సుబేదారి, జూన్ 1: వరంగల్ పోలీసు కమిషనరేట్ పరిధిలో ప్రజలకు పోలీసు న్యాయ సాయం అందించడానికి పోలీసు కమిషనర్ సన్ప్రీత్సింగ్ సరికొత్తగా ప్రజా దర్బార్ కార్యక్రమానికి పూనుకున్నారు. నేరుగా బాధితుల నుంచి సమస్యలను తెలుసుకొని, ఆర్జీలను స్వీకరించి, సమస్యలను పరిష్కరించడానికి చర్యలు చేపట్టారు. ఇక నుంచి పోలీసు బాస్కే బాధితులు నేరుగా తమ సమస్యను విన్నవించుకొని, న్యాయం సాయం పొందే అవకాశం వచ్చింది. సీపీ తీసుకున్న సరికొత్త వినూత్న కార్యక్రమానికి ప్రజల నుంచి మద్దతు లభిస్తుంది.
పనిదినాల్లో ప్రతి రోజూ మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5గంటలకు సీపీ సన్ప్రీత్సింగ్ కమిషనరేట్ కార్యాలయంలో ప్రజలకు అందుబాటుల్లో ఉంటారు. ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించి, సమస్యలపై స్పందించనున్నారు. సీపీ తీసుకున్న ఈ వినూత్న ప్రజా దర్బార్ ఫిర్యాదుల స్వీకరణతో అవినితీ పొలీసు అధికారుల్లో వణుకు పుట్టింది.ముఖ్యంగా స్టేషన్ అధికారులు వణికిపోతున్నారు. సీపీ సరికొత్త కార్యక్రమంతో అవినీతి అధికారుల చిట్టా సీపీ దృష్టికి రానుంది. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సీపీ కార్యాలయ అధికారులు చెబుతున్నారు. సీపీకి ఫిర్యాదు చేసే ముందు కింది స్థాయి లోకల్ పోలీసు అధికారులకు ఫిర్యాదు చేసి ఉండాలని సీపీ కార్యాలయ అధికారులు బాధితులకు సూచిస్తున్నారు.