ఎల్కతుర్తి, జనవరి 11 : అనాథ వృద్ధురాలిని చేరదీసి పోలీసులు ఔదార్యం చాటుకున్నారు. ఆమెకు ఇంటిని నిర్మించి అండగా నిలిచారు. ఈ మేరకు బుధవారం మండలంలోని ఇందిరానగర్లో పోలీసులు గృహప్రవేశం చేయించారు. ఈ సందర్భంగా వరంగల్ సెంట్రల్ జోన్ డీసీపీ అశోక్కుమార్ మాట్లాడుతూ పోలీసులు శాంతిభద్రతల పరిరక్షణతోపాటు సామాజిక సేవలో సైతం ముందుండాలని పిలుపునిచ్చారు. కన్న కూతురు పట్టించుకోకపోవడంతో అనాథగా వదిలేసిన వృద్ధురాలు గొర్రె మార్తకు పోలీసులు నిర్మించిన ఇంటిని ఆయన కాజీపేట ఏసీపీ శ్రీనివాస్తో కలిసి ప్రారంభించి మాట్లాడారు.
కన్న పిల్లలు పట్టించుకోకపోతే తామే ఆమె పిల్లలుగా చేరదీశామని, ఉండడానికి ఓ ఇంటిని కూడా ఏసీపీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్మించడం అభినందనీయమన్నారు. భవిష్యత్లో వృద్ధురాలి బాగోగులను కూడా చూసుకుంటామని హామీ ఇచ్చారు. ఏ పనైనా నిబద్ధతతో చేస్తామని, అందుకే చేపట్టిన పనులు త్వరితగతిన పూర్తి అవుతాయన్నారు. ఇలాంటి మంచి కార్యక్రమాలు ఇంకా జరుగాలని, తద్వారా పోలీసులకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు. ఏసీపీ శ్రీనివాస్ ఇలాంటి సేవా కార్యక్రమాల్లో ముందుంటారని కితాబిచ్చారు. ఇలా ఇంటిని నిర్మించి ఇవ్వడం చాలా అరుదుగా జరుగుతుందని, ఈ పని చేసినందుకు ఎల్కతుర్తి పోలీసులను అభినందిస్తున్నట్లు చెప్పారు.
సామాజిక సేవా కార్యక్రమాల ద్వారా ప్రజలకు మరింతగా పోలీసులు చేరువకావొచ్చని వెల్లడించారు. తనవంతు కర్తవ్యంగా ఇంటి నిర్మాణానికి ఆర్థిక సాయం చేసిన వారికి కృతజ్ఞతలు చెబుతున్నట్లు డీసీపీ తెలిపారు. అనంతరం వృద్ధురాలు గొర్రె మార్త పేరున డిపాజిట్ చేసిన రూ.1.50 లక్షల చెక్కును ఆమెకు అందజేశారు. ఇంటి ఆవరణలో మొక్కలు నాటారు. తర్వాత ఇంటి నిర్మాణానికి సహకరించిన వారిని డీసీపీ, ఏసీపీలు సన్మానించారు. ఎల్కతుర్తి, ధర్మసాగర్ సీఐలు ఎస్ శ్రీనివాస్, రమేశ్, ఎస్సైలు జక్కుల పరమేశ్, ప్రవీణ్కుమార్, మౌనిక, సర్పంచ్ కడారి రమాదేవి పాల్గొన్నారు.