నర్సంపేట : నల్లచట్టాలు అమలైతే రైతులను మ్యూజియంలోనే చూడాల్సి వస్తాదని, రైతులకు తీవ్ర నష్టం జరుగుందని సినీ నటుడు, దర్శకుడు, నిర్మాత ఆర్. నారాయణమూర్తి అన్నారు. బుధవారం నర్సంపేటలో జరిగిన వామపక్షాల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మూడు నల్లచట్టాలను అమలు చేసేందుకు బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టిందని పేర్కొన్నారు. ఈ నల్ల చట్టాలతో రైతులు ఎంతో నష్టం చేకూరుతుందన్నారు. ఇప్పుడు మనం జంతు ప్రదర్శన శాలలో అదిగో పులి అని చూస్తున్నామని, అదే పరిస్థితి రైతుకు వస్తుందన్నారు. అదిగో రైతు అని చూడాల్సిన దుస్థితి ఏర్పడునుందని పేర్కొన్నారు. రైతు అస్థిత్వాన్ని దెబ్బతీస్తున్నదన్నారు. ఈ చట్టాలను రద్దు చేయాలని తొమ్మిది నెలలుగా రైతులు ఆందోళన చేస్తున్నారని పేర్కొన్నారు. దీనిలో 600మంది బలిదానాలు చేసుకున్నారన్నారు.
నల్ల చట్టాలను రద్దు చేయాలని కోరుతున్నా ప్రధాన మంత్రి మోది మొండికేస్తున్నారని తెలిపారు. ప్రభుత్వం పలు శాఖలను ప్రైవేట్ పరం చేస్తున్నదని అందులో రైల్వే, వ్యవసాయం, ఎల్ఐసీ, విద్య, తదితర శాఖలను ఉన్నాయన్నారు. తెలంగాణలో సీఎం కేసీఆర్ ప్రభుత్వం 24 గంటల పాటు ఉచిత కరెంటును అందిస్తున్నదన్నారు. కేంద్రం అవలంభిస్తున్న విధానాల వల్ల ఉచిత కరెంటు ఇవ్వలేని పరిస్థితి నెలకొందన్నారు. 2006లోనే బీహార్ రాష్ట్రంలో ఒకే ప్రాంతం, ఒకే విధానాలతో చట్టాలను అమలు చేస్తున్నారని, దీనివల్ల అక్కడి రైతులు కూలీలుగా మారారని అన్నారు. ఇప్పుడు దేశం అంతటా ఇదే అమలు చేయడం వల్ల రైతులు కనుమరుగు అవుతారన్నారు. డాక్టర్ స్వామినాథన్ కమిటీ సూచించిన సిఫారస్సులను అమలు చేయాలని కోరారు. కార్యక్రమంలో వామపక్షాల నాయకులు పంజాల రమేశ్, హన్మకొండ శ్రీధర్, భూక్య సమ్మయ్య, ఎలకంటి రాజేందర్, వేముల సాంబయ్యగౌడ్, లావుడ్యరాజు, కోరబోయిన కుమారస్వామి, దిడ్డి పార్థసారధి తదితరులు పాల్గొన్నారు.