మహబూబాబాద్, జనవరి 22 (నమస్తే తెలంగాణ): రేషన్ షాపుల్లో ఈ-కేవైసీ(ఎలక్ట్రానిక్ నో యువర్ కస్టమర్) ప్రక్రియ గడువులోగా పూర్తయేలా కనిపించడం లేదు. ఇంకా చాలా జిల్లాల్లో కొనసాగుతూనే ఉన్నది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా ఆహారభద్రత కార్డులకు ఈ-కేవైసీ ప్రక్రియను అధికారులు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా అమలు చేస్తున్నారు. హనుమకొండ జిల్లా ఈ-కేవైసీ ప్రక్రియలో ముందుండగా, మహబూబాబాద్ జిల్లా చివరి స్థానంలో ఉంది. ఈ ప్రక్రియ తుది గడువు ఈ నెల 31తో ముగియనుండడంతో వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. గడువు పెంచాలని కోరుతున్నారు. రెండు జిల్లాల్లో 75 శాతం పూర్తి కాగా, మిగిలిన నాలుగు జిల్లాల్లో 60శాతానికే పరిమితమైంది. ఈ నెల 31వరకు వంద శాతం పూర్తవడం గగనంగా మారింది. మరో నెల రోజుల పాటు పొడిగించినా వంద శాతం ఈ ప్రక్రియ పూర్తికాదని అధికారులు చెబుతున్నారు.
ఈ- కేవైసీ పేరుతో కేంద్ర ప్రభుత్వం పేద, మధ్యతరగతి కుటుంబాలను ఇబ్బందులకు గురిచేస్తున్నదని ఆవేదన చెందుతున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో మొదటి స్థానంలో హనుమకొండ, రెండో స్థానంలో వరంగల్ జిల్లా, మూడో స్థానంలో జయశంకర్ భూపాలపల్లి, నాలుగో స్థానంలో జనగామ, ములుగు ఐదో స్థానం, మహబూబాబాద్ జిల్లా చివరి స్థానంలో ఉంది. రేషన్ కార్డులో ఉన్న ప్రతి సభ్యుడి వేలిముద్రను రేషన్డీలర్లు మిషన్ల ద్వారా తీసుకుంటున్నారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 75శాతం కూడా పూర్తి కాలేదని, ఈ నెలాఖరుకు పూర్తి కావడం కష్టమేనని అధికారులు, డీలర్లు చెబుతున్నారు. ఈ-కేవైసీ ప్రక్రియను ముందుగా 2023 డిసెంబర్ 31తేదీ లోపు పూర్తి చేయాలని భావించినా పూర్తి కాలేదు. మళ్లీ ఈనెల 31వరకు గడువును పొడిగించారు. ఈ నెల 31వరకు పూర్తయ్యే పరిస్థితి కనిపించకపోవడంతో ఈ-కేవైసీ గడువును మరింత పెంచే అవకాశం లేకపోలేదు. కేంద్ర ప్రభుత్వం ఒకవైపు రేషన్ షాపుల్లో, మరోవైపు గ్యాస్ ఏజెన్సీల్లో ఈ-కేవైసీ అమలు చేస్తూ ప్రజలను పరేషాన్ చేస్తున్నది.