సుబేదారి, డిసెంబర్ 6 : పోలీస్ నియామకాల్లో కీలకమైన ఫిజికల్ ఈవెంట్స్ నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందుకోసం హనుమకొండలోని కేయూ మైదానంలో పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నది. ప్రతి ఈవెంట్ వద్ద పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు హైదరాబాద్ నుంచి వచ్చిన సాంకేతిక నిఫుణులు, వరంగల్ పోలీస్ కమిషనరేట్ అధికారులు పర్యవేక్షకులుగా ఉంటారు. సీసీ కెమెరాల ద్వారా ఎప్పటికప్పుడు ఈవెంట్ను ఆన్లైన్లో అప్లోడ్ చేస్తూ హైదరాబాద్లోని కమాండ్కంట్రోల్కు అనుసంధానం చేస్తారు. మూడు రకాల ఈవెంట్స్ అయిన రన్నింగ్, లాంగ్, హైజంప్ను సీసీ కెమెరాల పర్యవేక్షణలో నిర్వహించనున్నారు. అభ్యర్థి బార్కోడింగ్ నంబర్ను కంప్యూటర్లలో అప్లోడ్ చేస్తారు. ఈవెంట్ను సెన్సార్ కంప్యూటర్ ద్వారా నమోదుచేసి ఈవెంట్ వింగ్ పోలీస్ అధికారి అప్రూవల్తో అభ్యర్థులకు రిజల్ట్కాపీ అందజేస్తారు. ఈవెంట్స్ నిర్వహించే ప్రాంతాల్లో మొత్తం 16 సీసీ కెమెరాలు అమర్చారు. సర్టిఫికెట్ వెరిఫికేషన్, బయోమెట్రిక్, మైదానంలోకి వచ్చే చోట, బయటి వెళ్లే చోట మరో 9 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు.
ముందుగా సర్టిఫికెట్ వెరిఫికేషన్
ఈవెంట్స్కు వచ్చే అభ్యర్థులు హాల్టికెట్ (పార్ట్2 దరఖాస్తు ప్రింట్), స్టడీ సర్టిఫికెట్స్, కుల ధ్రువీకరణ పత్రాలను మైదానంలోకి వచ్చే గేట్ వద్ద కంప్యూటర్ ద్వారా చెక్చేసి లోనికి పంపిస్తారు. కేయూ ఇండోర్ స్టేడియంలోకి వచ్చిన తర్వాత సర్టిఫికెట్లను కౌంటర్ వద్ద వెరిఫికేషన్ చేస్తారు. తర్వాత బయోమెట్రిక్ (వేలిముద్రలు) తీసుకుంటారు. అభ్యర్థులు వేళ్లపై మోహందీ, పచ్చబొట్లు లేకుండా చూసుకోవాలి.
ప్రతి ఈవెంట్లో అథెంటిక్ వెరిఫికేషన్
అభ్యర్థులకు బయోమెట్రిక్ పూర్తయిన తర్వాత ఆర్ఎఫ్ఐడీ (ఐడీ నంబర్) ( కుడిచేతి మణికట్టు) అభ్యర్థి హాల్టికెట్తో వివరాలను కంప్యూటర్లో అప్లోడ్ చేసి బార్కోడ్తో రిస్ట్బ్యాండ్ వేసి, కంప్యూటర్లో స్కాన్ చేసి రన్నింగ్ ఈవెంట్ పాయింట్కు పంపిస్తారు. రన్నింగ్ పర్యవేక్షణ కోసం జాకెట్ వేసి సెన్సార్ ద్వారా టైమ్ను గుర్తించి రిజల్ట్కాపీ అందిస్తారు. రన్నింగ్ ఈవెంట్లో అర్హత సాధించినవారిని ఎత్తు కొలిచే పాయింట్కు పంపిస్తారు.హైట్ను కొలిచి డిస్ప్లే చేసి కంప్యూటర్లో అప్లోడ్ చేస్తారు. ఎత్తులో అర్హత సాధించిన వారిని షార్ట్పుట్ ఈవెంట్కు, ఇక్కడ అర్హత సాధిస్తే లాంగ్జంప్ ఈవెంట్కు పంపిస్తారు. మూడు ఈవెంట్లలో అర్హత పొందివారిని ఫైనల్ రిజల్ట్ పాయింట్ వద్దకు పంపి అథెంటిక్ రిజల్ట్కాపీని అందిస్తారు. ఇలా ప్రతి ఈవెంట్లో అథెంటిక్ వెరిఫికేషన్ ఉంటుంది. మొదటి ఈవెంట్లో అర్హత సాధించకుంటే మిగతావాటికి అనర్హులు. మైదానంలో ప్రతి ఐదుగురికి రన్నింగ్ ఈవెంట్ నిర్వహిస్తారు.
ప్రతి 5 సెకండ్లకు ఒక బ్యాచ్ను పంపిస్తారు.
40 మంది టెక్నీషియన్లు
కేయూ మైదానంలో ఫిజికల్ ఈవెంట్స్కోసం హైదరాబాద్ నుంచి 40మంది టెక్నీషియన్లను నియమించారు. వీరితో పాటు వరంగల్ పోలీస్ కమిషనరేట్ నుంచి డాటా ఆపరేటర్లను నియమించారు. ఎక్కడా సాంకేతిక లోపాలు రాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.
ఏర్పాట్లను పరిశీలించిన సీపీ
ఈవెంట్స్ ఏర్పాట్లను సీపీ ఏవీ రంగనాథ్ మంగళవారం పరిశీలించారు. అభ్యర్థులు అడ్మిట్ కార్డు, ఇంటిమేషన్ లెటర్, పార్ట్-2 దరఖాస్తు ప్రింట్ కాపీ, కుల ధ్రువీకరణ పత్రాలు, ఎక్స్సర్వీస్ ఎన్ఓసీ కాపీ, ఏజెన్సీ అభ్యర్థులు ఏజెన్సీ సర్టిఫికెట్లను వెంట తెచ్చుకోవాలని సూచించారు. నోడల్ ఆఫీసర్గా అదనపు డీసీపీ గైక్వాడ్, గ్రౌండ్ ఇన్చార్జిగా అడిషనల్ డీసీపీ సంజీవ్ వ్యవహరిస్తున్నారు. ప్రతి ఈవెంట్ను డీసీపీ స్థాయి అధికారులు పర్యవేక్షిస్తారు.
ట్రయల్న్ రన్
రేపటి నుంచి ప్రారంభమయ్యే ఫిజికల్ ఈవెంట్స్కోసం కేయూ మైదానంలో అభ్యర్థులతో మంగళవారం ట్రయల్న్ నిర్వహించారు. నోడల్ ఆఫీసర్ వైభవ్ గైక్వాడ్ అభ్యర్థులతో రన్నింగ్ ట్రయల్ ప్రారంభించి తగు సూచనలు చేశారు. ఇండోర్ స్టేడియంలో సర్టిఫికెట్ వెరిఫికేషన్, బయోమెట్రిక్, బార్కోడ్ రిస్ట్బ్యాండ్ రిజిస్ట్రేషన్ ఏర్పాట్లను అధికారులు పరిశీలించారు.