బయ్యారం, ఫిబ్రవరి 16 : సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి, అజ్ఞాత దళ కమాండర్ అశోక్ (కుర్సం వజ్జయ్య)ను పోలీసులు అరెస్టు చేసినట్లు సమాచారం. వరంగల్ జిల్లా దళ కమాండర్ గోపన్న, మరో ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. బయ్యారం మండలం గురిమళ్ల గ్రామానికి చెందిన అశోక్ 40 ఏండ్ల క్రితం దళంలో సభ్యుడిగా చేరి కమాండర్, రాష్ట్ర కార్యదర్శిగా ఎదిగాడు. ఆయనపై జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్లలో అనేక కేసులు ఉన్నాయి. కొన్ని రోజులుగా పోలీసులు అశోక్ కోసం వెతుకుతున్నారు. ఈ నేపథ్యంలో ఖమ్మం నుంచి వస్తుండగా ఆయనను అరెస్ట్ చేసినట్లు తెలిసింది. పోలీసులు మాత్రం ధ్రువీకరించడం లేదు.
అరెస్ట్ చేసిన దళ కమాండర్లు అశోక్, గోపన్నతోపాటు పుల్లయ్య, మదార్, సురేశ్ అరెస్టును వెంటనే చూపాలని, కోర్టులో హాజరుపర్చాలని ఎన్డీ శ్రేణులు శుక్రవారం బయ్యారం మండలకేంద్రంలో గంధంపల్లి, వెంకట్రాంపురం గ్రామాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఎలాంటి ప్రాణ హాని తలపెట్టకుండా అరెస్ట్ చూపాలని సీపీఐ(ఎంఎల్ ) న్యూడెమోక్రసీ రాష్ట్ర సహాయ కార్యదర్శి సాదినేని వెంకటేశ్వర్లు, జిల్లా కార్యదర్శి గౌని ఐలయ్య, డివిజన్ నాయకులు నందగిరి వెంకటేశ్వర్లు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అరెస్టుల నేపథ్యంలో బయ్యారం ఏజెన్సీ గ్రామాలను భద్రాద్రికొత్తగూడెం జిల్లాకు చెందిన వంద మంది స్పెషల్ పార్టీ పోలీసులు జల్లెడ పడుతున్నారు. మిర్యాలపెంట, లక్ష్మీపురం, వెంకటాపురం, టేకులగూడెం గ్రామాల్లో ఇంటింటా సోదాలు చేస్తున్నారు. అటవీ ప్రాంతాలు, పంట పొలాలను సైతం వదలడం లేదు. దీంతో ఏజెన్సీ గ్రామాల ప్రజలు భయాందోళన చెందుతున్నారు.