కల్లిబొల్లి మాటలు.. వంచించే ముచ్చట్లు తప్ప ఓరుగల్లు ప్రజలకు ఏ హామీ ఇచ్చింది లేదు. ఆహా.. ఓహో అంటూ ఆర్భాటం చేయడం తప్ప.. వరంగల్ ప్రజల దశాబ్దాల డిమాండ్లను పట్టించుకున్నది లేదు. అందుకే కోచ్ ఫ్యాక్టరీ గురించి ఊసెత్తలేదు సరికదా.. గిరిజన యూనివర్సిటీపై స్పష్టత ఇవ్వకుండానే మమ అనిపించేశారు బీజేపీ అగ్రనాయకులు. భారీ బహిరంగ సభ పేరుతో శనివారం హనుమకొండ ఆర్ట్స్ కళాశాలలో బీజేపీ నిర్వహించిన సభ జనం లేక వెలవెలబోయింది. సగం మైదానం కూడా నిండకపోగా ఖాళీ కుర్చీల ముందే జాతీయ అధ్యక్షుడు నడ్డా, కేంద్ర మంత్రి కిషన్రెడ్డి కొద్దిసేపు ప్రసంగించినా పట్టించుకోని జనం ఇక బండి, అర్వింద్ మాట్లాడుతుండగా విసుగుతో వెనుదిరిగిపోవడం కనిపించింది.
వరంగల్, ఆగస్టు 27: హనుమకొండ సభలో బీజేపీ అగ్ర నాయకత్వం మరోసారి వరంగల్ ప్రజలను వంచించే ప్రయత్నం చేసింది. నాయకులు భారీ బహిరంగ సభ అంటూ ఊదరగొట్టి ఉత్తమాటలతో సరిపెట్టారు. కేంద్రంలో అధికారంలో ఉన్న మాటే గానీ దశాబ్దాల కాలంగా ఇక్కడి ప్రజల డిమాండ్ అయిన రైల్వే కోచ్ ఫ్యాక్టరీపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రి కిషన్రెడ్డి పల్లెత్తు మాట మాట్లాడలేదు. రైల్వే వ్యాగన్ ఓవరాలింగ్ ఫ్యాక్టరీ ఏర్పాటుపై కల్లిబొల్లి కబుర్లు చెప్పి జారుకోవడం తప్ప సభతో ఒరిగిందేమీలేదు. అలాగే, గిరిజన యూనివర్సిటీపై పాత పాటే పాడారు. బహిరంగ సభకు ముఖ్య అతిథిగా ఢిల్లీ నుంచి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వచ్చినప్పటికీ సభ ప్రారంభంలోనే ప్రసంగించి వెళ్లిపోవడంతో మిగితా సభ రాష్ట్ర నాయకులతో మమ అనిపించారు. రాష్ట్ర ప్రభుత్వం రైల్వే ఓవరాలింగ్ ఫ్యాక్టరీకి స్థలం కేటాయించిందని కిషన్రెడ్డి అంగీకరించినప్పటికీ నిర్మాణ పనులు ఎప్పుడు మొదలు పెడుతామన్నదానిపై స్పష్టత ఇవ్వలేదు. అలాగే ములుగులో ఏర్పాటు చేస్తామన్న గిరిజన యూనివర్సిటీపై వారు ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.
జనం లేకుండానే నడ్డా ప్రసంగం
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా జనం లేకుండానే ప్రసంగించారు. బహిరంగ సభ ప్రారంభంలోనే ఆయన మాట్లాడారు. అప్పటివరకు సభాస్థలి సగం ఖాళీగానే ఉంది. ఆయన సుమారు అరగంటపాటు హిందీలో ప్రసం గించి వెనుదిరిగారు. బహిరంగ సభకు ముఖ్య అతిథిగా విచ్చేసిన బీజేపీ జాతీ య అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రసంగానికి సభలో స్పందన కనిపించలేదు. ఆయన ప్రసంగిస్తున్న సమయంలోనే సభ నుంచి జనం వెళ్లిపోవడం కనిపించింది. అనంతరం కేంద్ర మంత్రి కిషన్రెడ్డి ప్రసంగంలో చప్పగా సాగింది. దీంతో సభకు వచ్చిన కోద్ది పాటి జనం సభ నుంచి వెనుతిరిగారు. జనం లేక వెలవెలపోయింది.