జనగామ-సిద్దిపేట నడుమ దుద్దెడ 365-బీ ఎన్హెచ్ విస్తరణ కోసం రెండు దశాబ్దాలుగా ఎదురుచూపులు తప్పడం లేదు. 46 కిలోమీటర్ల పనుల కోసం రూ.450కోట్లు మంజూరు చేస్తున్నట్లు కేంద్రం ఆర్భాటంగా ప్రకటించి చేతులు దులుపుకొన్నది.
మానుకోట జిల్లాలో రెండు జాతీయ రహదారులకు తోడు మరో రెండు దారులను ఎన్హెచ్లుగా కేంద్రం గుర్తించినా రెండేళ్లుగా టెండర్లు నిర్వహించకుండా తాత్సారం చేస్తున్నది.
ములుగు జిల్లాలో ఎన్హెచ్ 163కి అరకొర నిధులే విడుదలవుతుండడంతోఎక్కడి పనులు అక్కడే నిలిచిపోతూ ఏటా వర్షాకాలంలో రెండు రాష్ర్టాల నడుమ రాకపోకలు స్తంభించిపోతున్నాయి.
వరంగల్ జిల్లా ఖానాపురం మండల పరిధిలో ఎన్హెచ్ 365 పనులు నాలుగేళ్లుగా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారాయి.
కేంద్రంలోని బీజేపీ సర్కారు అలసత్వం మూలంగా ఉమ్మడి జిల్లాలోని రెండు ఎన్హెచ్ల ‘దారి’ద్య్రం తొలగిపోవడం లేదు. జగిత్యాల-కరీంనగర్-వరంగల్ జిల్లా కేంద్రాల మీదుగా ఖమ్మం వరకు ఉన్న ఎన్హెచ్ 563 పరిస్థితి ఆదినుంచీ అధ్వానంగా ఉండగా, హైదరాబాద్, జనగామ, వరంగల్ మీదుగా ములుగు జిల్లా దాటి ఆవలి రాష్ట్రం వెళ్లే ఎన్హెచ్ 163 పనులు కొన్నిచోట్ల ఇంకా నత్తకు నడక నేర్పుతున్నాయి. కేంద్రం అరకొర నిధులను.. అదీ తాత్సారం చేస్తూ విడుదల చేస్తుండడంతో సమయానికి పనులు పూర్తికాక, ఒక్కచోట అయ్యేసరికి మరో చోటపాడైపోయి వీటిపై ప్రయాణమంటేనే ప్రాణాలకు నో గ్యారెంటీలా తయారైంది.
ఖానాపురం, నవంబర్ 11: ఉమ్మడి జిల్లా పరిధిలోని జాతీ య రహదారులకు గ్రహణం పట్టింది. పనుల కోసం కేంద్రం నిధుల విడుదలలో జాప్యం చేస్తుండడంతో కొన్నిచోట్ల ప్రయాణం నరకప్రాయంగా మారింది. ఇబ్బం దికర రూట్లలో ఏటా వందల మంది ప్రయాణికులు ప్రమాదాల పడి గాయాలపాలవుతున్నారు. పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్నారు. పెద్దపల్లి జిల్లాలో ని రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ ప్రారంభోత్సవానికి నేడు ప్రధాని మోదీ వస్తుండగా కొంచం ఇటువైపు చూసి పనులు వెంటనే పూర్తయ్యేలా చూ డాలని ఉమ్మడి జిల్లా ప్రజలు కోరుతున్నారు.
