కృష్ణకాలనీ, జనవరి 7: అధికార పార్టీకి చెందిన ఓ నియోజకవర్గస్థాయి ప్రజాప్రతిని ధి తనను కాంగ్రెస్ పార్టీలోకి రమ్మంటే తాను పోనందుకు తనపై కక్ష పెంచుకొని జిల్లా అధికారులతో కలిసి ప్రభుత్వ మైనార్టీ పాఠశాల భవనాన్ని ఖాళీ చేయిస్తున్నాడని భవన యాజమాని నాగుల దేవేందర్ రెడ్డి ఆరోపించారు. తనకు రూ.40 లక్షల వరకు అద్దె రావాలని, అది చెల్లించిన తర్వాతే భవనం ఖాళీ చేయాలని దేవేందర్రెడ్డి కుటుంబంతో సహా నిరసన తెలిపి, పాఠశాల ఫర్నిచర్ను వ్యానులో తరలిస్తుండగా అడ్డుకున్నారు. దీంతో వారిని పోలీసులు బలవంతంగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా దేవేందర్రెడ్డి మాట్లాడుతూ 2021లో జిల్లా అధికారుల కోరిక మేరకు తన భవనాన్ని తెలంగాణ ప్రభుత్వ మైనార్టీ పాఠశాలకు అద్దెకు ఇచ్చానన్నారు.
2027 వరకు లీగల్ అగ్రిమెంట్ ఉందని, అయినప్పటికీ అధికార పార్టీకి చెందిన కొంతమంది ప్రజాప్రతినిధులు తనపైన కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతూ కావాలనే భవనాన్ని ఖాళీ చేయిస్తున్నారని తెలిపారు. అయినప్పటికీ తాను ఏమీ అనలేదని, తనకు రూ. 40 లక్షల వరకు అద్దె రావాలని, ఆ తర్వాతనే భవనాన్ని ఖాళీ చేయాలని వేడుకున్నానన్నారు. మైనార్టీ సూల్ ప్రిన్సిపాల్, జిల్లా మైనార్టీ శాఖ అధికారి, సంబంధిత శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీకి లిఖితపూర్వకంగా లేఖ కూడా ఇచ్చానని, డీఎండబ్ల్యూవో శైలజ పూర్తి అద్దె చెల్లించిన తర్వాతనే భవనాన్ని ఖాళీ చేస్తామని హామీ కూడా ఇచ్చారన్నారు. కానీ తనకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే మంగళవారం భవనాన్ని ఖాళీ చేయించారన్నారు.
తాను రూ. 10 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు ఖర్చు చేసి భవనాన్ని సుందరంగా తయారు చేసి ప్రభుత్వ మైనార్టీ పాఠశాలకు అప్పజెప్పానన్నారు. తన అద్దె చెల్లించమని వేడుకుంటే క్రిమినల్ కేసులు పెట్టి జైలుకు పంపిస్తామని బెదిరిస్తున్నారన్నారు. ఈ విషయంపై డీఎండబ్ల్యూవో శైలజ మాట్లాడుతూ నాగుల దేవేందర్ రెడ్డి భవనానికి అద్దె చెల్లించాల్సిన మాట వాస్తవమేనన్నారు. విడతల వారీగా చెల్లిస్తామని, వీలైనంత త్వరలోనే అద్దె చెల్లించేందుకు సంబంధిత శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీకి సమాచారం అందిస్తామని చెప్పారు.
Warangal