నర్సంపేట, ఆగస్టు 5: లాయర్ మల్లారెడ్డి హత్య కేసులో నర్సంపేటకు చెందిన ఎర్రమట్టి క్వారీ, రైస్ మిల్లు వ్యాపారి రవీందర్తోపాటు అతడి కుమారుడు, మరో ఏడుగురిని ములుగు పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. రవీందర్కు ములుగు మండలం మల్లంపల్లి గ్రామ శివారులో క్వారీలు ఉన్నాయి. గతంలో ఈ క్వారీల విషయంలో రవీందర్, లాయర్కు పలుమార్లు పంచాయితీలు జరిగినట్లు సమాచారం. ఈ క్రమంలోనే లాయర్ మల్లారెడ్డి హత్య జరగడంతో పోలీసులు విచారణ చేపట్టి రవీందర్ పాత్రపై ఆరా తీస్తున్నారు. ఖాకీలు హత్యకు సంబంధించిన కీలక సమాచారం సేకరించినట్లు తెలుస్తోంది. లాయర్ను హత్య చేయాలని నెల్లూరు ప్రాంతానికి చెందిన నలుగురికి రూ.30లక్షలు సుపారీ ఇచ్చినట్లు నర్సంపేటలో చర్చించుకుంటున్నారు. అలాగే, సుపారీ డబ్బులను రవీందర్ కుమారుడు సందీప్ ఫోన్ పే ద్వారా చెల్లించినట్లు తెలిసింది. నల్లబెల్లిలోని ఓ గ్రామంలో ఈ గ్యాంగ్ సభ్యులకు ఆశ్రయం కల్పించినట్లు పోలీసులు గుర్తించినట్లు తెలిసింది. అలాగే, హత్య జరిగిన తర్వాత నిందితులు వాడిన కారును నర్సంపేట మండలం లక్నేపల్లి శివారు ప్రాంతంలో పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది.
నల్లబెల్లి మండలానికి చెందిన రమేశ్తోపాటు ముచ్చింపులకు చెందిన పెద్ద సమ్మయ్య, శనిగరం గ్రామానికి చెందిన రాజు, చెన్నారావుపేట మండలం అమీనాబాద్ గ్రామానికి చెందిన వెంకన్న, నర్సంపేట పట్టణానికి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి సాంబమూర్తి, నర్సంపేటకు చెందిన ప్రవీణ్, శాయంపేటకు చెందిన మరో వ్యక్తిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వీరితో ఇద్దరు సుపారీ హంతకులను అరెస్టు చేసినట్లు తెలుస్తున్నది. లాయర్ హత్య కేసులో నర్సంపేట డివిజన్ వాసుల అరెస్టు స్థానికంగా కలకలం రేపుతున్నది. లాయర్ హత్యకు పథక రచన నర్సంపేటలోనే జరిగినట్లు చర్చ కొనసాగుతున్నది. ప్రధానంగా హంతకులు వాడిన కారు, రేబాన్ గ్లాసెస్, కత్తిని నర్సంపేట సమీపంలోనే గుర్తించినట్లు తెలుస్తోంది. సుపారీ ఇచ్చిన వ్యక్తి బంధువులే నలుగురు అనుమానితుల్లో ఉండడం చర్చకు దారితీస్తున్నది. అలాగే, ఆంధ్రాలోని ఓ క్వారీ, ములుగు మండలంలోని మరికొందరిని కూడా పోలీసులు విచారిస్తున్నట్లు సమాచారం .