వరంగల్, మార్చి 10(నమస్తేతెలంగాణ) : నిరుపేదలకు గూడు కల్పించడమే లక్ష్యంగా తెలంగాణ సర్కారు తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది. సొంత జాగ ఉండి ఇల్లు కట్టుకునే స్థోమత లేనివారి కష్టాలను తీర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేసింది. జాగ కూడా లేనివారికి డబుల్ బెడ్ రూం ఇండ్లను అందిస్తూనే స్వస్థలం ఉన్నవారు ఇంటిని నిర్మించుకునేందుకు ‘గృహలక్ష్మి’ పథకం ద్వారా రూ.3లక్షల చొప్పున సాయం చేస్తామని ప్రకటించి సామాన్యులు, పేదల్లో ఆనందం నింపింది. దీంతోపాటు దళితబంధు, పోడు భూములకు పట్టాలు, గొర్రెల పంపిణీ తదితర అంశాలపై రాష్ట్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయాలపై ఆయా వర్గాల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. గొర్రెల పంపిణీ పథకం ద్వారా రెండో విడుతలో 12,783 మందికి లబ్ధి కలుగనుంది.
రాష్ట్ర మంత్రి మండలి తీసుకున్న నిర్ణయాలపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతున్నది. సొంత స్థలం ఉండి ఇల్లు నిర్మించుకొనే ఆర్థిక స్థోమత లేని పేదల కోసం గృహలక్ష్మి పథకం అమల్లోకి రాబోతున్నది. డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణాన్ని కొనసాగిస్తూనే.. సొంత జాగ ఉన్న పేదలకు గృహలక్ష్మి పథకాన్ని వర్తింప జేయాలని కేబినెట్ నిర్ణయించింది. ఈ పథకం ద్వారా ప్రతి శాసనసభ నియోజకవర్గ పరిధిలో మూడు వేల మంది సొంతింటి కల సాకారం కానున్నది. దళితబంధు పథకం రెండోవిడుతలో ప్రతి శాసనసభ నియోజకవర్గంలో 1,100 మందికి లబ్ధి చేకూరనున్నది. అలాగే, రెండోవిడుత గొర్రెల పంపిణీ ద్వారా జిల్లాలో 12,783 మంది యూనిట్లను పొందనున్నారు. పోడు వ్యవసాయం చేసుకుంటున్న రైతులకూ త్వరలో పట్టాలు అందనున్నాయి.
గృహలక్ష్మి పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఒక్కో లబ్ధిదారుడికి రూ.3 లక్షల చొప్పున గ్రాంటు ఇవ్వనుంది. వీటిని మూడు విడుతల్లో బ్యాంకు ఖాతాలో జమ చేయనున్నది. ఈ గ్రాంటుతో లబ్ధిదారుడు తనకు నచ్చిన రీతిలో ఇల్లు కట్టుకొనేలా వెసులుబాటు కల్పించింది. దీనికోసం బడ్జెట్లో రూ.12 వేల కోట్లు కేటాయించింది. ఇండ్లు లేనివారితో పాటు గతంలో ఇల్లు ఉండి అవి కూలిపోయిన వారికీ ఈ పథకం వర్తించనుంది. లబ్ధిదారుల ఎంపిక, నిర్మాణ ప్రక్రియ వెంటనే చేపట్టాలని కేబినెట్ నిర్ణయించగా, అధికారులు కసరత్తు ప్రారంభించారు. దీనికితోడు డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణం కూడా కొనసాగనుంది. ఇప్పటికే జిల్లాకు 5,456 డబుల్ బెడ్రూం ఇండ్లను మంజూరు చేసింది. వీటిలో అర్బన్, రూరల్లో 50 శాతం చొప్పున ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. అర్బన్లో ఒక్కో ఇంటికి రూ.5.30 లక్షలు, రూరల్లో రూ.5.04 లక్షల చొప్పున ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. కొన్ని ఇండ్ల నిర్మాణం పూర్తి కాగా, మరికొన్ని వివిధ దశల్లో ఉన్నాయి.
రెండో విడుత దళితబంధు..
దళితులను ఆర్థికంగా అభివృద్ధి చేసేందుకు ప్రభు త్వం దళితబంధు పథకాన్ని అమల్లోకి తెచ్చింది. తొలి విడుతలో ప్రతి శాసనసభ నియోజకవర్గంలో 100 మందికి వర్తింపజేసింది. రెండో విడుతలో ప్రతి శాసనసభ నియోజకవర్గంలో 1,100 మందికి ఒక్కొకరికి రూ. 10లక్షల విలువైన యూనిట్లను అందజేయాలని నిర్ణయించింది. గతంలో మాదిరిగానే జిల్లా కలెక్టర్ల ద్వారా లబ్ధిదారుల ఎంపిక జరుగుతుందని ప్రభుత్వం ప్రకటించింది. ప్రభుత్వ ఆదేశాలతో జిల్లాలో ఈ పథకం అమలుకు కసరత్తు జరుగుతున్నది. ఈ పథకం ద్వారా తొలివిడుత జిల్లాలో 303మంది రూ.30.30 కోట్ల లబ్ధి పొందారు. అలాగే, పోడు భూములకు పట్టాలు ఇవ్వడంపై ఇప్పటికే నివేదిక తయారైంది. ఖానాపురం, నల్లబెల్లి, నర్సంపేట, చెన్నారావుపేట, నెక్కొండ మండలాల్లో ఇటీవల అధికారులు గ్రామాల్లో సభలు నిర్వహించారు. పోడు రైతుల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. అర్హులను గుర్తించి పట్టాలను ఇచ్చేందుకు నివేదిక రూపొందించి ప్రభుత్వానికి పంపారు. వెంటనే ఈ పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.
