బీఆర్ఎస్ కోసం ఊరూవాడ ఏకమవుతున్నది. నవంబర్ 30న జరిగే ఎన్నికల్లో గులాబీ పార్టీ గెలుపే లక్ష్యంగా అభ్యర్థులకు మద్దతుగా జనం తరలివస్తోంది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఎక్కడచూసినా ప్రచారానికి జనం వెల్లువలా తరలివస్తూ ఆదరిస్తుండడంతో అన్ని నియోజకవర్గాల్లో విశేష స్పందన వస్తోంది. అలాగే క్షేత్రస్థాయికి వెళ్లిన అభ్యర్థులకు సైతం సబ్బండ వర్గాల నుంచి ప్రజాఆశీర్వాదం మెండుగా లభిస్తుండడంతో వారిలో గెలుపు ధీమా రెట్టింపు అవుతోంది. దీనికి తోడు ప్రచార ర్యాలీలు, పాదయాత్రలో అభిమానులు కలిసిరావడంతో కొండంత బలాన్నిస్తున్నది. ఇలా గురువారం సైతం అన్నిచోట్లా ప్రచారం జోరుగా సాగగా నియోజకవర్గాలన్నీ జనప్రవాహంతో హోరెత్తాయి. ‘అభివృద్ధి’ మంత్రం జపిస్తూ.. బీఆర్ఎస్ సరికొత్త మ్యానిఫెస్టోను వివరిస్తూ కారు గుర్తుకు ఓటేయాలని అభ్యర్థిస్తూ ముందుకుసాగారు. నామినేషన్ సందర్భంగా స్టేషన్ఘన్పూర్, భూపాలపల్లి, వర్ధన్నపేటల్లో తీసిన రోడ్షో, ర్యాలీలకు ప్రజలు, శ్రేణులు భారీగా రావడంతో ప్రాంతాలన్నీ జనసంద్రాన్ని తలపించాయి.
‘నా నామినేషన్ సందర్భంగా వచ్చిన అభిమానులను చూస్తుంటే ఈ నియోజకవర్గంలో బీఆర్ఎస్ ఎంత బలంగా ఉందో అర్థమవుతోంది. ఈ ఎన్నికల్లో స్టేషన్ఘన్పూర్లో గులాబీ జెండా ఎగరడం ఖాయమైంది. సీఎం కేసీఆర్ పాలన పట్ల నమ్మకానికి ఇది నిదర్శనం. ఇంత పెద్ద సంఖ్యలో తరలివచ్చిన మీకు ధన్యవాదాలు’ అంటూ స్టేషన్ఘన్పూర్ అభ్యర్థి కడియం అందరికీ అభివాదం చేశారు. నామినేషన్ సందర్భంగా స్థానిక శివాజీ సర్కిల్ వద్ద నిర్వహించిన పబ్లిక్ మీటింగ్లో మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, ఎమ్మెల్యే రాజయ్యతో కలిసి కడియం పాల్గొన్నారు.
చెన్నారావుపేట మండలంలోని అమినాబాద్, పత్తినాయక్తండా, సూర్యాపేటతండా, గొల్లభామతండా, గొల్లపల్లె, ఖాదర్పేట, అక్కల్చెడ, కోనాపురం, లింగాపురం, కల్నాయక్తండా, జీడిగడ్డతండా, ఉప్పరపల్లిలో నర్సంపేట అభ్యర్థి పెద్ది సుదర్శన్రెడ్డి సుడిగాలిలా పర్యటించారు. రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు, పరుగులు పెడుతున్న అభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆరే గ్యారంటీ అని, ఎలాంటి గ్యారెంటీలు లేని దొంతిని, కాంగ్రెస్ పార్టీని నమ్మి మోసపోవద్దని పెద్ది ప్రజలను కోరారు.
