వరంగల్, ఫిబ్రవరి 26 : డివిజన్లలో పేరుకుపోతున్న సమస్యలు.. పెండింగ్లో వందల కోట్ల అభివృద్ధి పనులు.. వెరసి ప్రజల్లో తిరుగలేక పోతున్నామని, వెంటనే అత్యవసర కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేయాలని అన్ని పార్టీల కార్పొరేటర్లు డిమా ండ్ చేశారు. సోమవారం కార్పొరేషన్లో సుమారు 45 మంది సభ్యులు సమావేశం నిర్వహించారు. మేయర్ కార్పొరేటర్లను పట్టించుకోవడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎన్నికై దాదాపు మూడేళ్లు కావస్తున్నా ఇప్పటి వరకు డివిజన్లలో రూ.50 లక్షల పనులు చేయలేక పోయామని ఆవేదన వ్యక్తం చేశారు. సత్వరమే కౌన్సిల్ సమావేశం నిర్వహించకుంటే బడ్జెట్ సమావేశాన్ని బహిష్కరిస్తామని కార్పొరేటర్లే మేయర్ను హెచ్చరించారు. వెంటనే కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేయకుంటే మేయర్కు సహకరించేది లేదని తేల్చిచెప్పారు. సమావేశం అనంతరం మేయర్ గుండు సుధారాణిని వినతిపత్రం అందజేశారు. మేయర్ చాంబర్లో కలిసిన కార్పొరేటర్లు పలు అంశాలపై వాగ్వాదానికి దిగారు. సమావేశం నిర్వహించకుంటే అవిశ్వాసానికి వెనుకాడేది లేదని తేల్చి చెప్పారు.
నగర సమస్యలతో పాటు పెండింగ్లో ఉన్న అభివృద్ధి పనులు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధుల అంశాలను మంత్రి కొండా సురేఖ, గ్రేటర్ పరిధిలోని ఎమ్మెల్యేలను కలిసి వివరిస్తామన్నారు. వారిని కలిసిన తర్వాత కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేస్తానన్నారు. అనేక అభివృద్ది పనులు నిలిచిపోవడానికి నిధుల కొరత కారణమని చెప్పారు.