తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ దుకాణం బంద్ అయ్యే రోజులు దగ్గర పడ్డాయని, బీజేపీ నాయకులు తలాతోక లేకుండా బ్రోకర్ మాటలు మట్లాడుతున్నారని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ధ్వజమెత్తారు. బుధవారం శివనగర్లో బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ధరలు పెంచి పేదల ఉసురు పోసుకుంటున్న పాపం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానిదేనని పేర్కొన్నారు. రైతులు అధైర్యపడొద్దని, తడిసిన ప్రతి ధాన్యం గింజనూ కొంటామని స్పష్టం చేశారు. టెక్స్టైల్ పార్కులో 25 వేల మందికి ఉద్యోగావకాశాలు కల్పిస్తామని, గృహలక్ష్మి పథకం కింద తూర్పు నియోజకవర్గానికి అదనపు ఇండ్లు మంజూరు చేస్తామని చెప్పారు. ఎమ్మెల్యే నరేందర్ మాట్లాడుతూ.. మతాల మధ్య చిచ్చుపెట్టే పార్టీని ప్రజలు ఎక్కడికక్కడ నిలదీయాలని పిలుపు నిచ్చారు.
ఖిలావరంగల్, మే 3 : తెలంగాణ రాష్ట్రంలో సచ్చిన పార్టీ కాంగ్రెస్, తలా తోక లేకుండా మాట్లాడే బ్రోకర్ పార్టీ బీజేపీ అని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు విమర్శించారు. గ్రేటర్ వరంగల్ 35వ డివిజన్ శివనగర్లో బుధవారం బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 40 ఏళ్ల రాజకీయ జీవితంలో తనకు నచ్చిన ముఖ్యమంత్రులు ఎన్టీఆర్, కేసీఆర్ మాత్రమేనన్నారు.
కేంద్రంలోని బీజేపీ సర్కారు ధరలు పెంచి పేద, మధ్యతరగతి ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నదన్నారు. తొమ్మిదేళ్ల క్రితం హైదరాబాద్ ఎల్బీనగర్ స్టేడియంలో తాను, చంద్రబాబునాయుడు, మోదీ మాట్లాడుకున్న సంభాషణను గుర్తు చేశారు. రూ.400 ఉన్న గ్యాస్ ధరను రూ.200 చేస్తానని నాడు మోదీ హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాక రూ.1250కి పెంచాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ధరలు పెంచినవారే తగ్గించాలని ధర్నాలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. బీజేపీ పాలిత ప్రాంతాల్లో ప్రజల జీవన స్థితిగతులు అధ్వానంగా ఉన్నాయన్నారు. దేశ ప్రజల మధ్య మతాల పేరుతో చిచ్చు పెడుతున్న బీజేపీని బొందపెట్టాలన్నారు. పేదవాళ్ల కోసం వరంగల్లో దేశంలో ఎక్కడ లేని విధంగా పెద్ద దవాఖానను కట్టిస్తున్నామన్నారు.
ఆజంజాహీ మిల్లు మైదానంలో వరంగల్ కలెక్టరేట్ నిర్మించనున్నట్లు తెలిపారు. కాగా, ఆజంజాహీ మిల్లు మూతపడడంతో స్థానిక యువకులకు ఉపాధి కరువైందని, ఇక్కడ రెండు భారీ పరిశ్రమలు ఏర్పాటు చేసి, జీవనోపాధి కల్పించాలని ఎమ్మెల్యే నరేందర్ మంత్రిని కోరారు. దీనికి స్పందించిన ఆయన గీసుగొండ మండలంలోని టైక్స్టైల్ పార్క్లో 10 వేల నుంచి 25 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఓటమి అనేది లేకుండా ఆరు సార్లు ఎమ్మెల్యేగా, ఒక సారి ఎంపీగా గెలిచానని, అలాగే, ఎమ్మెల్యే నరేందర్ కూడా కార్పొరేటర్గా, ఎమ్మెల్యేగా ఓటమి అనేది లేకుండా ముందుకు వెళ్తున్నాడని, ఆయనను కాపాడుకోవాల్సిన బాధ్యత కార్యకర్తలు, ప్రజలపై ఉందన్నారు.
