సుబేదారి, మార్చి 29: అటవీ శాఖ అధికారుల నిర్లక్ష్యం తునికాకు కాంట్రాక్టర్లకు లాభసాటిగా మారిం ది. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న కాంట్రాక్టర్లు గోదాముల్లోని తునికాకును బ్లాక్ మార్కెట్కు తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు.
భద్రాద్రి, కాళేశ్వరం జోన్లలో ఏటా తునికాకు సేకరణ టెండర్లు దక్కించుకున్న కాంట్రాక్టర్లు వరంగల్, హనుమకొండ జిల్లాలతోపాటు నగర పరిధిలోని గొర్రెకుంట, ఏనుమాముల మార్కెట్ పరిసర ప్రాంతాలు, హంటర్రోడ్డు, మడికొండలోని గోదాముల్లో నిల్వ చేస్తుంటారు. అటవీశాఖ అధికారుల పర్యవేక్షణలో వెయ్యి ఆకుల చొప్పున ప్రభుత్వానికి రాయల్టీ చెల్లించి బీడీ కంపెనీలకు వీరు విక్రయించాల్సి ఉంటుంది. ఏటా జనవరి, ఫిబ్రవరిలో తునికాకు ఏరియా యూనిట్ల వారీగా
సేకరించి విక్రయానికి టెండర్లు నిర్వహిస్తారు. అయితే చాలా మంది కాంట్రాక్టర్లు వరంగల్ జిల్లా గొర్రెకుంటలోని 15, హనుమకొండ జిల్లా హంటర్రోడ్డు, మడికొండలోని గోదాముల నుంచి బీడీ కంపెనీలకు విక్రయిస్తుంటారు.
గోదాముల్లో నిల్వ చేసిన తునికాకు బస్తాల్లో నాణ్యమైన వాటిని కాంట్రాక్టర్లు మాయం చేసి తమిళనాడులోని చెన్నై, పశ్చిమ బెంగాల్, ఢిల్లీ, యూపీ, మధ్యప్రదేశ్ రాష్ర్టాల్లోని బీడీ కంపెనీలకు విక్రయిస్తున్నట్లు తెలుస్తున్నది. 2022 సంవత్సరంలో 600పైగా బస్తాలు ఏనుమాముల మార్కెట్ సమీపంలోని గోదాము నుంచి మాయం చేసిన వ్యవహారం అడిటింగ్లో వెలుగుచూసింది. దీనికి కారణమైన కాంట్రాక్టర్పై ఇటీవల అటవీశాఖ అధికారులు అక్కడి పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది.
కొన్నేళ్లుగా తునికాకు వ్యాపారం చేస్తున్న అనేక మంది కాంట్రాక్టర్లు అధికారులను మేనేజ్ చేస్తున్నారని ఆరోపణలున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా ఏటా వందలాది తునికాకు బస్తాలకు పన్ను చెల్లించకుండానే బ్లాక్ మార్కెట్లో విక్రయిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రతి సీజన్లో రూ.కోటికిపై అక్రమంగా ఆర్జిస్తున్నారని తెలిసింది. కొత్త వారికి టెండర్లు దక్కకుండా అధికారుల అండ దండలతో ఏటా పాత కాంట్రాక్టర్లే దక్కించుకుంటున్నారనే విమర్శలున్నాయి. ఇంత జరుగుతున్నా అధికారుల పర్యవేక్షణ కొరవడడంతో సర్కారు ఖజానాకు పెద్ద ఎత్తున గండి పడుతున్నదని తెలుస్తున్నది.