Warangal | వరంగల్, ఫిబ్రవరి 28 (నమస్తే తెలంగాణ): వానకాలంలో హరితహారం మొక్కలు నాటేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు. జిల్లాలోని 323 నర్సరీల్లో 19,63,800 మొక్కలను పెంచడమే లక్ష్యంగా ప్రణాళిక రూపొందించారు. ఈమేరకు ప్రతి గ్రామ పంచాయతీ నర్సరీలో 6వేల మొక్కలు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. నీడనిచ్చే, పండ్లు, పూల మొక్కలను పెంచుతున్నారు. రాష్ట్రంలో పచ్చదనాన్ని పెంచేందుకు ప్రభుత్వం తెలంగాణకు హరితహారం కార్యక్రమాన్ని ఏటా వానకాలంలో పల్లెలు, పట్టణాల్లో ఉద్యమంలా నిర్వహిస్తోంది. రహదారుల పక్కన, ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల కార్యాలయాల ఆవరణల్లో పెద్ద సంఖ్యలో మొక్కలను నాటుతోంది. నీడనిచ్చే, పండ్లు, పూల మొక్కలను ఇంటింటికీ పంపిణీ చేస్తోంది. ఆయా గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీల పరిధి నర్సరీల్లోనే మొక్కలు పెంచుతోంది. వాటిని ప్రజలకు జూన్, జూలై నెలల్లో పంపిణీ చేయడంతోపాటు నాటేందుకు అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపి ఆమోదం పొంది, ఏటా నవంబర్ నుంచే నర్సరీల్లో మొక్కల పెంపకం చేపడుతారు. ఈసారి కూడా జిల్లాలో గత ఏడాది నవంబర్లో మొక్కల పెంపకం చేపట్టారు. జిల్లాలో 323 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ప్రభు త్వం పంచాయతీకో నర్సరీ చొప్పున ఏర్పాటు చేసింది. రానున్న వానకాలం హరితహారం కార్యక్రమ నిర్వహణకు జిల్లాలో ఉన్న 323 జీపీల పరిధి నర్సరీల్లో 19,63,800 మొక్కలను పెంచాలని నిర్ణయించింది. ప్రతి జీపీ నర్సరీలో 6 వేల మొక్కల చొప్పున పెంచాలని లక్ష్యం నిర్దేశించింది. గత నవంబర్లో బ్యాగు ఫిల్లింగ్ పనులు మొదలుపెట్టగా, కొద్దిరోజుల క్రితం విత్తనాలు కూడా మొలకెత్తాయి. ప్రభుత్వం సమకూర్చిన ట్యాంకర్ తో జీపీ సిబ్బంది మొక్కలకు నీరు అందిస్తున్నారు. సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, మండల పంచాయతీ అధికారులు, ఏపీఎం, డీపీఎంలు మొక్కల పెంపకాన్ని పర్యవేక్షిస్తున్నారు.
జీడబ్ల్యూఎంసీతోపాటు నర్సంపేట, వర్ధన్నపేట మున్సిపాలిటీలు కాకుండా 11 మండలాల్లో జీపీలు ఉన్నాయి. 323 నర్సరీల్లో ఈ ఏడాది కొత్తగా 19,63, 800 మొక్కల పెంపకం చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు. చెన్నారావుపేట మండలంలోని 30 జీపీల నర్సరీల్లో 1.80లక్షలు, దుగ్గొండి మండలంలోని 34 జీపీల 2.04లక్షలు, గీసుగొండలోని 21 నర్సరీల్లో 1,51,800, ఖానాపురంలోని 20 జీపీల నర్సరీల్లో 1.20లక్షలు, నల్లబెల్లిలోని 29 జీపీల నర్సరీల్లో లక్షల మొక్కలు పెంచుతున్నారు. నర్సంపేటలోని 27 జీపీల నర్సరీల్లో 1.62లక్షలు, నెక్కొండలోని 39 జీపీల నర్సరీల్లో 2.34లక్షలు, పర్వతగిరిలోని 33 జీపీల నర్సరీల్లో 1.98లక్షలు, రాయపర్తిలోని 39జీపీల నర్సరీల్లో 2.34లక్షలు, సంగెంలోని 33 జీపీల నర్సరీల్లో 1.98లక్షలు, వర్ధన్నపేటలోని 18 జీపీల నర్సరీల్లో 1.08లక్షల మొక్కల పెంచుతున్నట్లు డీఆర్డీవో ఎం.సంపత్రావు వెల్లడించారు. గత ఏడాది మిగిలిన పెద్దసైజ్ మొక్కలు కూడా ఉన్నట్లు తెలిపారు.
నర్సరీల్లో నీడనిచ్చే, పండ్లు, మొక్కలు ఉన్నాయి. నీడనిచ్చే మొక్కల్లో టేకు, నారేప, వేప, కానుగ, నెమలినార, చినబాదం, బూర్గు, కదంబ, కుంకుడు, పెల్టోపారం, దిరిసినం, మర్రి, వెదురు, సుబాబుల్, రేల, అవిస, పొగడ, యూకలిప్టస్, తుమ్మ, మద్ది, తునికి, ఇప్ప, సీమచింత, శ్రీగంధం, పులిచేరిమ ఉన్నట్లు అధికారులు వివరించారు. పండ్ల మొక్కల్లో దానిమ్మ, మామిడి, సపోట, మునగ, బొప్పాయి, బాదం, ఖర్జూర, ఈత, వెలగ, మారేడు, ఉసిరి, రేగు తదితర రకాలు, పూలమొక్కల్లో గులాబీ, జస్మిన్, అడవితంగేడు, కరివేపాకు, టికోమా, కోనోకార్పస్, తబేబుయ, తులసి, గోరింట, మహోగని, పారిజాత, మెడిసనల్ ప్లాంట్స్, కనకాంబరం, గన్నేరు ఉన్నట్లు తెలిపారు. పండ్లు, పూల మొక్కలను ఇంటింటికీ పంపిణీ చేయనున్నారు.