చేర్యాల, జనవరి 22 : పట్నం వారం సందర్భంగా కొమురవెల్లి మల్లన్న క్షేత్రం పసుపువర్ణ శోభితమైంది. భక్తులు చల్లుకున్న పసుపుతో స్వామివారి సన్నిధి పసుపుమయమైంది. పంచవర్ణాల పెద్ద పట్నాన్ని దాటుకుంటూ అగ్నిగుండ ప్రవేశం చేస్తూ మేడలమ్మ, కేతమ్మ సమేత మల్లికార్జునుడిని దర్శించుకొని భక్తులు తన్మయత్వం పొందారు.
కొమురవెల్లి మల్లికార్జునస్వామి దేవస్థానం వద్ద పెద్దపట్నం, అగ్నిగుండాల కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. అర్చకులు స్వామి వారి ఉత్సవ విగ్రహాలను ఆలయం నుంచి పెద్దపట్నం, అగ్నిగుండం వరకు తీసుకొచ్చి పూజలు నిర్వహించగా అర్చకులు దాటిన వెంటనే భక్తులు దాటారు. అంతకుముందు భక్తులు పసుపును ఒళ్లంతా పూసుకోవడంతో పాటు ఒకరిపై ఒకరు చల్లుకున్నారు.