కుడా వైస్ చైర్మన్ను ఆదేశించిన రాష్ట్ర ప్రభుత్వం
నోటిఫికేషన్ రద్దు చేస్తూ ప్రకటన.. జిల్లా గెజిట్లో ప్రచురణ
రైతులు ఆందోళన చెందొద్దు : కుడా వైస్చైర్మన్ ప్రావీణ్య
ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్) నిర్మాణానికి చేపట్టే ల్యాండ్ పూలిం గ్ నోటిఫికేషన్ను కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ (కుడా) రద్దు చేసింది. నగరం చుట్టూ ఓఆర్ఆర్ నిర్మించేందుకు భూ సేకరణ కోసం గతంలో నోటిఫికేషన్ ఇవ్వగా రైతులు భయాందోళన వ్యక్తం చేశారు. దీన్ని పరిగణలోకి తీసుకోవాలని ఎమ్మెల్యేలు రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవించారు. దీంతో ల్యాండ్ పూలింగ్ నోటిఫికేషన్ రద్దు చేయాలని కుడా వైస్ చైర్మన్ ప్రావీణ్యను ఆదేశించింది. దీంతో నోటిఫికేషన్ను రద్దు చేస్తున్నట్లు ఆదివారం ప్రకటించారు. జిల్లా గెజిట్ను ప్రచురించారు.
వరంగల్, జూన్ 12 : నగరం చుట్టూ ఔటర్ రింగ్ రోడ్డు నిర్మించేందుకు చేపట్టే ల్యాండ్ పూలింగ్ (భూ సమీకరణ) కోసం కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ (కుడా) జారీ చేసిన నోటిఫికేషన్ను రద్దు చేశారు. హనుమకొండ, వరంగల్, జనగామ జిల్లాల్లోని 27 గ్రామాల్లో 41 కిలోమీటర్లు ల్యాండ్ పూలింగ్ చేయనున్నట్లు ఏప్రిల్ 30న భూ యజమానుల అంగీకారం కోసం జారీ చేసిన ఫారం-1 నోటిఫికేషన్ను రద్దు చేయాలని ప్రభుత్వం కుడా వైస్ చైర్మన్ను ఆదేశించింది. ఈమేరకు ఆదివారం ల్యాండ్ పూలింగ్ నోటిఫికేషన్ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ల్యాండ్ పూలింగ్ నోటిఫికేషన్ రద్దు చేస్తున్నట్లు జిల్లా గెజిట్ 10/ హెచ్ఎన్కే/2022 ప్రచురించినట్లు కుడా వైస్ చైర్మన్ ప్రావీణ్య తెలిపారు. ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణం కోసం చేపట్టిన ల్యాండ్ పూలింగ్ ప్రక్రియను ప్రభుత్వం పూర్తిగా రద్దు చేసినట్లు ప్రకటించారు. రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.
ఫలించిన ఎమ్మెల్యేల కృషి..
ల్యాండ్ పూలింగ్ నోటిఫికేషన్ రద్దుతో ఎమ్మెల్యేలు అరూరి రమేశ్, తాటికొండ రాజయ్య కృషి ఫలించింది. ల్యాండ్ పూలింగ్కు నోటికేషన్ వెలువడిన తర్వాత రైతులు వ్యక్తం చేసిన భయాందోళనలను మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకువెళ్లి రద్దు చేయాలని విన్నవించారు. వెంటనే స్పందించిన మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్కుమార్ మే 30న ల్యాండ్ పూలింగ్ రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. అయినప్పటికీ రైతుల్లో ఆందోళన తొలగలేదు. దీంతో మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, ఎమ్మెల్యేలతోపాటు వరంగల్, హనుమకొండ జిల్లాల కలెక్టర్లు రాజీవ్గాంధీ హనుమంతు, బీ గోపి, కుడా వైస్ చైర్మన్ ప్రావీణ్యతో చర్చించారు. రైతుల భయాందోళనలను పరిగణలోకి తీసుకొని ల్యాండ్ పూలింగ్ నోటిఫికేషన్ రద్దు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. దీంతో ప్రభుత్వం ఆదేశించగా నోటికేషన్ రద్దు చేస్తూ కుడా వైస్ చైర్మన్ ప్రకటించి, జిల్లా గెజిట్లో ప్రచురించారు.