కేఎంసీలో పీజీ అనస్థీషియా సెకండ్ ఇయర్ విద్యార్థి సైఫ్ వేధింపుల వల్లే, పీజీ ఫస్ట్ ఇయర్ విద్యార్థిని ప్రీతి ఆత్మహత్యకు ప్రయత్నించిందని వరంగల్ పోలీస్ కమిషనర్ ఏవీ రంగనాథ్ వెల్లడించారు. శుక్రవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఇద్దరి వాట్సాప్ గ్రూప్లను పరిశీలించామని, తోటి విద్యార్థులు, కేఎంసీ అధికారులతో మాట్లాడి ప్రాథమికంగా ఆధారాలు సేకరించామని చెప్పారు. పూర్తిస్థాయిలో విచారణ చేపడుతున్నామని, నిందితుడిపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామని తెలిపారు.
సుబేదారి, ఫిబ్రవరి 24: సైఫ్ కావాలని ప్రీతిని వేధింపులకు గురిచేయడం వల్లే ఆమె ఆత్మహత్యకు ప్రయత్నించిందని పోలీస్ కమిషనర్ రంగనాథ్ వెల్లడించారు. శుక్రవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఘటన వివరాలు తెలియజేశారు. ఇద్దరి వాట్సాప్ గ్రూప్లను చెక్ చేశామని, ప్రీతిని ఇబ్బంది పెట్టేలా ప్రతి దానికి తప్పు తీస్తూ వారి బ్యాచ్ వాట్సాప్ గ్రూప్లో సైఫ్ మెస్సేజ్ చేసేవాడని తెలిపారు. ప్రసూతి హాస్పిటల్కు వెళ్లి హౌజ్ సర్జన్ విద్యార్థులతో కేస్షీట్లు రాయించిందని కామెంట్ చేయడం, ఇలా ప్రతిదీ టార్గెట్ చేస్తూ ప్రీతికి బ్రెయిన్ లేదని గ్రూప్లో మెస్సేజ్ పెట్టడం, అందరి ముందు కామెంట్ చేయడం వల్ల ప్రీతి ఇబ్బందిపడేదన్నారు.సైఫ్కు ప్రీతి పర్సనల్గా వాట్సాప్లో ఎదిరించి మెసేజ్ పెట్టడంతో అతడికి మింగుడు పడలేదన్న విషయం తేలిందన్నారు. సైఫ్ వేధింపుల విషయాన్ని ప్రీతి తన తండ్రి రైల్వే ఏఎస్ఐ నరేందర్కు చెప్పడంతో అతడు ఫోన్లో విషయాన్ని వరంగల్ ఏసీపీకి చెప్పే ప్రయత్నం చేశాడని, ఆ సమయంలో రేవంత్రెడ్డి బందోబస్త్ మీటింగ్లో ఉండి ఫోన్ లిప్ట్ చేయలేదని, తర్వాత మాట్లాడి విషయం తెలుసుకొని మట్టెవాడ ఎస్ఐ శంకర్నాయక్ను సోమవారం కేఎంసీకి పంపించారని వివరించారు. ఎస్ఐ శంకర్నాయక్ కేఎంసీ ప్రిన్సిపాల్ మోహన్దాస్, హెచ్వోడీ నాగార్జునరెడ్డి సమక్షంలో ప్రీతి, సైఫ్తో మాట్లాడి ఇద్దరినీ మందలించారని, సైఫ్ మానసికంగా వేధించడం వల్లే బుధవారం ప్రీతి అనస్థీషియా ఎమర్జెన్సీ కిట్లో సక్సీ శాంపిల్స్ అనే ఇంజక్షన్ తీసుకొని ఆత్మహత్యకు ప్రయత్నించిందని వివరించారు. ప్రీతిని సైఫ్ మానసికంగా వేధించి ఆత్మహత్యా యత్నానికి ప్రేరేపించాడని ప్రాథమిక విచారణలో తేలిందన్నారు. అతడిపై ఆత్మహత్యాయత్నం ప్రేరేపణ, సెక్షన్ 306, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, ర్యాగింగ్ నిరోధక చట్టం సెక్షన్4 కింద కేసులు నమోదు చేశామని, అరెస్ట్చేసి రిమాండ్కు తరలించామని సీపీ పేర్కొన్నారు. పూర్తి విచారణ చేపడుతున్నామని, ఇంకా ప్రీతి బ్లడ్, డ్రగ్ శాంపిల్స్ రిపోర్ట్ రావాల్సి ఉం దని ఆయన పేర్కొన్నారు.
