హనుమకొండ, ఏప్రిల్ 27 : ఉమ్మడి వరంగల్ జిల్లాలో పెట్రోల్, డీజిల్ కొరత నేపథ్యంలో బంకులకు వాహనదారులు పోటెత్తారు. సోమవారం ఉదయం నుంచే పెద్ద సం ఖ్యలో బంకుల ముందు క్యూ కట్టారు. దీంతో వారం రోజుల్లో అమ్మే పెట్రోల్, డీజిల్ మూడు నాలుగు గంటల్లోనే ఖాళీ కావడంతో పలు బంకుల ఎదుట నో స్టాక్ బోర్డులు పెట్టారు. అలాగే ఎవరూ రాకుం డా రాళ్లు, టైర్లు అడ్డు వేయడంతో పాటు తాళ్లతో కట్టారు. బంకులు మూతపడుతున్నాయన్న ప్రచారంతో స్టాక్ ఉన్న బంకుల వద్ద ప్రజ లు వాహనాలు, క్యాన్లను తీసుకొని వచ్చి గంటల తరబడి క్యూలో వేచి ఉన్నారు.
మరికొన్ని బంకుల్లో కేవలం పెట్రోల్ లేదా డీజిల్ మాత్రమే ఉంది. ముఖ్యంగా హనుమకొండ, వరంగల్, కాజీపేటతో వివిధ జిల్లా కేంద్రాలు, మండలాల్లోని బంకుల్లో ద్విచక్ర వాహనాలు, ఆటోలు, కార్లు, ట్రాక్టర్లు, టిప్పర్లు ఉదయం నుంచే బారులు తీరా యి. కాగా ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ కొరత లేదని చెపుతున్నప్పటికీ బంకుల వద్ద పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. ముందస్తుగా డీడీలు తీసినప్పటికీ ఆయిల్ కంపెనీలు సరఫరా చేయడం లేదని పలువురు బంకు యజమానులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా, ఆయిల్ కొరతను ఆధారంగా చేసుకొన్న కొందరు బ్లాక్ మార్కెట్లో ఎక్కువ రేటుకు అమ్ముతున్నారన్న ప్రచారం జరుగుతున్నది.
పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడిందన్న ప్రచారంతో వాహనదారులు, ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డా రు. వివిధ పనుల నిమిత్తం ఇతర ప్రాంతాలకు వెళ్లేవారు బంకుల వద్దకు చేరుకొని బారులుతీరారు. గంటల తరబడి అక్కడే ఉండడంతో అనుకున్న సమయానికి చేరుకోలేమని కొందరు తమ ప్రయాణాలను సైతం వాయిదా వేసుకున్నట్లు తెలిపారు. ప్రస్తుతం పెళ్లిళ్లు, వరి కోతలు, వ్యవసాయ పనుల సీజన్ కావడంతో పెరిగిన వినియోగానికి అనుగుణంగా సరఫరా లేకపోడంతో ఇబ్బందులు తప్పడం లేదని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొరత లేదనడంపై మండిపడుతున్నారు. అయితే ఆయిల్ కొరత ప్రభావం నిత్యావసర వస్తువులపైన పడే అవకాశం ఉందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు డీజిల్, పెట్రోల్, గ్యాస్ కొరత లేకుండా చూడాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
గతంలో ఆయిల్ కంపెనీలు ముందస్తుగా డబ్బులు చెల్లించకున్నా (ఉద్దెర) డీజిల్, పెట్రోల్ ట్యాంకర్లు పంపించేవారు. ప్రస్తుతం యుద్ధం నేపథ్యంలో ముందస్తుగా డీడీలు తీసి పంపించినప్పటిటీ ట్యాంకర్లు పంపించడం లేదని బంకు యజమానులు వాపోతున్నారు. మూడు, నాలుగు రోజులకు ఒక ట్యాంకర్ను పంపిస్తున్నారని పేర్కొంటున్నారు. అంతేకాక ప్రస్తుతం వరి కోతల సీజన్ కావడం, వేసవిలో ట్రాక్టర్ల ద్వారా చేపట్టే పనులు సైతం పెరదడంతో డీజిల్ వినియోగం అధికమవ్వడం కూడా ఆయిల్ కొరతకు కారణమైంది. అంతేకాక ప్రస్తుతం క్రూడ్ ఆయిల్ ధరలు విపరీతంగా పెరిగాయని, దీంతో లీటర్పై సుమారు రూ. 20 వరకు నష్టం వస్తున్నదనే సాకుతో స్టాక్ ఉన్నప్పటికీ ట్యాంకర్లు పంపడంలో కంపెనీలు జాప్యం చేస్తున్నాయని బంకు యజమానులు ఆరోపిస్తున్నారు.