జనగామ, ఫిబ్రవరి 17 (నమస్తే తెలంగాణ) : ఇంటర్మీడియట్ తర్వాత ఏ కోర్సులు చదవాలి..? ఎటు వైపు వెళ్లి జీవితంలో స్థిరపడి ఉత్తమ ఉద్యోగం చేయవచ్చు? అనే అంశంపై ‘నమస్తే తెలంగాణ’, ‘తెలంగాణ టుడే’, కేఎల్ యూనివర్సిటీ సంయుక్తంగా ‘లక్ష్యం’-2024 పేరుతో విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహిస్తున్నాయి.
జనగామ జిల్లా కేంద్రంలోని ఎస్ఎస్ఎన్ ఫంక్షన్ హాల్ (సూర్యాపేట రోడ్డులోని సమీకృత కలెక్టరేట్ ఎదురుగా)లో ఆదివారం సాయంత్రం 4 గంటలకు కార్యక్రమం ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. దీనికి ముఖ్య అతిథిగా కేఎల్ యూనివర్సిటీ అధికారులు, నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే బాధ్యులు హాజరై దిశానిర్ధేశం చేయనున్నారు. ఇంటర్ సెకండియర్ చదివే విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు.