హనుమకొండ సబర్బన్, డిసెంబర్ 15 : ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ(ఎన్పీడీసీఎల్) చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్గా నియమితులైన కర్నాటి వరుణ్రెడ్డి గురువారం నక్కలగుట్టలోని కార్యాలయంలో ఉద్యోగ బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. వినియోగదారులకు మెరుగైన సేవలు అందించేందుకు ఉద్యోగులు కీలకపాత్ర పోషించాలన్నారు.
ఎన్పీడీసీఎల్ పరిధిలో వ్యవసాయ కనెక్షన్లు ఎక్కువగా ఉన్నాయని, 24 గంటల నాణ్యమైన విద్యుత్ను రైతులకు అందించాలని కోరారు. అందరూ కలిసికట్టుగా పని చేసి సంస్థ ను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేయాలని పిలుపు నిచ్చారు. కాగా, ఎన్పీడీసీఎల్ డైరెక్టర్లు వెంకటేశ్వర్రావు, గణపతి, సంధ్యారాణి, ఉద్యోగులు, సంఘాల నాయకులు ఆయనను కలిసి పుష్పగుచ్ఛాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు.