వరంగల్ చౌరస్తా : ఎంజీఎంహెచ్ ఆవరణలోని నర్సింగ్ స్కూల్ తరగతి గదిలో పైకప్పు పెచ్చులు ఊడిపడిపోయాయి. ఆదివారం రాత్రి సుమారు 9:45గంటల సమయంలో ఈ ఘనట చోటుచేసుకోగా సోమవారం ఉదయం విషయం వెలుగుచూసింది. మొదటి అంతస్తులోని తరగతి గదిలో భారీగా పెచ్చులు ఊడిపడటంతో విద్యార్థినిలు ఆందోళనకు గురవుతున్నారు. గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా భవనం పెచ్చులు ఊడిపోడినట్లు విద్యార్థులు తెలిపారు. గత సంవత్సరం వర్షాకాలంలో భవనం శిధిలావస్థకు చేరి విద్యార్థినిలు ఇబ్బందులు పడుతున్న విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లిన అధికారులు తాత్కాలిక చర్యలు మాత్రమే చేపట్టారే తప్ప మరమ్మతుల విషయంపై శ్రద్ధ కనబరచలేదు.
పెచ్చులు ఊడిపడిన సమయంలో తరగతిగదిలో ఎవరూ లేకపోవడంతో ఎటువంటి ప్రమాదం జరగలేదని, తరగతులు జరుగుతున్న సమయంలో పెచ్చులు పడవుంటే పరిస్థితి మరో తీరుగా ఉండేదని విద్యార్థినిలు ఆవేధన వ్యక్తం చేశారు. పెచ్చులు ఊడిపడిన ఘటనపై ఎంజీఎంహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ కిశోర్ కుమార్ వివరణ కోరగా భవనం మరమ్మతుల విషయం గతంలోనే ఉన్నతాధికారులకు సూచించామని, ఆదివారం రాత్రి జరిగిన ఘటనపై సోమవారం ఉదయం సమాచారం అందించడంతో డీఎంఈ స్పందించి వెంటనే భవనానికి మరమ్మతులు చేపట్టాలని ఆదేశించినట్లు తెలిపారు. ఘటన జరిగిన భవనంలోనికి మీడియాను అనుమతించకుండా గేటుకు తాళం వేయడంపై పలువురు అనుమానాలు వ్యక్తం చేసినప్పటికీ లోనికి అనుమతించలేదు.