ప్రీతి ఘటనలో కొందరు సోషల్మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని, నిందితుడు సైఫ్ కుటుంబానికి రాజకీయ సంబంధాలు లేవని, కొందరు రాజకీయ ప్రమేయం ఉందని, పోలీసులు స్పదించలేదని తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ఇది సరికాదన్నారు. ప్రీతి తండ్రి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయకుండా కౌన్సెలింగ్ ద్వారా సమస్యను చక్కదిద్దుకుందామనుకున్నారని, కొందరు పోలీసులపై బురదచల్లడం ఎంతవరకు సమంజసమన్నారు. తాను వరంగల్ పోలీస్ కమిషనర్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత పారదర్శకంగా పనిచేస్తూ, తప్పుడు పద్ధతిలో వ్యవహరించిన 12మంది పోలీస్ అధికారులను, సిబ్బందిని సస్పెండ్ చేశారని గుర్తుచేశారు. వ్యక్తిగతంగా మనోభావాలను దెబ్బతీసేలా ఎవరు తప్పుడు ప్రచారం చేసినా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ప్రీతి తెలివైన విద్యార్థి అని, ప్రశ్నించే తత్వం, సున్నిత మనస్తత్వం కలదని, ఇటీవలే యూపీఎస్సీ ఇంటర్వ్యూకు కూడా హాజరైందని, ఆమె త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు చెప్పారు. కేఎంసీ, ఎంజీఎంలో తాను స్వయంగా విచారణ చేశారని, కేఎంసీలో సీనియర్ల బాసిజం బాగా ఉందని గుర్తించినట్లు సీపీ వెల్లడించారు.
వరంగల్ చౌరస్తా : వైద్య విద్యార్థిని ధరావత్ ప్రీతి ఆత్మహత్యాయత్నం కేసు విచారణలో భాగంగా వరంగల్ పోలీస్ కమిషనర్ ఏవీ రంగనాథ్ శుక్రవారం ఎంజీఎం దవాఖానను సందర్శించి విచారణ చేపట్టారు. ముందుగా ఎంజీఎం సూపరింటెండెంట్ డాక్టర్ చంద్రశేఖర్ చాంబర్కి చేరుకొని శాఖాపరమైన విచారణ చేపట్టిన విభాగాధిపతుల కమిటీతో మాట్లాడారు. శాఖపరమైన నివేదికను రూపొందించేందుకు చేసిన విచారణలో ఏఏ అంశాలను ప్రామాణికంగా తీసుకున్నారనే విషయాన్ని ప్రస్తావించినట్లు సమాచారం. ఘటన జరిగిన రోజు బాధితురాలితో పాటు విధులు నిర్వర్తించిన తోటి విద్యార్ధులను, ఎమర్జెన్సీ ఆపరేషన్ థియేటర్లో సిబ్బందిని ఆయన విచారించారు. సుమారు గంట పాటు జరిగిన విచారణ అనంతరం రంగనాథ్ మీడియాతో మాట్లాడకుండానే వెళ్లిపోయారు. ఈ సందర్భంగా ఎంజీఎం సూపరింటెండెంట్ డాక్టర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ ప్రీతి ఆత్మహత్యాయత్నంపై స్వయంగా విచారణ చేపట్టేందుకు సీపీ ఎంజీఎం సందర్శించినట్లు తెలిపారు. విచారణకు తమవంతు సహకారం అందించేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పినట్లు వివరించారు.