నల్లబెల్లి, డిసెంబర్ 28: మండలంలో ముమ్మరంగా ధాన్యం కొనుగోళ్లు చేపడుతున్నారు. ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా కురియడంతో రైతులు వానకాలం వరి సాగు వైపు మక్కువ చూపారు. అన్నదాతలు ఆశించిన దానికంటే ఎక్కువ దిగుబడి రావడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రైతులు పండించిన చివరి గింజ వరకూ కొనుగోలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందస్తుగా గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించింది. దీంతో రైతులు ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించేందుకు మక్కువ చూపుతున్నారు.
మండలంలో పీఏసీఎస్ ద్వారా 9, ఐకేపీ ఆధ్వర్యంలో 3, ఎఫ్పీవో 1 కలిపి మొత్తం మండలంలో 13 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. నేటి వరకు సహకార సంఘం ద్వారా 1,67,640 బస్తాల ధాన్యం కొనుగోలు చేయగా, ఐకేపీ ద్వారా 18,335, ఎఫ్పీవో ద్వారా 34 వేలు కలిపి మొత్తం 2,19,975 బస్తాల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు నిర్వాహకులు ప్రకటించారు. కొనుగోలు కేంద్రాల్లో విక్రయిస్తున్న రైతులకు ఐదు రోజుల్లో ఖాతాల్లో డబ్బులు జమయ్యేలా సంబంధిత అధికారులు చర్యలు చేపడుతున్నారని పీఏసీఎస్ సీఈవో నాగెల్లి మొగిలి తెలిపారు.
చివరి గింజ వరకూ కొనుగోలు చేస్తాం
రైతులు పండించిన ధాన్యాన్ని చివరి గింజ వరకూ కొనుగోలు చేస్తాం. రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన ధరతోనే కొంటున్నాం. క్వింటాల్కు ఏ-గ్రేడ్ రకం రూ. 2060, కామన్ రకం రూ. 2040 మద్దతు ధర కల్పిస్తూ ఐదు రోజుల్లోనే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అయ్యేలా చర్యలు చేపడుతున్నాం. రైతులకు గన్నీ సంచుల కొరత లేకుండా చూస్తున్నాం. మండలంలోని రైతులు దళారుల చేతిలో మోసపోకుండా ధాన్యాన్ని కొనుగోలు చేయడమే ధ్యేయంగా పని చేస్తున్నాం.
– చెట్టుపెల్లి మురళీధర్రావు, పీఏసీఎస్ చైర్మన్