నర్సంపేట రూరల్, ఫిబ్రవరి 4 : ప్రభుత్వ పాఠశాలలకు పూర్వ వైభవం తీసుకు వచ్చేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో కృషి చేయాలని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. శనివారం పట్టణంలోని క్యాంప్ కార్యాలయంలో మన ఊరు-మన బడి, మన బస్తీ-మన బడి అభివృద్ధి పనులపై సమీక్షా సమావేశం నిర్వహించారు. తొలుత పనుల పురోగతిని సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎస్ఎంసీ, ఎంఎన్ఆర్ఈజీఎస్ నిధులు రూ. 36కోట్ల 30లక్షల 40వేలు పాఠశాలల అభివృద్ధి కోసం మంజూరైనట్లు చెప్పారు. నిధులను వినియోగించుకొని ప్రభుత్వ పాఠశాలలను సుందరంగా తీర్చిదిద్దాలని తెలిపారు. మనం విద్యాబుద్ధులు నేర్చుకున్న స్కూళ్లను అభివృద్ధి చేసుకోవడం అందరి బాధ్యతగా భావించాలని కోరారు. మరో నెల రోజుల్లో పెండింగ్ పనులను పూర్తి చేసి ప్రారంభోత్సవాలకు సిద్ధం చేయాలని సూచించారు.
సకాలంలో పనులు పూర్తి చేస్తే అదనంగా సీఎస్ఆర్ నిధులను మంజూరు చేయిస్తామన్నారు. కలెక్టర్ గోపి మాట్లాడుతూ.. నర్సంపేట నియోజకవర్గంలో 104 పాఠశాలలను ఎంపిక చేశామన్నారు. పాఠశాల అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని సూచించారు. మన ఊరు-మన బడి కార్యక్రమంలో కేటాయించిన నిధులు సద్వినియోగమయ్యేలా చూడాలని కోరారు. డ్రింకింగ్ వాటర్, కిచెన్ షెడ్, టాయిలెట్స్ సౌకర్యాలకు మొదటి ప్రాధాన్యం ఇవ్వాలని పేర్కొన్నారు. ఎంఎన్ఆర్ఈజీఎస్ కింద 94 పాఠశాలలను ఎంపిక చేయగా, 20శాతం పాఠశాలల్లో మాత్రమే పనులు పూర్తయ్యాయని తెలిపారు. పనుల్లో ఎలాంటి జాప్యత చేయొద్దని, నాణ్యతా ప్రమాణాలను కచ్చితంగా పాటించాలన్నారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే, ఓడీసీఎంఎస్ చైర్మన్ గుగులోత్ రామస్వామి, జడ్పీ వైస్ చైర్మన్ ఆకుల శ్రీనివాస్, జిల్లా విద్యాశాఖ అధికారి వాసంతి తదితరులు పాల్గొన్నారు.