తాడ్వాయి, జనవరి28 : మేడారం జనసంద్రమవుతున్నది.. మహా జాతర దగ్గరపడుతున్న కొద్దీ భక్తుల రాక రోజురోజుకూ పెరుగుతున్నది. కోరిన కోర్కెలు తీర్చుతూ భక్తుల కొంగుబంగారంగా విలసిల్లుత్తున్న తల్లులను తనివితీరా కొలిచేందుకు బారులు తీరుతున్నారు. శుక్రవారం ఒక్క రోజే మూడు లక్షలకు పైగా వచ్చినట్లు దేవాదాయ శాఖ అధికారులు చెబుతున్నారు. ముందుగా జంపన్నవాగులో పుణ్యస్నానాలు, కల్యాణకట్టలో తలనీలాలను సమర్పించారు. అనంతరం గద్దెల వద్దకు చేరుకుని తల్లులకు ప్రీతికరమైన ఎత్తు బెల్లం, ఒడిబియ్యం, నూతన వస్ర్తాలు, పూలు, పండ్లు సమర్పించారు. సమ్మక్క-సారలమ్మ, పగిడిద్దరాజుకు మొక్కులు చెల్లించారు. గిరిజన సంప్రదాయ పద్ధతుల్లో మొక్కులు చెల్లించి తల్లుల దీవెనలు పొందుతున్నారు. ఆర్టీసీ, ప్రైవేట్ వాహనాల్లో సుదూర ప్రాంతాల నుంచి మేడారానికి వచ్చే భక్తులు జాతర ప్రాంగణంలో విడిది చేస్తున్నారు.
నేడు మేడారంలో మంత్రుల పర్యటన
నేడు మేడారంలో గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, పం చాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి పర్యటించనున్నారు. మహాజాతరలో భాగంగా భక్తుల సౌకర్యార్థం ఏర్పాటు చేస్తున్న సౌకర్యాలను పరిశీలించనున్నారు. సమ్మక్క-సారలమ్మను దర్శించుకుని మేడారం ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొననున్నారు.