గృహలక్ష్మి పథకం కింద నియోజకవర్గానికి 5 వేలు ఇండ్లు కావాలని ఎమ్మెల్యే అడిగారని, సీఎం కేసీఆర్ను ఒప్పించి మంజూరు చేస్తామని చెప్పారు. తూర్పు నియోజకవర్గ సమగ్రాభివృద్ధిపై సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించారన్నారు. అకాల వర్షాలతో పంటలు నష్టపోతే బీజేపీ పాలిత రాష్ర్టాల్లో ఎకరానికి రూ.2 వేలు ఇస్తున్నారని, తెలంగాణలో రూ.10 వేలు ఇస్తున్నారని స్పష్టం చేశారు. అకాల వర్షాలతో తడిసిన ప్రతి ధాన్యం గింజనూ కొనుగోలు చేస్తామని, రైతులు ఆందోళన పడొద్దన్నారు. తెలంగాణ ప్రజలను అబద్ధాలతో మభ్యపెడుతున్న బీజేపీ నాయకులను ఎక్కడికక్కడ నిలదీయాలన్నారు. ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ మాట్లాడుతూ ప్రజల శ్రేయస్సుతోపాటు కార్యకర్తల బాగోగులు చూసుకునే ఏకైక పార్టీ బీఆర్ఎస్ అని అన్నారు. 35వ డివిజన్లో దాదాపు రూ.35 కోట్లతో వివిధ అభివృద్ధి పనులు చేపట్టినట్లు చెప్పారు.
ఈ డివిజన్లో ముంపు సమస్యను పరిషరించేందుకు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మించినట్లు చెప్పారు. డివిజన్లో 2500 కుటుంబాలకు వివిధ పథకాల నుంచి లబ్ధి చేకూరిందన్నారు. తాను 29 ఏళ్లుగా రాజకీయాల్లో కొనసాగుతున్నానని, ప్రతీ క్షణం ప్రజల అభివృద్ధి గురించే ఆకాంక్షించానన్నారు. అందుకు సీఎం కేసీఆర్ ఆశీస్సులు, మంత్రి కేటీఆర్ మార్గదర్శకంతో పాటు మంత్రి దయన్న సహకారం లభిస్తున్నట్లు చెప్పారు. కొందరు తనపై ఆరోపణలు చేసినా వాటిని నిరూపించలేకపోయారన్నారు. వందేళ్లు గుర్తుంచుకునే విధంగా ప్రజలకు సేవచేస్తానన్నారు. అభివృద్ధి పరంగా తూర్పులో గణనీయత ఉందన్నారు.
కార్యకర్తలను కడుపులో పెట్టుకొని కాపాడుకుంటానన్నారు. ప్రశాంతంగా ఉన్న తూర్పు నియోజకవర్గంలో మతాల మధ్య చిచ్చు పెట్టాలనుకునే పార్టీలకు ప్రజలే తగిన బుద్ధి చెబుతారన్నారు. అనంతరం కార్యకర్తలతో కలిసి ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ భోజనం చేశారు. అంతకుముందు మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావుకు ప్రజలు, పార్టీ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. బతుకమ్మ, బోనాలు, కోలాటం, డప్పు, డోలు వాయిద్యాలతో ఖమ్మం ప్రధాన రహదారి నుంచి సభా స్థలి వరకు ఊరేగింపుగా తీసుకువచ్చారు. కార్యక్రమంలో సరోగసీ బోర్డు ఎక్స్పర్ట్ మెంబర్ డాక్టర్ హరి రమాదేవి, 35వ డివిజన్ కార్పొరేటర్ సోమిశెట్టి ప్రవీణ్, తూర్పు నియోజకవర్గం కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తలు పాల్గొన్నారు.