గోవిందరావుపేట/వెంటకటాపూర్, సెప్టెంబర్26 : టూరిజంపై అవగాహన కల్పించడం, సామాజిక, సాంస్కృతిక, రాజకీయ, ఆర్థిక విలువలను ప్రోత్సహించేలా ఏటా సెప్టెంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా పర్యాటక దినోత్సవాన్ని జరుపుకొంటారు. యునైటెడ్ నేషన్స్ వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ 1980 నుంచి ఓ ప్రత్యేక థీమ్తో నిర్వహిస్తున్నారు. జిల్లాలోని పలు ప్రాం తాలు పర్యాటక ప్రాంతాలుగా ప్రఖ్యాతి గాంచాయి. రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత చారిత్రక ప్రదేశాల్లో వరంగల్కు ప్రత్యేక స్థానం ఉంది. కాకతీయ వైభవానికి ప్రతీకగా నిలిచిన ఓరుగల్లు పట్టణంలో ఆనాటి కట్టడాలు నేటికీ పర్యాటకులను కనువిందు చేస్తున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలో వేయి స్తంభాల గుడి, రామప్ప గుడి, భద్రకాళి దేవస్థానం, ఖిలా వరంగల్, పాకాల, లక్నవరం వంటి ప్రముఖ పర్యాటక ప్రదేశాలకు స్వదేశీయులతోపాటు ఎంతో మంది విదేశీయులు వస్తుంటారు.
రామప్పకు ప్రపంచ వారసత్వ కట్టడంగా గుర్తింపు లభించిన తర్వాత పర్యాటకుల సంఖ్య గణనీయంగా పెరిగింది. బీఆర్ఎస్ సర్కారు చొరవతో యునెస్కో గుర్తింపు పొందిన రామప్పను సందర్శించేందుకు దేశ, విదేశీ పర్యాటకులు పెద్దసంఖ్యలో తరలివస్తున్నారు.
పర్యాటకులకు వసతులు కల్పించేందుకు రూ.88కోట్ల వ్యయంతో తెలంగాణ టూరిజం శాఖ ఆధ్వర్యంలో హనుమకొండ, ములుగు గట్టమ్మ, రామప్ప, లక్నవరం, సమ్మక్క-సారలమ్మ తాడ్వాయి, మేడారం, బొగత, మల్లూరు ప్రాంతాల్లో కాటేజీలు, రెస్టారెంట్లు ఏర్పాటు చేసింది. లక్నవరంలో బోటింగ్, వేలాడే వంతెనలు, జిప్ సైక్లింగ్, కయాకింగ్, పాండవుల గుట్టల్లో ట్రెక్కింగ్ లాంటి పలు సదుపాయాలు కల్పించి పర్యాటకులను ఆకట్టుకుంటున్నది.
స్వరాష్ట్రంలో పర్యాటక రంగం ప్రగతి పథంలో దూసుకుపోతున్నది. గత ప్రభుత్వాలు పర్యాటక రంగానికి నిధులిచ్చిన దాఖలాలు లేవు. తెలంగాణలో సీఎం కేసీఆర్ ప్రతి జిల్లాకు వందలాది కోట్లు కేటాయిస్తూ పర్యాటక రంగాన్ని తీర్చిదిద్దుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రఖ్యాతి గాంచిన మేడారం సమ్మక్క-సారక్క జాతరకు వందల కోట్లు వెచ్చించి సదుపాయాలు కల్పిస్తున్నారు.