స్టేషన్ఘన్పూర్, నవంబర్ 25: రైతులు సాంకేతికను అందిపుచ్చుకుంటే సాగులో అధిక దిగుబడులు సాధించవచ్చు. పంటలను రక్షించుకొని ఎక్కువ లాభాలు ఆర్జించవచ్చు. కోతులు, అడవి పందులు, పక్షులు తదితర వాటి నుంచి పంటలను కాపాడేందుకు అధునాతన పరికరాలు అందుబాటులోకి వస్తున్నాయి. ఆరుతడి పంటల చుట్టూ సోలార్ ఫెన్సింగ్ అమరిస్తే జంతువుల నుంచి కాపాడు కోవచ్చు. మంకీగన్, ఆర్తనాద మిషన్ నుంచి వచ్చే వివిధ రకాల శబ్దాలతో జీవాలు భయంతో పారిపోతాయి. ఈ పరికరాలను ఉపయోగిస్తే సాగులో అన్నదాతకు ప్రయోజనం కలుగనుంది.
పల్లి, కంది, మక్కజొన్న, దోస, కూరగాయలు తదితర పంటలతో రైతులకు లాభాలు ఉన్నప్పటికీ కోతులు, అడవి పందులు, ఎలుకలు, పక్షుల బెడదతో వాటిని వేయలేకపోతున్నారు. ఈ సమస్యను గుర్తించిన వ్యవసాయ శాస్త్రవేత్తలు అధునాతన పరికరాలను రైతులకు అందుబాటులోకి తీసుకువచ్చారు. ఇందులో భాగంగా సోలార్ ఫెన్సింగ్, మంకీగన్, ఆర్త నాద పద్ధతిలో కొన్ని యంత్రాలను రూపొందించారు. వాటి గురించి తెలుసుకుందాం.
సోలార్ ఫెన్సింగ్(అగ్రి సోలార్) : రైతులు ఆరు తడి పంటలు వేసినట్లయితే వాటి చుట్టూ సోలార్ ఫెన్సింగ్ వేసుకోవాలి. ఇందుకోసం రూ. 13వేలతో మిషన్ తెచ్చుకోవాల్సి ఉంటుంది. అడవి పందుల నివారణ కోసం రెండు వరుసలతో, కోతుల బెడద కోసం 6 నుంచి 8 వరుసలు పంట చుట్టూ ఫెన్సింగ్ చేయాలి. వైరు కిలో రూ. 80 ఉండగా, ఎకరా నికి సుమారు 80 నుంచి 110 కిలోలు సరిపోతుంది. సోలార్ మిషన్కు రెండేళ్ల గ్యారంటీ ఉంటుంది. సోలార్ ఫెన్సింగ్తో ఎలాంటి ప్రాణపాయం ఉండదు. ఇది ఏర్పాటు చేసుకోవడంతో కోతులు, పందులకు చిన్నపాటి షాక్ తగిలి భయంతో పారిపోతాయి.
మంకీగన్(అగ్రి కనాన్): ఈ పరికరం అధిక శబ్దం రావడంతో కోతులు భయపడి పారిపోతాయి. 20 నిమిషాలకు ఒకసారి మాత్రమే వాడాలి. కాల్షియం కార్బొనేట్ను 25 గ్రాములు ఉపయోగించి ఆరుసార్లు వాడవచ్చు. ఇందుకయ్యే ఖర్చు రూ. 25. ఇది స్టీల్బాడీతో ఉండడంతో చాలా ఏళ్లు వస్తుంది. దీని విలువ సుమారు 13,540. మార్కెట్లో ప్లాస్టిక్వి కూడా దొరుకుతాయి, వాటితో గాయాలయ్యే అవకాశం ఉంటుంది.
జంతు ఆర్తనాద మిషన్ : ఈ మిషన్ శబ్దాలకు పక్షులు, కోతులు భయపడి ఇటు వైపు రాకుండా ఉంటాయి. ఇం దులో 27 రకాల శబ్దాలు వస్తా యి. దీని విలువ సుమారు రూ. 19500. ఇందులో ఇంకోటి సెల్ ఫోన్ ద్వారా కూడా ఆపరేట్ చేయవచ్చు. దీని విలువ రూ. 22వేలు.
పంటలు కాపాడుకోవచ్చు..
పంట సాగులో కోతులు, అడవి పందులు, పక్షులకు చెక్ పెట్టేందుకు పరికరాలు ఉన్నాయి. రైతులు వీటిని ఉపయోగించి పంటలను రక్షించుకుని అధిక లాభాలు పొందవచ్చు. ఈ పరికరాలు కావాలనుకుంటే వ్యవసాయ అధికారులను సంప్రదించాలి. ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం, వరంగల్ దత్తత గ్రామమైన స్టేషన్ఘన్పూర్ మండలం మీది కొండ గ్రామంలో వీటిపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించాం.