నర్సంపేట, డిసెంబర్ 4: ప్రధానమంత్రి నరేంద్రమోదీ రైతులను నట్టేట ముంచారని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ కేంద్రంలో మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు సమస్యలను గాలికొదిలేసి, కార్పొరేట్ శక్తులకు వ్యవసాయాన్ని కట్టబెట్టే కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. నేడు ధాన్యానికి కేంద్రం నిర్ణయించిన మద్దతు ధర రూ. 2040 అని, ప్రైవేటు మార్కెట్లో రూ. 2400 ధరతో ధాన్యం కొనుగోలు చేస్తున్నారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ అసమర్థతకు ఇది నిదర్శనమన్నారు. అలాగే, పత్తి, మిర్చి పంటలకు మద్దతు ధరను నిర్ణయించే అధికారం కేంద్రం వద్ద ఉన్నా దిశగా చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. అదానీ, అంబానీలకు రాయితీలిస్తూ వాళ్ల చేతుల్లో వ్యవసాయ రంగాన్ని పెట్టేందుకు రైతు వ్యతిరేక చట్టాలను తీసుకొచ్చారని ధ్వజమెత్తారు.
తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ముందుచూపు నిర్ణయాలతో రైతులు అద్భుతమైన పంటలు పండిస్తున్నారని ఎమ్మెల్యే పెద్ది వివరించారు. కేంద్రం చేతుల్లో ఉన్న మద్దతు ధర నిర్ణయాధికారాన్ని రాష్ర్టాలకు అప్పగించాలని డిమాండ్ చేశారు. మద్దతు ధర విషయంలో రాబోయే రోజుల్లో దేశవ్యాప్తంగా రైతులను ఏకం చేసి ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. త్వరలోనే రైతులు ప్రధాని నరేంద్రమోదీకి తగిన గుణపాఠం చెప్పడం ఖాయమన్నారు.
పట్టణంలోని అయప్పస్వామి ఆలయం ఆధ్వర్యంలో ఈ నెల 9న నిర్వహించనున్న పంబారట్టు మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి సూచించారు. ఆలయ కమిటీ సభ్యులు క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే పెద్ది దంపతులను కలిసి పంబారట్టు మహోత్సవానికి ముఖ్య అతిథులుగా రావాలని ఆహ్వానించారు. కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు చేసి, లోటుపాట్లు లేకుండా చూస్తామని ఆలయ కమిటీకి ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. కార్యక్రమంలో సభ్యులు సంగిరికొండ మాధవశంకర్, మాధారపు చంద్రశేఖర్, మునిగాల వెంకట్రెడ్డి, సురేశ్, రావుల సతీశ్, చింతల కమలాకర్రెడ్డి, శ్రీరాముల శంకరయ్య, నాగిరెడ్డి, మిశ్రా పాల్గొన్నారు.
నర్సంపేట రూరల్: గురిజాల, ఆకులతండాలో ఆదివారం జరిగిన వేర్వేరు వివాహ వేడుకలకు ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి హాజరయ్యారు. ఆకులతండాలో ధరావత్ అరుణ్కుమార్-విజయ దంపతుల కుమారుడు గణేశ్కృష్ణ వివాహ వేడుకల్లో పెద్ది పాల్గొని వధూవరులను ఆశీర్వదించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు కుమారస్వామి, కిషన్, రమేశ్, రాజు, తిరుపతి, స్వామి, ప్రభుత్వ ఉపాధ్యాయుడు ధరావత్ వీరన్న పాల్గొన్నారు.