ఖిలావరంగల్, మార్చి 22: కోట పరిసరాలు బుధవారం భక్తజనంతో సందడిగా మారాయి. చారిత్రక నేపథ్యం కలిగిన ఓరుగల్లు కోటలో పెద్దమ్మతల్లి జాతరను అత్యంత వైభవోపేతంగా నిర్వహించారు. ఉగాది పర్వదినం సందర్భంగా ఒకరోజు జరిగే పెద్దమ్మతల్లి జాతరకు భక్తులు భారీగా తరలివచ్చారు. ఖిలావరంగల్ మండలంలోని స్తంభంపల్లి, ఆదర్శనగర్, వసంతపురం, దూపకుంట, ధర్మారం, గాడిపల్లి జానిపీరీలు, గొర్రెకుంట ప్రాంతాల నుంచి రైతులు ఎండ్ల బండ్లతో తరలివచ్చి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేశారు. కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించుకున్నారు. అలాగే, తూర్పుకోటకు చెందిన ముదిరాజ్ కులస్తులు పెద్దమ్మతల్లికి బోనాలు సమర్పించారు.
యాదవులు డప్పు, డోలు వాయిద్యాల మధ్య మేకలతో ప్రత్యేకంగా అలంకరించిన ప్రభబండ్లతో తరలివచ్చి పెద్దమ్మ తల్లికి పట్నాలు వేశారు. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ ఆధ్వర్యంలో ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. ఆలయ పరిసరాల్లో విద్యుద్దీపాలను ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా మిల్స్కాలనీ పోలీసులు బందోబస్తు నిర్వహించారు. కాగా, ప్రజలు పెద్దమ్మతల్లి దర్శనానికి ముందు కోటలోని బొడ్రాయి, పోచమ్మ, కనకదుర్గమ్మ ఆలయాలకు వెళ్లి జలాభిషేకాలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నన్నపునేని ఎడ్లబండిపై తరలివచ్చి పెద్దమ్మతల్లికి మొక్కులు చెల్లించుకున్నారు.