చేర్యాల, డిసెంబర్ 16 : కొమురవెల్లి మల్లికార్జున స్వామి క్షేత్రంలో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి శుక్రవారం రాత్రి పర్యటించారు. కల్యాణోత్సవ ఏర్పాట్లను పరిశీలించడంతో పాటు ఆలయ అధికారులు, పాలక మండలి సభ్యులు చేపట్టిన పనులపై ఆరా తీశారు. భక్తుల వసతుల కోసం తీసుకోవాల్సిన చర్యలను ఆలయ అధికారులకు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడు తూ మల్లన్న గుట్టపై ఢమరుకం, త్రిశూలం ఏర్పా టు పనుల కోసం ఆలయ అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. దాతలతో కలిసి పనులు జరిగేలా చూడాలన్నారు. భక్తులకు సకాలంలో దర్శనమయ్యే విధంగా ఆలయవర్గాలు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. భక్తులు వచ్చే వాహనాలు వెళ్లే దారులు విశాలంగా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని, రోడ్లపై ఎలాంటి వస్తువులు, ప్రైవేటు వాహనాలు పార్కింగ్ చేయకుండా సంబంధిత అధికారులు శ్రద్ధ వహించాలన్నారు. ఎమ్మెల్యే వెంట ఆలయ చైర్మన్ గీస భిక్షపతి, ఈవో ఆలూరి బాలాజీ, ఏఈవో వైరా గ్యం అంజయ్య, ఆలయ డైరెక్టర్లు, జడ్పీటీసీ సిద్ధప్ప, ఎంపీపీ కీర్తనాకిషన్, ఎస్సై చంద్రమోహన్ ఉన్నారు.
ఈ నెల 18న నిర్వహించే కొమురవెల్లి మల్లికార్జున స్వామి కల్యాణోత్సవం సందర్భంగా నిర్వహించే ప్రత్యేక పూజల వెండి తదితర సామగ్రిని ఆలయవర్గాలు సిద్ధం చేశాయి. కల్యాణంలో ఉపయోగించే కోరమీసాలు, ఖడ్గం, రుద్రాక్షమాల, స్వామి వారి నామాలు, పంచహారతి, రుద్రపాదం తదితర వెండి, పంచలోహ సామగ్రిని పూజలు నిర్వహించిన అనంతరం ఆలయవర్గాలు సిద్ధం చేశాయి. స్వామి వారి కల్యాణోత్సవం మొదలుకొని ఏకాదశరుద్రాభిషేకం, లక్షబిల్వార్చన తదితర పూజలకు సదరు సామగ్రి కీలకం కావడంతో ఏటా ఆలయవర్గాలు కల్యాణోత్సవం ముందు రోజుల్లో శుభ్రం చేసి పూజలు నిర్వహించడం అనవాయితీగా వస్తున్నది.