పరకాల, సెప్టెంబర్ 7: మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఈనెల 9న పరకాలకు రానున్నారు. మున్సిపాలిటీ పరిధిలో పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం, శంకుస్థాపనలు చేయనున్నారు. ఈమేరకు పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి శనివారం కలెక్టర్ సిక్తాపట్నాయక్తో కలిసి స్థానిక వ్యవసాయ మార్కెట్ ఆవరణలో హెలీప్యాడ్, కొత్త ఆర్డీవో, తహసీల్దార్ కార్యాలయాలు, ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణ పరిశీలించారు. అనంతరం మున్సిపాలిటీ సమావేశ మందిరంలో అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.
ఎమ్మెల్యే చల్లా మాట్లాడుతూ మంత్రి కేటీఆర్ పర్యటనను విజయవంతం చేయాలన్నారు. రూ.114.65కోట్లతో కొత్తగా నిర్మించిన ప్రభుత్వ కార్యాలయాలు, మిషన్ భగీరథలో భాగంగా పట్టణంలో నిర్మించిన ఇంటర్నల్ పైప్లైన్, నల్లాలు, డబుల్ బెడ్రూం ఇండ్లను ప్రారంభించడంతోపాటు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నట్లు వివరించారు. అనంతరం పట్టణంలోని పశువుల సంతలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొంటారని పేర్కొన్నారు. మంత్రి కేటీఆర్ పర్యటన నేపథ్యంలో అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో ఏర్పాట్లు చేయాలని సూచించారు.
మధ్యాహ్నం ఒంటిగంటకు పరకాల వ్యవసాయ మార్కెట్ ఆవరణకు హెలికాప్టర్లో కేటీఆర్ చేరుకుంటారని, అక్కడి నుంచి నూతన మున్సిపాలిటీ కార్యాలయ ఆవరణలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించి, మరికొన్ని పనులకు శంకుస్థాపన చేయనున్నారని తెలిపారు. పలు పథకాల లబ్ధిదారులకు ప్రొసీడింగ్ పత్రాలను అందించనున్నట్లు పేర్కొన్నారు.
కలెక్టర్ మాట్లాడుతూ మంత్రి కేటీఆర్ పర్యటనలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ మహేందర్ జీ, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ మాధవీ లత, బీసీ కార్పొరేషన్ ఈడీ రాంరెడ్డి, ఆర్డీవో శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్ తిరునహరి శేషాంజన్ స్వామి, మున్సిపల్ చైర్పర్సన్ సోదా అనితా రామకృష్ణ, వైస్ చైర్మన్ రేగూరి విజయపాల్ రెడ్డి, ఆర్ అండ్ బీ, పంచాయతీరాజ్, ఇరిగేషన్ అధికారులు, పలువురు ప్రజా ప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.