ఖానాపురం మండలం వేపచెట్టుతండా శివారులో అసంపూర్తిగా నిర్మించిన బ్రిడ్జి
ఏండ్ల తరబడి ఎదురుచూపులు
జనగామ-సిద్దిపేట జిల్లా దుద్దెడ 365-బీ ఎన్హెచ్ విస్తరణ కోసం రెండు దశాబ్దాలుగా ఎదురుచూపులు తప్పడం లేదు. ఆర్అండ్బీ పరిధిలో ఉన్న ఈ రోడ్డును ఎన్హెచ్ ఆధీనంలోకి వచ్చింది. 46 కిలోమీటర్ల పనుల కోసం రూ.450కోట్లు మంజూరు చేస్తున్నట్లు కేంద్రం అర్భాటంగా ప్రకటించింది.అప్పటి నుంచి జనగామ-సిద్దిపేట రోడ్డులో ప్రయాణికులు నానా పాట్లు పడుతున్నారు. ఆర్అండ్బీ నిర్వహణలో ఉన్నప్పుడు మరమ్మతులు జరిగి రాకపోకలు సజావుగా సాగేవి. జాతీయ రహదారుల అథారిటీ ఆధీనంలోకి తీసుకున్నాక రోడ్డు రిపేరును పూర్తిగా మరిచారు. మోకాళ్లలోతు గుంతలను భరిస్తూ ప్రజలు ప్రయాణం సాగిస్తున్నారు. వాస్తవానికి విజయవాడ (సూర్యాపేట క్రాస్రోడ్డు)- దుద్దెడ నేషనల్ హైవే విస్తరణ పనులకు కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాతే శ్రీకారం చుట్టారు.
సూర్యాపేట క్రాస్రోడ్డు నుంచి జనగామ శ్రీనివాస కాలనీ వరకు హైవే పనులు పూర్తయ్యాయి. హైదరాబాద్-వరంగల్ జాతీయ రహదారి జనగామ జిల్లా కేంద్రానికి వచ్చే పెంబర్తి బైపాస్ జంక్షన్ మీదుగా మరో బైపాస్ నిర్మిణానికి సంబంధించి స్థలసేకరణ నోటిఫికేషన్ ఇటీవలే విడుదలైంది. హైదరాబాద్ నుంచి జనగామ జిల్లా కేంద్రానికి వచ్చే పెంబర్తి జంక్షన్ సమీపాన ఉన్న రైల్వేట్రాక్ వెనుక నుంచి శామీర్పేట శివారు సుశీలమ్మ అనాథ వృద్ధాశ్రమం వరకు బైపాస్ నిర్మించాల్సి ఉంది. పెంబర్తి నుంచి శామీర్పేట వరకు పసరుమడ్ల నుంచి చంపక్హిల్స్ వెనక వైపు వరకు భూసేకరణ కోసం అధికారులు చేపట్టిన సర్వే వివాదాస్పదమైంది. జనగామ జిల్లా కేంద్రం పెంబర్తి జంక్షన్ నుంచి దుద్దెడ ఎక్స్రోడ్డు వరకు ఏడు మీటర్ల వెడల్పుతో 46కిలోమీటర్ల మేర ఉన్న ఈ రోడ్డును ప్రస్తుతం 10మీటర్లకు పెంచారు. పట్టణాల పరిధిలో నాలుగు లేన్ల విస్తరణ చేపట్టి..మిగతా ఆటవీ ప్రాంతంలో 10మీటర్ల వెడల్పుతో రెండు లేన్ల రోడ్డు నిర్మించాల్సి ఉంది. పెంబర్తి జంక్షన్ నుంచి శామీర్ శివారు, బచ్చన్నపేట, చేర్యాల, మర్రిముచ్చ్యాల పరిధిలో నాలుగు లేన్ల నిర్మాణం కోసం డీపీఆర్ రూపొందించారు. 90 డిగ్రీల ఆకారంలో ఉన్న బచ్చన్నపేట మలుపువద్ద భారీ వాహనాలకు ఇబ్బంది లేకుండా డిజైన్ చేశారు. జాతీయ రహదారుల మంత్రిత్వశాఖ నుంచి సకాలంలో నిధులు విడుదల కాక భూసేకరణ ఆలస్యమవుతోందని రెవెన్యూ అధికారి ఒకరు ‘నమస్తే’కు తెలిపారు. జనగామ నుంచి బచ్చన్నపేట మీదుగా చేర్యాల, సిద్దిపేట రహదారి మొత్తం పెద్దపెద్ద గుంతులుగా మారి నరకాన్ని తలపిస్తున్నది.
