రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగానికి అధిక ప్రాధాన్యమిస్తున్నది. పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు కృషి చేస్తున్నది. ఈ విద్యా సంవత్సరం నుంచే ఆంగ్ల బోధననూ ప్రారంభించింది. ‘మన ఊరు-మన బడి, మన బస్తీ-మన బడి’ కార్యక్రమం ద్వారా సర్కారు స్కూళ్లను బలోపేతం చేస్తున్నది. జిల్లాలో తొలి విడుతలో 223 పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పిస్తున్నది. ఇందులో 215 ప్రభుత్వ స్కూళ్ల అభివృద్ధికి అంచనాలు పూర్తయ్యాయి. ఇప్పటికే రూ.54 కోట్ల విలువైన పనులకు ప్రభుత్వం పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది. 150 పాఠశాలల్లో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. తరగతి గదులు, నీటి సరఫరా, టాయిలెట్లకు మరమ్మతులు శరవేగంగా సాగుతున్నాయి. కరంటు వసతితో పాటు గదుల్లో ఫ్యాన్లు బిగిస్తున్నారు. చిన్నారులకు మెరుగైన విద్య అందించడంతో పాటు త్వరలోనే నూతన హంగులతో సర్కారు స్కూళ్లు కార్పొరేట్కు దీటుగా మారనున్నాయి.
వరంగల్, ఆగస్టు 5(నమస్తేతెలంగాణ) : ‘మన ఊరు-మన బడి, మన బస్తీ-మన బడి’ కార్యక్రమంతో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారిపోతున్నాయి. కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా అభివృద్ధి చెందుతున్నాయి. ఇంగ్లిష్ మీడియం బోధన అమల్లోకి రావడంతో పాటు వసతులు సమకూరుతుండడంతో సర్కారు బడులకు ఆదరణ పెరుగుతున్నది. తల్లిదండ్రులు కూడా ఇపుడు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకు పంపేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ఆర్థిక భారం తగ్గించుకోవడానికి తోడు నాణ్యమైన విద్య కోసం సర్కారు బడులకు పంపుతున్నారు. విద్యకు అధిక ప్రాధాన్యం ఇస్తున్న ప్రభుత్వం ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచి అన్ని సర్కారు స్కూళ్లలో తొలివిడుత ఎనిమిదో తరగతి వరకు ఇంగ్లిష్ మీడియం బోధన అమల్లోకి తెచ్చింది. టీచర్లకు ఆంగ్ల మాధ్యమ బోధనపై శిక్షణ ఇచ్చింది. అన్ని పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమాన్ని అమల్లోకి తెచ్చిన రాష్ట్ర ప్రభుత్వం మన ఊరు- మన బడి, మన బస్తీ- మన బడి కార్యక్రమం ద్వారా సర్కారు స్కూళ్లను కార్పొరేట్కు దీటుగా తీర్చిదిద్దాలని నిర్ణయించింది. మూడు విడతల్లో అభివృద్ధి చేసేందుకు ప్రణాళిక రూపొందించింది. తొలివిడుత జిల్లాలో ముప్పై ఐదు శాతం అంటే 223 స్కూళ్లను ఎంపిక చేసింది. పనులు చేపట్టేందుకు నిధులు కేటాయించింది. మార్గదర్శకాలు విడుదల కావడంతో వివిధ ప్రభుత్వ శాఖల ఇంజినీరింగ్ విభాగాల అధికారులు స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ(ఎస్ఎంసీ)ల చైర్మన్లు, హెచ్ఎం, సర్పంచ్, ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి ఇటీవల ప్రభుత్వ పాఠశాలల్లో అవసరాలను గుర్తించారు. ఎస్టిమేట్స్ తయారు చేశారు. వీటికి దశల వారీగా ప్రభుత్వం నుంచి పాలనాపరమైన అనుమతులు పొందుతున్నారు. ఇప్పటి వరకు 215 స్కూళ్లలో అభివృద్ధి పనుల కోసం రూ.54 కోట్లకుపైగా పాలనాపరమైన అనుమతులు తీసుకున్నట్లు విద్యాశాఖ అధికారులు వెల్లడించారు.
ఊపందుకున్న పనులు..
ప్రస్తుత విద్యా సంవత్సరం ప్రారంభం కావడానికి ముందే జిల్లాలోని కొన్ని పాఠశాలల్లో పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావుతో పాటు ఎమ్మెల్యేలు ‘మన ఊరు-మన బడి, మన బస్తీ-మన బడి’ కార్యక్రమం ద్వారా అభివృద్ధి పనులను ప్రారంభించారు. రూ.30 లక్షల్లోపు పనులను ప్రభుత్వం ఎస్ఎంసీలకు అప్పగిస్తున్నది. అంచనా వ్యయం రూ.30 లక్షలకుపైగా ఉన్న స్కూళ్ల అభివృద్ధి పనుల కోసం టెండర్ల ప్రక్రియ నిర్వహిస్తున్నది. ఈ క్రమంలో ఎస్ఎంసీ చైర్మన్లు ఒప్పందం కుదుర్చుకుని పాఠశాలల్లో అభివృద్ధి పనులు చేస్తున్నారు. పాలనాపరమైన అనుమతులు పొందిన 215 స్కూళ్లలో అంచనా వ్యయం రూ.30 లక్షల్లోపు ఉన్న పాఠశాలలు 156 ఉన్నట్లు అధికారులు తెలిపారు. రూ.30 లక్షలకుపైగా ఉన్న స్కూళ్లు 59 ఉన్నాయని చెప్పారు. ఇప్పటికే అభివృద్ధి పనులు ప్రారంభమైన ప్రభుత్వ పాఠశాలలు సరికొత్త హంగులను సంతరించుకుంటున్నాయి. గదుల మరమ్మతులు, విద్యుత్ సరఫరా, ట్యూబ్ లైట్లు, ఫ్యాన్ల ఏర్పాటు, టాయిలెట్స్ నిర్మాణం, నీటి సరఫరా వంటి పనులు జరుగుతున్నాయి. రాయపర్తి, పర్వతగిరి, నెక్కొండ, వరంగల్ తదితర మండలాల్లోని కొన్ని పాఠశాలల్లో పూర్తయిన పనులకు చెల్లింపులు జరిపేందుకూ ఇంజినీర్లు ఎంబీలను రికార్డు చేశారు. ప్రస్తుతం జిల్లాలో 150 పాఠశాలల్లో అభివృద్ధి పనులు జరుగుతున్నట్లు అధికారులు తెలిపారు. కలెక్టర్ బీ గోపి, అదనపు కలెక్టర్ హరిసింగ్, డీఈవో వాసంతి పనులు జరుగుతున్న స్కూళ్లను సందర్శించి, ఇంజినీర్లు, హెచ్ఎంలు, ఎస్ఎంసీ చైర్మన్లు, ప్రజాప్రతినిధులకు సూచనలు చేశారు. కాగా, ప్రభుత్వ పాఠశాలల్లో మునుపెన్నడూ లేని రీతిలో కొత్తగా 9,363 అడ్మిషన్లు రాగా వీటిలో 6,256 ఇంగ్లిష్ మీడియం, 3,107 మంది తెలుగు మీడియంలో చేరారు. ఒక్క ప్రైవేట్ పాఠశాలల నుంచే ప్రభుత్వ స్కూళ్లకు వచ్చిన విద్యార్థులు 2,006 మంది ఉన్నారు.