నర్సంపేట, ఫిబ్రవరి 4 : బిట్కాయిన్ (క్రిప్టో కరెన్సీ).. ఇప్పుడు ఈపేరుతో కొత్త దందా వెలుగు చూసింది. ఆన్లైన్ ద్వారా ఇందులో పెట్టిన డబ్బులకు నాలుగింతలు తిరిగి వస్తాయని ఏజెంట్లు ఆశ చూపుతున్నారు. ఈజీగా మనీ సంపాదించవచ్చని నమ్మి ప్రజలు డబ్బులు పెడుతున్నారు. తీరా అవి రాకపోవడంతో తలలు పట్టుకుంటున్నారు. క్రిప్టో కరెన్సీ బాధితులు వరంగల్ జిల్లా నర్సంపేటలో వేలాది మంది ఉన్నారు. క్రిప్టో కరెన్సీని టోకెన్స్గా చెబుతున్నారు. ప్రస్తుతం రకరకాల క్రిప్టో కరెన్సీ చలామణిలో ఉంది. దీన్ని కొనుగోలు చేయాలంటే నిజమైన కరెన్సీని డాలర్ల రూపంలో వెచ్చించాల్సి ఉంటుంది. ఇందుకు అనేక ఎక్సేంజీలు అందుబాటులో ఉన్నాయి. అయితే ఏజెంట్లు ఇందులోని అసలు విషయాలను చెప్పకుండా నాలుగింతలు డబ్బులు వస్తాయని నమ్మిస్తున్నారు.
నర్సంపేట ప్రాంతంలో కొంతమంది ఏజెంట్లు రూ.1.70లక్షలు చెల్లిస్తే రూ.6లక్షలు తిరిగి వస్తాయని నమ్మిస్తున్నారు. ఇందులో చేరాలంటే వారు సూచించిన అకౌంట్లో ఆన్లైన్ ద్వారా రూ.1.70లక్షలు వేయాల్సి ఉంటుంది. అకౌంట్లలో డబ్బులు వేసి సభ్యులు చేరిన వారికి ప్రతి వారం రూ.13వేల చొప్పున అకౌంట్లో పడతాయి. ఇలా ఏడాది వరకు వస్తాయి. ఇందులో ప్లాన్ ఏ, ప్లాన్ బీ ఉన్నాయి. సభ్యులకు ఆన్లైన్లో యూజర్ నేమ్, పాస్వర్డ్, ఐడీ క్రియేట్ చేసి ఇస్తున్నారు. ఆ తర్వాత సభ్యుల అకౌంట్లలో డబ్బులు పడుతున్నాయి. కొంతకాలం మాత్రమే పడుతున్నాయి. కానీ, అందరికీ డబ్బులు పడుతున్నట్లు నమ్మిస్తున్నారు. కొంతకాలం తర్వాత డబ్బులు వేసిన వారి సంఖ్య పెరగడంతో క్రిప్టో కరెన్సీ నుంచి డబ్బులు అకౌంట్లలో పడడం నిలిచిపోతున్నది.
క్రిప్టో కరెన్సీలో డబ్బులు వస్తున్నాయని తెలిసి కుటుంబంలోని అందరూ సభ్యులుగా చేరుతున్నారు. అందరి పేర రూ.1.70లక్షల చొప్పున డబ్బులు చెల్లిస్తున్నారు. కొందరు అప్పు చేసి, బంగారు నగలు, భూములు, ఆస్తులు అమ్మి పెట్టుబడులు పెట్టారు. చివరకు డబ్బులు రాకపోవడంతో ఏజెంట్ల చుట్టూ తిరుగుతున్నారు. నర్సంపేట ప్రాంతంలో 5వేల మంది బాధితులు ఉన్నట్లు అంచనా.
మొదట జనగామ ప్రాంతానికి చెందిన నవీన్ అనే వ్యక్తి నర్సంపేటకు వచ్చి సభ్యులను చేర్పించాడు. నర్సంపేట డివిజన్లోని అతడి అత్తగారి గ్రామంలో ఉంటూ స్థానికులను, ఇతర మండలాలకు చెందిన వారిని ఏజెంట్లుగా చేర్చుకున్నారు. ఒక్కొక్కరూ ఒక్కో ఐడీలో 300 మంది చొప్పున చేర్పించారు. గ్రామాల్లో పలుకుబడి గల వ్యక్తులు ఏజెంట్లుగా పనిచేస్తుండడంతో చాలామంది నమ్మి చేరుతున్నారు. చివరకు నవీన్ అనే వ్యక్తిని దుగ్గొండి మండలం మహ్మదాపురం గ్రామానికి చెందిన వ్యక్తులు బుధవారం పట్టుకుని పోలీసు స్టేషన్లో అప్పగించడంతో అసలు మోసాల చిట్టా బయటకు పొక్కింది. ఇప్పుడు నవీన్ కింద మండలాల్లో ఉన్న ఏజెంట్లు పరారీలు ఉన్నారు. నిలదీసిన బాధితులకు డబ్బులు ఇస్తామంటూ కాగితాలు రాసిస్తున్నారు. నర్సంపేట డివిజన్లోని నర్సంపేట, దుగ్గొండి, నల్లబెల్లి, ఖానాపురం, చెన్నారావుపేట, దుగ్గొండి మండలాలతోపాటు మహబూబాబాద్ జిల్లాలోని మండలాలకు కూడా క్రిప్టో కరెన్సీని ఏజెంట్లు సభ్యులుగా చేర్పించారు.
ప్రపంచ వ్యాప్తంగా పలు రకాలుగా క్రిప్టో కరెన్సీలు ఉన్నాయి. కానీ వాటి గురించి వివరాలు తెలుసుకోకుండానే సభ్యులుగా చేరిపోతున్నారు. డబ్బులు అకౌంట్లలో వేసేస్తున్నారనే ఆశతో మోసపోతున్నారు. క్రిప్టో కరెన్సీలో అనేక లోపాలు ఉన్నందు వల్ల దీని జోలికి వెళ్లొద్దని ఇప్పటికే నిపుణులు హెచ్చరించారు. క్రిప్టో కరెన్సీ బాధితులు గ్రామాల్లోనే ఎక్కువగా ఉన్నారు. ఇప్పటికే మోసపోయామని భావిస్తున్న చాలామంది బాధితులు పోలీసు స్టేషన్కు వస్తున్నారు. క్రిప్టోకరెన్సీలో కొద్దిమందికి మాత్రమే డబ్బులు వచ్చాయి. చాలామందికి వారు పెట్టిన డబ్బులు కూడా రాకపోవడంతో తలలు పట్టుకుంటున్నారు. డబ్బులు ఎలా తిరిగి వస్తాయో అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఏజెంట్ల ఇళ్ల వద్దకు వెళ్తున్నా వారు దొరకడం లేదు. దీంతో తమ డబ్బులు ఎలా రికవరీలు చేసుకోవాలనే ఆలోచనల్లో బాధితులు పడ్డారు.