తాడ్వాయి, జనవరి 29 : మహాజాతరలో భాగంగా భక్తుల సౌకర్యార్థం చేపట్టిన అభివృద్ధి పనులను ఫిబ్రవరి 4లోపు పూర్తి చేయాలని దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రా వు, గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. శనివారం వారు జాతర పరిసరాల్లో పర్యటించి పలు పనులను పరిశీలించారు. మొదటగా జంపన్నవాగు వద్ద చేపట్టిన బ్యాటరీ ఆఫ్ ట్యాప్స్, నూతనంగా నిర్మిస్తున్న డ్రెస్ చేంజింగ్ గదులు, వాగులో జరుగుతున్న ఇసుక చదును, ఇసుక బస్తాల అడ్డుకట్టల పనులను పరిశీలించారు. అవి చివరి దశలో ఉండడంతో సంతృప్తి వ్యక్తం చేశారు. అక్కడి నుంచి జాతర పరిసరాల్లో చేపడుతున్న మరుగుదొడ్ల నిర్మాణ పనులను పరిశీలించారు. ఇప్పటి వరకు ఎన్ని పూర్తయ్యాయి? పూర్తి చేయాల్సినవి ఎన్ని అని ఆర్డబ్ల్యూఎస్ అధికారులను అడిగితెలుకున్నారు. ఇంకా మిగిలిఉన్న పనులను గుర్తించి వెంటనే పూర్తి చేయాలని మంత్రులు అధికారులను ఆదేశించారు. భక్తులకు ఇబ్బందులు కలుగకుండా ఏర్పాట్లు చేసి జాతరను విజయవంతం చేయాలని సూచించారు.
వనదేవతలకు మొక్కులు
సమ్మక్క-సారలమ్మను శనివారం మంత్రులు అల్లోల ఇంద్రకరణ్రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్రావు, సత్యవతి రాథోడ్, సీఎస్ సోమేశ్కుమార్, గిరిజన సంక్షేమశాఖ కమిషనర్ క్రిస్టియానా చోంగ్తు, డీజీపీ మహేందర్రెడ్డి, ఎంపీలు పసునూరి దయాకర్, మాలోత్ కవిత, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, ఎమ్మె ల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, వరంగల్ జడ్పీ చైర్పర్సన్ జ్యోతి వేర్వేరుగా అమ్మవార్లను దర్శించుకున్నారు. వారికి పూజారులు, దేవాదాయశాఖ అధికారులు డోలివాయిద్యాల నడుమ ఘన స్వాగతం పలికి గద్దెల వద్దకు తీసుకెళ్లారు. గిరిజన సంప్రదాయ పద్ధతుల్లో తల్లులకు పసుపు, కుంకుమ, ఎత్తుబెల్లం, నూతన వస్ర్తాలు, పూలు, పండ్లు సమర్పించారు. వారికి పూజారులు అమ్మవార్ల వస్ర్తాలతో పాటు ప్రసాదం అందజేశారు. అనంతరం మేడారం జాతర పునరుద్ధరణ కమిటీ చైర్మన్గా కొర్నిబెల్లి శివయ్య, డైరెక్టర్లను ప్రమాణ స్వీకారం చేయించారు. సమ్మక్క-సారలమ్మకు మొదటి మొ క్కులు చెల్లించిన అనంతరం వారికి మంత్రులు కం డువాలు కప్పారు. మొదటగా హెలికాప్టర్లో వచ్చి న మంత్రులు, సీఎస్, డీజీపీకి కలెక్టర్ కృష్ణ ఆదిత్య, ఎమ్మెల్యే సీతక్క పుష్పగుచ్ఛాలు అందించి స్వాగతం పలికారు.
కమాండ్ కంట్రోల్ రూం ప్రారంభం
జాతరలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకునేందుకు పోలీస్ క్యాంపులో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ రూమ్ను శనివారం మంత్రులు, సీఎస్, డీజీపీ ప్రారంభించారు.
భక్తుల సందడి
వనదేవతల దర్శనానికి శనివారం భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. జంపన్నవాగులో పుణ్యస్నానాలు ఆచరించి తల్లులకు తలనీలాలను సమర్పించారు. అనంతరం గద్దెల వద్దకు చేరుకుని గిరిజన సంప్రదాయ పద్ధతుల్లో మొక్కులు చెల్లించారు.