పోచమ్మమైదాన్, మార్చి 20: వరంగల్ దేశాయిపేటలోని పట్టణ ఆరోగ్య కేంద్రానికి జాతీయ స్థాయి గుర్తింపు దక్కింది. నాణ్యతా ప్రమాణాలు పాటించిన నేపథ్యంలో నేషనల్ క్వాలిటీ అస్యూరెన్స్ సంస్థ దేశాయిపేట పీహెచ్సీని గుర్తించింది. ప్రపంచంలో ఉత్తమ సేవలు అందించే దవాఖానగా తయారు చేయడంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం జాతీయ ఆరోగ్య మండలి ఆధ్వర్యంలో నేషనల్ క్యాలిటీ అస్యూరెన్స్ సంస్థను ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా ఈ సంవత్సరం జనవరి 6.7 తేదీల్లో ఢిల్లీ నుంచి వచ్చిన బృందం రాష్ట్రంలో నాలుగు ఆసుపత్రులను నాణ్యతా ప్రమాణాల కింద గుర్తించారు.
సోమవారం జాతీయ ఆరోగ్య మండలి జాబితాలను విడుదల చేసింది. ఆసుపత్రి భవనం గేటు రంగు, పేషెంట్లు కూర్చోవడానికి కుర్చీలు, డస్ట్బిన్లు, మరుగుదొడ్లు, తాగునీరు, ఫార్మసీ, వైద్యాధికారి, అత్యవసర ప్రసూతి గదులు, వైద్య సిబ్బంది పనితీరు, రికార్డుల నిర్వాహణ, పరిసరాల పరిశుభ్రత, పచ్చదనం, స్వచ్ఛభారత్ అంశాలను పరిగణలోకి తీసుకున్నారు. ఇందులో 100 మార్కులకు గాను దేశాయిపేట అర్బన్ హెల్త్ సెంటర్ 90.4 శాతం ఉత్తీర్ణత సాధించింది. దీంతో జాతీయ నాణ్యత హామీ ప్రమాణాలు గుర్తింపు సర్టిఫికెట్ అందిస్తారని డీఎంహెచ్వో డాక్టర్ వెంకటరమణ తెలిపారు. ఇందుకు కృషి చేసిన ప్రోగ్రాం అధికారులు డాక్టర్ గోపాల్రావు, డాక్టర్ చర్ల మధుసూదన్, డాక్టర్ పద్మశ్రీ, ప్రకాశ్, డాక్టర్ భరత్కుమార్, డాక్టర్ రవీందర్, జిల్లా క్వాలిటీ మేనేజర్ డాక్టర్ హరికళతో పాటు సిబ్బందిని ఆయన అభిందించారు.