బుధరావుపేట-మంగళవారిపేట గ్రామాల మధ్య అసంపూర్తిగా నిర్మించిన కల్వర్టు పక్కనున్న గుంతలో పడి మృతిచెందిన ద్విచక్రవాహనదారుడు(ఫైల్)
టెండర్లకే నోచుకోలే
మానుకోట జిల్లాలో ఇప్పటికే రెండు జాతీయ రహదారులు ఉండగా, కొత్తగా మరో ఎన్హెచ్లను కేంద్రం ప్రకటించింది. సుమారు పదేళ్ల క్రితం ప్రతిపాదనలు పంపిస్తే రెండేళ్ల క్రితం ఆమోదం తెలిపింది. మానుకోట జిల్లా మీదుగా ఇప్పటికే వరంగల్ నుంచి వయా తొర్రూరు, మరిపెడ మీదుగా ఖమ్మం వరకు ఎన్హెచ్-563 అంతా గుంతల మయంగా మారింది. గూడురు, మహబూబాబాద్, మీదుగా మరిపెడ వరకు ఎన్హెచ్ 365 ఉంది. రెండేళ్ల క్రితం వయా వలిగొండ మీదుగా తొర్రూరు, నెల్లికుదురు, మహబూబాబాద్, బయ్యారం, ఇల్లందు మీదుగా భదాద్రి కొత్తగూడెం జిల్లా వరకు ఎన్హెచ్ 930పీ, కురవి నుంచి ఖమ్మం వరకు ఎన్హెచ్ 365ఏ మంజూరయ్యాయి. కానీ, పనులకు టెండర్లు కూడా నిర్వహించకుండా కేంద్రం జాప్యం చేస్తున్నది. దీంతో పనులకు ఇంకా ఎన్నేళ్లు పడుతుందోనని ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
నిర్మాణ లోపం.. నిర్వహణ శాపం
హనుమకొండ జిల్లాకేంద్రం మూడు జాతీయ రహదారులకు జంక్షన్గా ఉంది. హైదరాబాద్-భూపాలపట్నం ఎన్హెచ్ 163, వరంగల్-కరీంనగర్ ఎన్హెచ్ 563, ఎల్కతుర్తి-సిద్దిపేట-మెదక్ ఎన్హెచ్ 765 జిల్లా మీదుగా వెళ్తాయి. వీటి నిర్మాణం, నిర్వహణ లోపాలు వెక్కిరిస్తున్నాయి. 163పై రాంపూర్-చింతగట్టు క్యాంపు-ఆరెపల్లి వద్ద అండర్పాస్లు అస్తవ్యస్తంగా మారాయి. హైవే నుంచి కిందకి దిగి స్థానిక రోడ్లపైకి రావాలంటే తీవ్ర ఇబ్బందులు తప్పడం లేదు. లారీలు వస్తే ట్రాఫిక్ జామ్ తప్పదు. వాహనం తిరగాలంటే మూడు, నాలుగుసార్లు వెనక్కి, ముందుకు వెళ్తేకానీ రోడ్డెక్క లేదు. ఈ దుస్థితి గురించి రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ కేంద్ర రహదారుల శాఖ మంత్రి నితిన్గడ్కరీకి ఏడాది క్రితమే లేఖ రాసినా ఎలాంటి స్పందనా లేదు.
జంక్షన్లను భవిష్యత్ అవసరాల దృష్ట్యా విశాలంగా నిర్మించాల్సి ఉండగా ఇరుకుగానే ఉండడంతో నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయి. వినోద్కుమార్ ఎంపీగా ఉన్న సమయంలో వరంగల్-కరీంనగర్ హైవేను 563గా, ఎల్కతుర్తి-సిద్దిపేట-మెదక్ హైవేను 765డీజీ నంబర్లను కేటాయిస్తూ ప్రకటించినా ఇప్పటి వరకు ఎలాంటి పనులు మొదలు పెట్టలేదు. 563కి టెండర్లు పూర్తయి ఏడాది కావస్తున్నా తట్టెడు మట్టి కూడా ఎత్తిపోయలేదు. 765డీజీ రోడ్డుకు భూసేకరణ కూడా పూర్తి చేయలేదు.
