సుబేదారి, ఏఫ్రిల్ 30: ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో పని చేస్తున్న కాంట్రాక్టు అధ్యాపకులను రెగ్యులరైజ్ చేస్తూ ఆదివారం సీఎం కేసీఆర్ ఫైల్పై సంతకం చేశారు. ఈ మేరకు నగరంలో కాంట్రాక్టు అధ్యాపకులు ఆనందంలో మునిగితేలారు. ఈ సందర్భంగా ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి పెద్ద సంఖ్యలో అధ్యాపకులు హనుమకొండ సుబేదారి కీర్తిస్తూపం వద్దకు తరలివచ్చారు. అనంతరం సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. జై కేసీఆర్ నినాదాలు చేస్తూ స్వీట్లు పంపిణీ చేశారు.
సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటాం
తాము 23 ఏళ్లుగా చాలీచాలని వేతనాలతో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అధ్యాపకులుగా పని చేస్తున్నామని కాంట్రాక్టు అధ్యాపకుల సంఘం జిల్లా కో-కన్వీనర్ గంగారపు రమేశ్ తెలిపారు. తమ బాధలను సీఎం కేసీఆర్ అర్థం చేసుకొని రెగ్యులరైజ్ చేశారన్నారు. రాష్ట్రంలోని కాంట్రాక్టు అధ్యాపకులందరూ ముఖ్యమంత్రికి రుణపడి ఉంటారన్నారు. తమ కుటుంబాల్లో వెలుగులు నింపిన సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. ఒకేషనల్ అధ్యాపకుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కొలిపాక మధు మాట్లాడుతూ ఇంతకాలం కాంట్రాక్టు అధ్యాపకులు అనేక ఇబ్బందులు పడినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో తమను రెగ్యులరైజ్ చేసి తమ కుటుంబాల్లో సీఎం కేసీఆర్ వెలుగులు నింపారని కొనియాడారు. తామంతా ముఖ్యమంత్రి కేసీఆర్ వెంటే ఉంటామన్నారు. కార్యక్రమంలో కాంట్రాక్టు అధ్యాపకుల సంఘం హనుమకొండ జిల్లా అధ్యక్షుడు వెంకట్, ములుగు జిల్లా అధ్యక్షుడు లక్ష్మణ్, జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు సదానందం, వరంగల్ జిల్లా అధ్యక్షుడు మల్లేశ్, జనగామ జిల్లా అధ్యక్షుడు మాలి అశోక్, ఆయా జిల్లాల కమిటీ సభ్యులు, అధ్యాపకులు పాల్గొన్నారు.
ఉద్యోగుల కుటుంబాల్లో వెలుగులు
హనుమకొండ: కాంట్రాక్టు ఉద్యోగుల కుటుంబాల్లో సీఎం కేసీఆర్ వెలుగులు నింపారని టీఎన్జీవో హనుమకొండ జిల్లా అధ్యక్షుడు ఆకుల రాజేందర్ అన్నారు. నూతన సచివాలయం ప్రారంభం రోజున కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ ఫైల్పై సంతకం చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా రాజేందర్ ఆధ్వర్యంలో జిల్లా టీఎన్జీవో బాధ్యులు, ఉద్యోగులు, కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఉద్యోగులు పెద్ద ఎత్తున హర్షం వ్యక్తం చేస్తూ హనుమకొండ కలెక్టరేట్లోని టీఎన్జీవోస్ భవన్ ఆవరణలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి స్వీట్లు పంపిణీ చేశారు. అనంతరం రాజేందర్ మాట్లాడుతూ రెండు దశాబ్దాల నుంచి ఎదురుచూస్తున్న కాంట్రాక్టు ఉద్యోగుల కలను నిజం చేస్తూ సీఎం కేసీఆర్ 40 విభాగాల్లో 5,544 మంది కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించారన్నారు.
యావత్ ఉద్యోగుల పక్షాన, కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగ కుటుంబాల పక్షాన ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణకు సహకరించిన ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావుకు టీఎన్జీవోస్ యూనియన్ పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కాంట్రాక్ట్ హెల్త్ అసిస్టెంట్ల యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు వెంకటస్వామి మాట్లాడుతూ కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి హరీశ్రావుకు ఎల్లవేళలా రుణపడి ఉంటామన్నారు. కార్యక్రమంలో టీఎన్జీవోస్ జిల్లా నాయకులు లక్ష్మీప్రసాద్, రాజేశ్ఖన్నా, జీలకర రమేశ్, గౌతమ్, కాంట్రాక్టు హెల్త్ అసిస్టెంట్ల యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు వోడ్నాల వెంకటస్వామి, హనుమకొండ జిల్లా అధ్యక్షుడు డీ శ్రీనివాస్, కార్యదర్శి సంతోష్కుమార్, బండి కృష్ణమూర్తి, నాగయ్య, ఉపేంద్రాచారి, రాజేందర్, శ్యామ్సుందర్, రఘుపతి, లింగారెడ్డి, కృష్ణమూర్తి, ప్రేమ్కుమార్, సాయికృష్ణ పాల్గొన్నారు.