నర్సంపేట రూరల్, డిసెంబర్ 9: నర్సంపేట పట్టణంలోని శ్రీధర్మశాస్త్ర అయ్యప్పస్వామి ఆలయంలో 22వ (ద్వివింశతి) మండల పూజ మహోత్సవాల్లో భాగంగా శుక్రవారం జరిగిన పంబారట్టు కార్యక్రమం వైభవోపేతంగా జరిగింది. నర్సంపేట మండలం మాదన్నపేట పెద్ద చెరువులో వేలాది మంది మాలధారుల ఆధ్వర్యంలో తాంత్రిక వేత్త, గురుస్వామి సీ వెంకటేశ్శర్మ వేదమంత్రోచ్ఛారణల మధ్య పంబారట్టును వేడుకగా నిర్వహించారు. కేరళ రాష్ట్రంలోని పంపానదిలో అయ్యప్పస్వామి జలక్రీడల ఉత్సవాలు ఎలా జరుగుతాయో.. మాదన్నపేట పెద్ద చెరువులో అదేరీతిలో జలక్రీడలను నియమనిష్టలతో నిర్వహించారు.
ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి-జడ్పీ ఫ్లోర్లీడర్ పెద్ది స్వప్న దంపతుల ఆధ్వర్యంలో పంబారట్టు కార్యక్రమం వైభవంగా జరిగింది. తొలుత అయ్యప్ప ఆలయంలో పెద్ది దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అయ్యప్పను వాహనంపై పట్టణంలోని నర్సంపేట-వరంగల్ రోడ్డులో వేలాది మంది భక్తుల మధ్య ఊరేగింపు నిర్వహించారు. వాహనాన్ని ఎమ్మెల్యే సుదర్శన్రెడ్డి స్వయంగా నడిపారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రెండు గుర్రాలు, రెండు ఒంటెలపై గురుస్వాములు, అయ్యప్ప స్వాములు, కన్నె స్వాములు ఎక్కి గుర్రపు స్వారీ చేశారు. దీంతో గుర్రపు స్వారీలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. మహిళలు మంగళహారతులతో ఎదురొచ్చి కొబ్బరికాయలు కొట్టి భక్తి భావాన్ని చాటుకున్నారు.
అయ్యప్పకు ఘనంగా జల క్రీడలు..
తాంత్రిక వేత్త, గురుస్వామి వెంకటేశ్శర్మ వేదమంత్రోచ్ఛారణల మధ్య మాదన్నపేట పెద్ద చెరువు వద్ద మూడు గంటలపాటు అయ్యప్పకు జలక్రీడలు ఘనంగా నిర్వహించారు. తేనె, పండ్లు, జీడిపప్పు, చెక్కర, పెరుగు, పాలు, క్షీరం, కొబ్బరినీరు, విభూది, పసుపు, గంధం, పుష్పాలతో అభిషేకాలు చేశారు. జలక్రీడలను సంప్రదాయ పద్ధతుల్లో నియమనిష్టలతో నిర్వహించారు. భక్తులు, మాలధారులు చేసిన స్వామియే శరణం అయ్యప్ప నామస్మరణం మాదన్నపేట చెరువుకట్ట ప్రాంతంలో మార్మోగింది. అనంతరం 10 వేల మంది భక్తజనానికి 18 క్వింటాళ్ల బియ్యంతో పెద్ది దంపతులు మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. నర్సంపేట ఏసీపీ సంపత్రావు ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు చేపట్టారు. ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు పాల్గొన్నారు.