ఏళ్లుగా ఎక్కడివక్కడే
ఎన్హెచ్ 365 పనులు వరంగల్ జిల్లా ఖానాపురం మండలంలో అసంపూర్తిగా నిలిచిపోయాయి. కాంట్రాక్టర్ 2015లో పనులను ప్రారంభించినా మల్లంపల్లి నుంచి బుధరావుపేట వరకు 33 కిలోమీటర్ల వరకే పూర్తి చేశారు. మండలకేంద్రంలో సెంట్రల్ లైటింగ్, సైడ్ డ్రైనేజీ తూతూ మంత్రంగా నిర్మించారు. మార్కింగ్ ప్రకారం తొలగింపులు లేక కళావిహీనంగా తయారైంది. మంగళవారిపేట నుంచి మహబూబాబాద్ జిల్లా కంబాలపల్లి వరకు 32 కిటోమీటర్ల మేర అటవీ అనుమతుల పేరిట కేంద్రం పనులను నిలిపివేసింది. మూడేళ్లుగా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా పనులు నిలిచిపోయాయి. అజ్మీరా సీతారాంనాయక్ ఎంపీగా ఉన్నప్పుడు కేంద్రం దృష్టికి తీసుకెళ్లడంతో ఎట్టకేలకు 2018లో అటవీ అనుమతులు మంజూరయ్యాయి. మంగళవారిపేట నుంచి కంబాలపల్లి వరకు 32 కిలోమీటర్ల మేర చేపట్టిన పనులు నాలుగేళ్లుగా కొనసాగుతున్నాయి. మండల పరిధిలోని వేపచెట్టుతండా శివారులో కిలోమీటరు మేర, మంగళవారిపేట, బుధరావుపేట మధ్యన కల్వర్టుల పనులు నేటికీ పూర్తికాలేదు. దీంతో నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయి. బ్రిడ్జిల సమీపంలో హెచ్చరిక బోర్డులు కూడా లేకపోవడంతో వేగంగా వచ్చి గుంతల్లో పడుతున్నారు.
ఇప్పటి వరకు బ్రిడ్జి సమీపంలో 30 మంది గాయపడ్డారు. వేపచెట్టుతండా శివారులో గతంలో మలుపులు ఉన్న రోడ్డును మార్చుతూ రైతుల పొలాల నుంచి డిజైన్ చేశారు. ఈ క్రమంలో కొందరు రైతుల పంట భూములు పోయాయి. ఇక్కడి హనుమాన్ ఆలయం కూడా తొలగించాల్సి వచ్చింది. నష్టపరిహారం చెల్లింపు విషయంలో స్పష్టత లేక కిలోమీటరు మేర పనులు నిలిచిపోయాయి.
ములుగు జిల్లాలో ఎన్హెచ్-163 పరిస్థితి దయనీయం
హైదరాబాద్ నుంచి ఛత్తీస్గఢ్లోని భూపాలపట్నం వరకు వెళ్లే 163 జాతీయ రహదారి ములుగు జిల్లాలో సుమారు 200 కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. ఏటూరునాగారం మండలం ముళ్లకట్ట వద్ద గోదావరిపై వంతెన పూర్తి కావడంతో ఈ రహదారి మీదుగా రాకపోకలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఎన్హెచ్ 163కి కేంద్రం అరకొర నిధులు విడుదల చేస్తుండడంతో పనులు ఇంకా పూర్తి కాలేదు. ముఖ్యంగా వర్షాకాలంలో వాజేడు మండలం టేకులగూడెం వద్ద లోలెవల్ బ్రిడ్జిపై నుంచి గోదావరి నీరు ప్రవహిస్తుండడంతో ఏటా వానకాలంలో రెండు రాష్ర్టాలకు రాకపోకలు నిలిచిపోతున్నాయి. అవాజేడు, ఏటూరునాగారం మండలాల పరిధిలోనూ మరమ్మతులు పూర్తి కాక ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు.
తాడ్వాయి మండలం జలగలంచ తోగు వద్ద లోలెవల్ బ్రిడ్జి మీదుగా వర్షపు నీరు ప్రవహించి రెండు మార్లు ఎన్హెచ్ కొట్టుకుపోయింది. తాడ్వాయి, కొండపర్తి మధ్య వర్షపు నీటితో రోడ్డు పూర్తిగా దెబ్బతిన్నది. ములుగు గట్టమ్మ ఆలయం నుంచి ములుగు మండలం మహ్మద్గౌస్పల్లి వరకు ఎన్హెచ్ విస్తరణ చేపట్టాల్సి ఉన్నా సదరు కాంట్రాక్టర్ ఇంకా పనులు ప్రారంభించలేదు. భూపాల్నగర్(పందికుంట) స్టేజీ నుంచి మల్లంపల్లి బ్రిడ్జి వరకు ఎన్హెచ్ దెబ్బతిని వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారు.