ఐనవోలు, జనవరి 16 : సంక్రాంతి సందర్భంగా ఐనవోలు బ్రహ్మోత్సవాలకు భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎల్లమ్మకు, స్వామివారికి బోనాలు సమర్పించారు. అర్చకులు ఉత్తరాయణ పుణ్యాకాలం, విఘ్నేశ్వరపూజ, పుణ్యాహవాచనం, మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, బిల్వార్చన చేసి శివలింగాన్ని అలంకరించారు. మల్లికార్జునస్వామిని బంగారు మీసాలు, వెండి కిరీటం, వెండి కవచం, గజ పుష్పమాలతో ముస్తాబు చేశారు.
మార్నేని వంశీయుల ఆధ్వర్యంలో మహానివేదన రథాన్ని సుందరంగా ముస్తాబు చేశారు. డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్రావు తన ఇంటి వద్ద కొబ్బరి కొట్టి రథాన్ని ప్రారంభించారు. ప్రధాన రోడ్లు, పుర వీధుల్లో పెద్ద బండికి మహిళలు మంగళహారతులు పట్టారు. పెద్ద బండిని చూసేందుకు వచ్చిన భక్తులతో వీధులన్నీ కిక్కిరిసిపోయాయి. మహానివేదనను తీసుకొచ్చిన మార్నేని రవీందర్రావును ఈవో అద్దంకి నాగేశ్వర్రావు, అర్చకులు, సిబ్బంది ఘనంగా సన్మానించారు. అనంతరం ఒంటిమామిడిపల్లి, ముల్కలగూడెం, పెరుమాండ్లగూడెం గ్రామాల నుంచి వచ్చిన ప్రభల బండ్ల నిర్వాహకులను ఆలయ అధికారులు సన్మానించారు. సంక్రాంతి రోజున స్వామివారిని మాజీ ఉప ముఖ్యమంత్రి, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, వరంగల్ కలెక్టర్ గోపి దంపతులు, ఎర్రబెల్లి ట్రస్టు నిర్వాహకులు ఉషాదయాకర్రావు, మాజీ ఎమ్మెల్యేలు కొండేటి శ్రీధర్, మార్తినేని ధర్మరావు, మజ్జిగ జయపాల్, మాజీ మేయర్ ఎర్రబెల్లి స్వర్ణ వరదరాజేశ్వర్రావు, హీరోయిన్ పూనం కౌర్ దర్శించుకున్నారు.