బడి బయట, మధ్యలో చదువు మానేసిన పిల్లలను గుర్తించే సర్వే ముమ్మరంగా కొనసాగుతున్నది. బడీడు పిల్లల ఉజ్వల భవిష్యత్తును తీర్చిదిద్దేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్బంధ విద్యాహక్కు చట్టాన్ని అమలుచేస్తున్నాయి. ఇందులో భాగంగా పాఠశాలలకు రాని బడీడు పిల్లలను గుర్తించి బడిలో చేర్పించేందుకు, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన కోసం రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు విద్యాశాఖ చర్యలు చేపట్టింది. ఈ నెల 11 నుంచి జనవరి 11వరకు సర్వే కొనసాగుతుంది. ఓఎస్సీ (ఔట్ ఆఫ్ స్కూల్ చిల్డ్రన్) పేరిట నిర్వహించే సర్వే ద్వారా 6-14 ఏళ్ల పిల్లలను, అదే విధంగా కళాశాల స్థాయిలో 15-19 ఏళ్ల పిల్లలను వేర్వేరుగా గుర్తించి జాబితాను రూపొందించి, వీరి వివరాలను ప్రబంధ్ పోర్టల్లో నమోదు చేస్తారు.
నెల్లికుదురు/భూపాలపల్లి రూరల్, డిసెంబర్ 12 : విద్యాహక్కు చట్టం ప్రకారం 6-14 సంవత్సరాలు కలిగిన బడీడు పిల్లలందరు పాఠశాలల్లో నమో దై ఉండాలి. డ్రాపౌట్స్ సంఖ్యను తగ్గించి ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల నమోదు శాతాన్ని పెంచే లక్ష్యంగా విద్యాశాఖ ఆధ్వర్యంలో బడి బయట పిల్లల సర్వే కార్యక్రమం నిర్వహిస్తున్నది. సీఆర్పీలు, ఐఈఆర్పీలు తమ కాంప్లెక్స్ పరిధిలోని గ్రామాల్లో ఇంటింటా సర్వే నిర్వహించి బడి బయట పిల్లలను గుర్తించి వారి వివరాలను నిర్ణీత ఫార్మాట్లో పూరిస్తున్నారు. బడీడు పిల్లలు పాఠశాలల్లో నమోదై లేకుంటే ప్రధానోపాధ్యాయుల సమక్షంలో తక్షణమే పాఠశాలల్లో నమోదు చేయించనున్నారు. ఈ సర్వే ఈ నెల 11న మొదలుకాగా జనవరి 11వరకు కొనసాగనున్నది. రోజువారీ సర్వేలో గుర్తించిన బడి బయట విద్యార్థులను రోజువారీగా ప్రబంధ్ పోర్టల్లో నమోదు చేస్తున్నారు జిల్లావ్యాప్తంగా 2022-23 విద్యా సంవత్సరంలోని బడిబయట పిల్లలు ప్రస్తూతం ఏ పాఠశాలలో నమోదు ఉన్నారు?, డ్రాప్బాక్స్లోని పిల్లలు ఏ పాఠశాలలో చదువుతున్నారు.? తదితర వివరాలను సర్వేలో గుర్తిస్తారు.
బడి బయట పిల్లల గుర్తింపు, డ్రాప్బాక్స్ పిల్లల ప్రస్తుత స్థితిపై సీఆర్పీలు, ఐఈఆర్పీలు నిర్వహించే సర్వేను ప్రతిరోజు అధికారులు పర్యవేక్షిస్తారు. కాంప్లెక్స్ పరిధిలో జరుగుతున్న సర్వేను కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు, సంబంధిత గ్రామాల్లో జరుగుతున్న సర్వేను పాఠశాల హెచ్ఎం నిత్యం పర్యవేక్షించాల్సి ఉంటుంది. మండలంలో మండల విద్యాశాఖ అధికారి ప్రతీ కాంప్లెక్స్ పరిధిలోని ఒక గ్రామంలో జరిగే సర్వేను పర్యవేక్షించి అప్పటివరకు సేకరించిన సమాచారంపై సమీక్ష నిర్వహించాలి.
6-14, 15-19 ఏళ్లలోపు పిల్లలందరు తప్పకుండా పాఠశాల, క ళాశాలల్లో నమోదై ఉండాలి. సీఆర్పీలు, ఐఈఆర్పీలు విధిగా ఇంటింటా సర్వే చేయాలి. సర్వే వివరాలను విద్యాశాఖ నిర్దేశించిన ఫార్మాట్లో సమగ్రంగా పొందుపర్చాలి. ఐఈఆర్పీలు మండల వ్యాప్తంగా ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థుల వివరాలను సేకరించాలి. బడి బయట పిల్లలను గుర్తించి తక్షణమే సంబంధిత గ్రామ పాఠశాల హెచ్ఎంతో ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలి. బడీడు పిల్లలెవ్వరు కూడా పాఠశాలలో నమోదై లేకుండా ఉండొద్దు. జనవరి 11కల్లా సర్వే పూర్తికావాలి. రోజువారీ సర్వే వివరాలను ఆన్లైన్లో పొందుపర్చాలి.
అందరికీ విద్య అందించాలన్నదే సర్వే లక్ష్యం. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పకడ్బందీగా సర్వే నిర్వహిస్తాం. సీఆర్పీలు క్షేత్రస్థాయిలో వెళ్లి సమాచారాన్ని సేకరిస్తారు. బడీడు పిల్లల వివరాలను ప్రబంధ్ పోర్టల్లో నమోదు చేస్తాం. జిల్లాలో నిరక్షరాస్యతను నిర్మూలించేందుకు కృషి చేస్తున్నాం. సర్వేలో గుర్తించిన పిల్లలు తిరిగి చదువుకునేలా చర్యలు తీసుకుంటాం.