గిర్మాజీపేట, డిసెంబర్ 7: బ్యాంకులు అర్హులకు సకాలంలో రుణాలు అందించి ప్రభుత్వ లక్ష్యాన్ని నెరవేర్చాలని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. కలెక్టర్ గోపి ఆదేశాల మేరకు అదనపు కలెక్టర్ శ్రీవత్స కోట అధ్యక్షతన బుధవారం వరంగల్ కలెక్టరేట్లో జిల్లాస్థాయి బ్యాంకర్లతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే, అదనపు కలెక్టర్ మాట్లాడుతూ గత సెప్టెంబర్ వరకు రూ. 544 కోట్ల పంట రుణాలు అందించినట్లు వివరించారు. దీంతోపాటు దీర్ఘకాలిక వ్యవసాయ రుణాలుగా రూ. 503 కోట్లతో మొత్తంగా వ్యవసాయ రంగానికి రూ. 1007 కోట్లు బ్యాంకుల ద్వారా అందజేసినట్లు వెల్లడించారు. సూక్ష్మ రుణాల కింద సూక్ష్మ, చిన్న, మధ్యస్థాయి పరిశ్రమలకు రూ. 489 కోట్లు ఇచ్చినట్లు వివరించారు. విద్యా రుణాలుగా విద్యార్థులకు రూ. 7 కోట్లు అందించామన్నారు. అలాగే, ప్రాధాన్యతా రంగాలకు రూ. 315 కోట్లు అందజేసినట్లు వారు సూచించారు.
ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులకు సకాలంలో రుణాలు అందజేసి ప్రయోజనం కల్పించాలని ఎమ్మెల్యే, అదనపు కలెక్టర్ సూచించారు. జిల్లాలో 10,316 మహిళా సంఘాలకు రూ. 568 కోట్ల రుణాలు లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు. ఇందులో ఇప్పటి వరకు రూ. 5,168 సంఘాలకు రూ. 340 కోట్లు అందించి 60 శాతం లక్ష్యాన్ని సాధించామన్నారు. వీధి వ్యాపారులకు అందించే రూ. 20 వేల రుణానికి సంబంధించి 11,789 వీధి వ్యాపారులకు రూ. 23.57 కోట్లు అందించామని గుర్తుచేశారు. నర్సంపేట నియోజకవర్గంలోని కిసాన్ క్రెడిట్ కార్డు రుణాలు మత్స్యకారులు, పాడిపరిశ్రమలకు త్వరగా మంజూరు చేయాలని బ్యాంకర్లను పెద్ది ఆదేశించారు. అనంతరం రాబోయే 2023-24 ఆర్థిక సంవత్సరానికి నాబార్డు ద్వారా నిర్దేశించిన వార్షిక రుణ ప్రణాళికను అదనపు కలెక్టర్ శ్రీవత్స కోట, ఎమ్మెల్యే పెద్ది ఆవిష్కరించారు. జిల్లాలో రూ. 2,643 కోట్ల రుణ లక్ష్యంగా నాబార్డు నిర్ణయించింది. ఇందులో వ్యవసాయ రంగానికి రూ. 2375 కోట్లు, సూక్ష్మ రుణ ప్రణాళికకు రూ. 205 కోట్లు, విద్యా రంగానికి రూ. 11 కోట్లు, గృహ నిర్మాణానికి రూ. 43 కోట్లు, ఇతర మౌలిక వసతులకు రూ. 5 కోట్లు బ్యాంకుల ద్వారా ఇచ్చేందుకు ప్రణాళికను సిద్ధం చేసినట్లు వెల్లడించారు.
సమావేశంలో లీడ్ బ్యాంక్ మేనేజర్ హవేలి రాజు, యూబీఐఆర్ఎం సత్యం, ఆర్బీఐ నుంచి అలీ, నాబార్డు డీడీఎం రవి, డీఆర్డీవో సంపత్రావు, జిల్లా అధికారులు, బ్యాంకర్లు తదితరులు పాల్గొన్నారు.