చీఫ్ విప్, బీఆర్ఎస్ వరంగల్ పశ్చిమ అభ్యర్థి దాస్యం వినయ్భాస్కర్ భద్రకాళీ బండ్పై ప్రచారం చేశారు. వాకర్స్తో మమేకమై ముందుకుసాగారు. నియోజకవర్గంలో ఎటుచూసినా అభివృద్ధి, ఇంటింటా సంక్షేమం కండ్ల ముందు కనిపిస్తున్నదని, అభివృద్ధిని చూసి కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.
భూపాలపల్లిలో బీఆర్ఎస్ అభ్యర్థి గండ్ర వెంకటరమణారెడ్డి నామినేషన్ కోసం పార్టీ శ్రేణులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. మంత్రి సత్యవతి రాథోడ్, ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి, నియోజకవర్గ ఇన్చార్జి బస్వరాజు సారయ్య, పార్టీ జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతితో కలిసి నామినేషన్ వేసిన గండ్ర.. అనంతరం స్థానిక జయశంకర్ చౌక్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. భూపాలపల్లిలో సిరికొండ, గండ్ర కలిస్తే అభివృద్ధికి అడ్డే ఉండదని, వెంకటరమణారెడ్డిని అధిక మెజార్టీతో గెలిపించి సీఎం కేసీఆర్కు కానుకగా ఇద్దామని మంత్రి సత్యవతి పిలుపునిచ్చారు.
కేసముద్రం మండలంలోని పెనుగొండ, బేరువాడ , నర్సింహులగూడెం, రంగాపురం, బొడ మచ్చతండా, బిచ్చానాయక్తండా, మరితండాల్లో మహబూబాబాద్ అభ్యర్థి బానోత్ శంకర్నాయక్ ప్రచారం చేశారు. ఇచ్చిన మాట ప్రకారం తండాలను గ్రామపంచాయతీలుగా గుర్తించి అభివృద్ధి చేయడంతో పాటు పోడు రైతులకు పట్టాలు ఇచ్చిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందన్నారు. రాష్ట్ర అభివృద్ధికి, పేద ప్రజల సంక్షేమానికి కృషి చేస్తున్న సీఎం కేసీఆర్కు మరోసారి అండగా ఉండాలని కోరారు.
వరంగల్ భద్రకాళీ, ఐనవోలు మల్లికార్జునస్వామి ఆలయాల్లో, రెడ్డిపాలెం చర్చిలో, అన్నారం షరీఫ్ దర్గాలో వర్ధన్నపేట అభ్యర్థి అరూరి రమేశ్ సర్వమత ప్రార్థనలు చేసి నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం నియోజకవర్గంలోని ముఖ్యనాయకులు రమేశ్కు మద్దతుగా నినాదాలు చేస్తూ పటాకులు కాల్చి సంబురాల్లో మునిగితేలారు.
ఎల్కతుర్తి మండలంలోని దామెర, చింతలపల్లి, ఇందిరానగర్, గోపాల్పూర్, బావుపేట, ఆరెపల్లి, గుంటూర్పల్లి, తిమ్మాపూర్ గ్రామాల్లో మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి, జడ్పీ చైర్మన్ సుధీర్కుమార్లతో హుస్నాబాద్ అభ్యర్థి వొడితల సతీశ్కుమార్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశానని, మరోసారి గెలిపిస్తే హుస్నాబాద్ను ఆదర్శంగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు.
గ్రేటర్ వరంగల్లోని పాతబీట్ బజార్ వర్తక, వాణిజ్య సముదాయాల షాపుల వద్ద, పిన్నవారివీధిలో, చింతల్ పరిసర ప్రాంతాల్లో వరంగల్ తూర్పు అభ్యర్థి నన్నపునేని నరేందర్ విస్తృత ప్రచారం చేశారు. ఇంటింటికీ వెళ్లి ప్రజలను ఓట్లు అభ్యర్థించారు. తొడలు కొట్టి మీసాలు తిప్పేవాళ్లను నమ్మితే ఆగమైపోతామని.. ప్రజా సంక్షేమ ప్రభుత్వానికే మద్దతివ్వాలని కోరారు.