ఏప్రిల్ నుంచి గొర్రెల పంపిణీ..
రెండోవిడుత గొర్రెల పంపిణీ పథకాన్ని ఏప్రిల్లో ప్రారంభించి ఆగస్టు నెలాఖరులోగా పూర్తి చేయాలని కేబినెట్ నిర్ణయించింది. దీని కోసం రూ.4,463 కోట్లను మంజూరు చేసింది. తొలి విడుత ఈ పథకం ద్వారా సబ్సిడీపై గొర్రెల యూనిట్లను అందజేసింది. ఒక్కో లబ్ధిదారుడికి 20 ఆడ గొర్రెలు, ఒక పొట్టేలు ఉండేవిధంగా మొత్తం 21 గొర్రెలతో కూడిన యూనిట్ను పంపిణీ చేసింది. అప్పట్లో ఒక్కో యూనిట్ విలువ రూ.1.25 లక్షలు ఉండగా, ప్రభుత్వం రూ.93,250 సబ్సిడీ ఇచ్చింది. లబ్ధిదారులు తన వాటాగా రూ.31,250 చొప్పున చెల్లించారు. జిల్లాలో తొలి విడుత 12,957 మందికి గొర్రెల యూనిట్ల పంపిణీ జరిగింది. రెండో విడుతలో మరో 12,783 మందికి గొర్రెల పంపిణీ జరగాల్సి ఉంది. ఏప్రిల్ నుంచి ఆగస్టులోగా యూనిట్లు అందనున్నాయి.
గొర్రెల ధరలు పెరిగినందున ప్రభుత్వం యూనిట్ ధరను రూ.1.75 లక్షలకు పెంచింది. ఈ నేపథ్యంలో ఒక్కో యూనిట్కు రూ.1,31,250 సబ్సిడీ ఇవ్వనుండగా, లబ్ధిదారుడు రూ.43,750 తన వాటాగా చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పటికే 351 మంది గొర్రెల పెంపకందారులు తమ వాటాధనాన్ని డీడీల రూపంలో పశు సంవర్ధక శాఖకు అందజేశారు. భూముల క్రమబద్ధీకరణకు జిల్లాలో 58, 59 జీవోల అమలుతో పేదలు లబ్ధి పొందుతున్నారు. ఈ జీవోల కటాఫ్ గడువును 2014 నుంచి 2020 వరకు పొడిగించాలని క్యాబినెట్ నిర్ణయించినందున మరింత మంది ప్రయోజనం పొందే అవకాశం ఉంది.
యూనిట్లు పెంచడం హర్షనీయం
కాశీబుగ్గ : సీఎం కేసీఆర్ దళిత బంధు పథకం యూనిట్లు పెంచడం హర్షనీయం. దీని వల్ల రాష్ట్రంలో చాలా మంది లబ్ధి పొందుతారు. ఆర్థికంగా, రాజకీయంగా దళిత సామాజిక వర్గం అత్యున్నత స్థాయికి ఎదుగుతుంది. దేశవ్యాప్తంగా ఇలాంటి సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అట్టడుగు వర్గాల ప్రజలు అన్ని రంగాల్లో ఎదిగేలా కృషి చేయాలి. దళితులు సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటారు.
– పర్లపల్లి సునీత, కాశీబుగ్గ
పార్టీలకతీతంగా గొర్రెల పంపిణీ
నర్సంపేట రూరల్ : రాష్ట్ర ప్రభుత్వం గతంలో పార్టీలకతీతంగా గొర్రెల పంపిణీ కార్యక్రమం చేపట్టడం హర్షనీయం. మొదటి దఫా నాకు 21 గొర్లు అందాయి. రోజు రోజుకూ గొర్ల సంఖ్య పెరుగుతున్నది. ప్రభుత్వ సాయంతో గొల్లకుర్మలు, యాదవులు ఆర్థికాభివృద్ధి సాధిస్తున్నారు. కుల వృత్తులకు ప్రభుత్వం పెద్దపీట వేసింది.
– ఎగ్గె రమేశ్యాదవ్, చంద్రయ్యపల్లి, నర్సంపేట మండలం