ములుగు, మే14(నమస్తేతెలంగాణ): ప్రజల అవసరాల నిమిత్తం ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ప్రత్యేకంగా గుర్తింపు కోసం చూపించాల్సిన ఆధార్ కార్డు అప్గేట్తో ఎన్నో ప్రయోజనాలున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో మార్కెట్లో ఆధార్ కార్డు ఉపయోగం ప్రతి ఒక్కరికి తెలిసిందే. సిమ్కార్డు నుంచి మొదలు బ్యాంకు ఖాతా, వాహనాలు, ఇండ్లు, భూములు, విద్య, వైద్యం పొందే సమయాలతో పాటు క్రయ, విక్రయాలు, ప్రభుత్వ పథకాలు, విద్యార్థులకు ఉపకార వేతనాలు పొందే వరకూ ఆధార్కార్డు తప్పనిసరిగా మారింది. అయితే ఆధార్ కార్డు వచ్చిన తొలి నాళ్లలో తీసుకునే వారి కార్డుల వినియోగంలో ప్రస్తుతం ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
ముఖ్యంగా ఫొటోలు, చిరునామాల మార్పు, తప్పొప్పులతో తిరస్కరణకు గురవుతున్నాయి. దీంతో భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థకు ప్రజల నుంచి పలు ఫిర్యాదులు అందడంతో ఆధార్ కార్డుల సవరణతో పాటు అప్డేట్ చేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. 2014 కంటే ముందు ఆధార్కార్డు పొందిన వారు తమ వివరాలను అప్డేట్ చేసుకోవాలని సూచిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కార్డు నవీకరణ చేసుకునేందుకు జూన్ 14వ తేదీవరకు గడువు విధించింది. దీంతో ఆధార్ సెంటర్లు, మీ సేవ కేంద్రాలు, బ్యాంకులు, పోస్టాఫీసుల్లో తగిన డాక్యుమెంట్లతో ప్రజలు క్యూలు కడుతున్నారు.
పదేళ్లు దాటితే తప్పనిసరి
చిన్నారులు ఆధార్కార్డు తీసుకునే సమయంలో ఇచ్చిన ఆధార్ కార్డును ఐదేళ్ల వయస్సు వచ్చిన తర్వాత వేలిముద్రలు, ఫొటోలను అప్డేట్ చేసుకునే అవకాశం ప్రభుత్వం కల్పించింది. అదేవిధంగా పదేళ్ల కిందట అధార్ కార్డు పొందిన వారంతా ప్రస్తుతం అప్డేట్ చేసుకోవాలని యూఐడీఏఐ సూచిస్తోంది. సుదీర్ఘ కాలం అనంతరం ఆధార్ కార్డుల్లో మార్పులకు సర్కారు అవకాశం కల్పించడంతో తప్పులు సరిచేసుకునేందుకు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న వారంతా కార్డులను అప్గ్రేడ్ చేసుకునేందుకు ముందుకు వస్తున్నారు. ప్రధానంగా 2010-18వరకు ఆధార్ నమోదు చేసుకున్న కార్డుదారులు అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. వివాహానికి ముందు తండ్రి పేరు ఉన్న మహిళల ఆధార్కార్డులు వివాహం అనంతరం భర్త పేరు మార్చుకునేందుకు గతంలో అవకాశం ఉండకపోయేది. దీనికి ఆయా స్థానాల్లో కేరాఫ్గా మాత్రమే ఉపయోగిస్తున్నారు. ప్రస్తుతం వాటిని సైతం మార్చుకునేందుకు అవకాశం కల్పించారు. ఇదిలా ఉండగా 70 ఏళ్లు దాటిన వారికి అప్డేట్లో మినహాయింపు ఇచ్చారు.
ఆన్లైన్లోనూ అవకాశం
ఆధార్ కార్డు అప్డేట్ చేసుకునే క్రమంలో ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా ఎలాంటి రుసుము చెల్లించకుండా ఆన్లైన్లో స్వతహాగా కూడా అప్డేట్ చేసుకునే అవకాశాన్ని యూఐడీఏఐ కల్పించింది. మై ఆధార్ పోర్టల్, ఎం ఆధార్ యాప్ ద్వారా myaadhaar.uidai.gov.inపై క్లిక్ చేసి ఫోన్ నంబర్ నమోదు చేసిన తర్వాత వచ్చే ఓటీపీ ద్వారా లాగిన్ అవ్వాలి. ఆధార్ అప్డేట్ చేసుకునేందుకు సంబంధిత ధ్రువీకరణ పత్రాలను నిక్షిప్తం చేసేందుకు డాక్యుమెంట్ అప్డేట్ ఆప్షన్పై క్లిక్ చేయాలి. అందులో పేరు, ఇతర వివరాలను రుజువు చేస్తూ తగిన ధ్రువపత్రాలు అప్లోడ్ చేయాలి.
అనంతరం చిరునామా నిరూపించే పత్రాన్ని అప్లోడ్ చేసి సమర్పించాలి. వెంటనే ఆధార్ అప్డేట్ పూర్తయినట్లు ఫోన్ నంబర్కు మెసేజ్ వస్తుంది. ఆధార్ నమోదు కేంద్రాలు, మీ సేవ కేంద్రాల్లో ఆధార్కార్డును అప్డేట్ చేసుకునేందుకు చెల్లించాల్సిన రుసుములపై ప్రభుత్వం స్పష్టమైన నిబంధనలను రూపొందించింది. బయో మెట్రిక్ అప్డేట్ కోసం రూ.100, డెమోగ్రాఫిక్ అప్డేట్కు రూ.50, ఆధార్ డౌన్లోడ్, కలర్ ప్రింట్కు రూ.30 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. ఇంతకు మంచి డబ్బులు వసూలు చేసినట్లయితే సంబంధిత ఆధార్ సెంటర్ కోడ్ నంబర్తో టోల్ఫ్రీ నంబర్ 1947కు ఫిర్యాదు చేసేలా ఏర్పాట్లు చేశారు.