీ ఏవీ రంగనాథ్ అన్నారు. గురువారం భూపాలపల్లి జిల్లా పోలీస్ కార్యాలయంలో లోక్సభ ఎన్నికల నిర్వహణ, నేర సమీక్షపై ఎస్పీ కిరణ్ ఖరేతో కలిసి ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్నికల సందర్భంగా పోలీస్ అధికారులు, సిబ్బంది పారదర్శకంగా విధులు నిర్వర్తించాలన్నారు. శాంతి భద్రతల విషయంలో నిక్కచ్చిగా ఉండాలన్నారు. ఎవరైనా చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను సందర్శించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు. విధి నిర్వహణలో అలసత్వం వహించే అధికారులపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
పెండింగ్లో ఉన్న నాన్ బెయిలబుల్ వారెంట్స్ వెంటనే ఎగ్జిక్యూట్ చేయాలని, ల్యాండ్, సివిల్ కేసుల్లో ఎస్ఓపీ ప్రకారం పారదర్శకంగా ఇన్వెస్ట్గేషన్ చేయాలని సూచించారు. ఓల్డ్ పెండింగ్ కేసుల ఇన్వెస్టిగేషన్ త్వరగా పూర్తి చేయాలని, లాంగ్ పెండింగ్ కేసులపై రివ్యూ నిర్వహించి సంబంధిత అధికారులకు సూచనలు, సలహాలు చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ కిరణ్ ఖరే జిల్లా భౌగోళిక పరిస్థితి, అసెంబ్లీ నియోజక వర్గాలు, పార్లమెంట్ నియోజకవర్గ పరిధి, పోలింగ్ లోకేషన్లు, పోలింగ్ కేంద్రాలు, సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు, జిల్లాలో ఉన్న ఓటర్లు, ఎన్నికల సందర్భంగా సెక్యూరిటీ ప్లాన్, తదితర అంశాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఐజీకి వివరించారు. సమావేశంలో కాటారం డీఎస్పీ రామ్మోహన్ రెడ్డి, వర్టికల్ డీఎస్పీ నారాయణ నాయక్, సీఐలు నరేశ్కుమార్, మల్లేశ్, రాజేశ్వర్రావు, సాగార్జునరావు, వసంతకుమార్, రామకృష్ణ, రవీందర్, నగేశ్, కిరణ్, రత్నం, శ్రీకాంత్, ఎస్సైలు పాల్గొన్నారు.