సంగెం, ఏప్రిల్ 7 : బీఆర్ఎస్ ప్రభుత్వంతోనే రాష్ట్రం సమగ్రాభివృద్ధి సాధించిందని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. గీసుగొండ మండలంలోని ఊకల్ ఎంఎస్ఆర్ గార్డెన్లో శుక్రవారం సంగెం మండలంలోని సంగెం, తిమ్మాపురం, ఎల్గూర్రంగంపేట, నర్సానగర్, బిక్కోజునాయక్ తండా, ఎల్గూర్స్టేషన్, గాంధీనగర్, కొత్తగూడెం, సోమ్లాతండా, తీగరాజుపల్లి గ్రామాల బీఆర్ఎస్ నాయకులతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులు, సమస్యలపై సమీక్షించారు.
అనంతరం ఎమ్మెల్యే చల్లా మాట్లాడుతూ దేశంలోనే తెలంగాణ వేగంగా అభివృద్ధి చెందడానికి సీఎం కేసీఆర్ విజనే కారణమన్నారు. పేదలను ఆదుకోవడమే లక్ష్యంగా పథకాలను అమలు చేస్తున్నారని చెప్పారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలతో ప్రజల్లో ఆత్మవిశ్వాసం రెట్టింపయిందని పేర్కొన్నారు. తొమ్మిదేండ్ల బీఆర్ఎస్ పాలనలో జరిగిన అభివృద్ధి గురించి గ్రామాల్లో కార్యకర్తలు ప్రచారం చేయాలన్నారు. బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతే బీఆర్ఎస్ ఎజెండా అన్నారు. రాష్ట్రంలో అభివృద్ధిని ఓర్వలేకనే ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయన్నారు. సమ్మేళనంలో నిమ్మగడ్డ వెంకటేశ్వర్రావు, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పసునూరి సారంగపాణి, జడ్పీటీసీ గూడ సుదర్శన్రెడ్డి, సర్పంచ్ల ఫోరం జిల్లా అధ్యక్షుడు పులుగు సాగర్రెడ్డి, వైస్ ఎంపీపీ బుక్క మల్లయ్య, నరహరి పాల్గొన్నారు.