ములుగు, ఫిబ్రవరి 18 (నమస్తే తెలంగాణ)/ తాడ్వాయి : గద్దెలపై కొలువుదీరిన తల్లుల దర్శనం కోసం తరలివచ్చిన వారితో మేడారం శుక్రవారం జనసంద్రాన్ని తలపించింది. దేశ నలుమూలల నుంచి భక్తులు వచ్చి ఘనంగా మొక్కులు చెల్లించుకున్నారు. బుధవారం సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులు, గురువారం తల్లి సమ్మక్క గద్దెపైకి వచ్చినప్పటి నుంచి దర్శనం కోసం భక్తులు రెండువైపులా మూడు కిలోమీటర్ల చొప్పున ఏర్పాటు చేసిన క్యూలైన్లలో బారులు తీరారు. రద్దీ విపరీతంగా పెరుగడంతో వీఐపీ, వీవీఐపీ సందర్శకుల కోసం జారీ చేసిన ప్రత్యేక దర్శన పాస్లను మూడు గంటల పాటు నిలిపివేశారు. గద్దెల ప్రాంగణం గణగణ గంటల నాదాలతో మార్మోగింది. మేడారానికి దాదాపు పది కిలోమీటర్ల విస్తీర్ణంలో గుడారాలు ఏర్పాటు చేసుకున్న భక్తులు ఇంటిల్లిపాది వచ్చి తల్లులను దర్శించుకొని తన్మయత్వం చెందారు. నెత్తిన బంగారం మూటలు, చంకన పిల్లలను ఎత్తుకొని ఎన్ని ఇబ్బందులు ఎదురైనా తల్లుల దర్శనం ముందు వాటిని లెక్క చేయలేదు.
అన్నీ తానైన మంత్రి దయాకర్రావు
ఎక్కడా ఇబ్బందులు లేకుండా మహా జాతర విజయవంతం కావడంలో మంత్రి దయాకర్రావు అన్నీ తానై వ్యవహరించారు. మూడు రోజులుగా మేడారంలోనే బసచేసి అధికారులను సమన్వయం చేస్తూ క్యూ లైన్లలో భక్తులను పలుకరిస్తూ ఏర్పాట్లపై ఎప్పటికప్పుడు సమీక్షించారు. మంచెపై నుంచి మైక్లో మాట్లాడుతూ భక్తులకు సూచనలు చేశారు.
నేడు వనప్రవేశం
అమ్మవార్లు శనివారం సాయంత్రం వనప్రవేశం చేయనున్నారు. సమ్మక్క చిలుకల గుట్టకు, సారలమ్మ కన్నెపల్లికి, పగిడిద్దరాజు పూనుగొండ్లకు, గోవిందరాజులు కొండాయికి ఆదివాసీ గిరిజన సంప్రదాయాల ప్రకారం వడ్డెలు సాగనంపనున్నారు.
కోటిమందికి పైగా భక్తులు
ముందస్తు మొక్కులతో పాటు మేడారం ప్రధాన జాతరలో సమ్మక్క-సారలమ్మను కోటి మందికిపైగా భక్తులు దర్శించుకున్నట్లు మంత్రి ఎర్రబెల్లి
దయాకర్రావు వెల్లడించారు. నాలుగు జాతరలకు ప్రభుత్వం మొత్తం రూ.381 కోట్లు వెచ్చించి సౌకర్యాలు కల్పించిందని చెప్పారు. ఒకప్పుడు వరంగల్ నుంచి మేడారం వెళ్లాలంటే 6 నుంచి 10గంటల సమయం పట్టేదని, ఇప్పుడు విశాలమైన రోడ్లు అందుబాటులోకి రావడం, ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా చూడడంతో కేవలం 3గంటల్లో చేరుకునే వీలు కలిగిందన్నారు.
ఆదివాసీల నృత్య ప్రదర్శన అదరహో
మంగపేట : జాతర సందర్భంగా మేడారంలోని గిరిజన మ్యూజియం వద్ద శుక్రవారం రాత్రి నిర్వహించిన ఆదివాసీ గిరిజన నృత్య ప్రదర్శనలు అలరించాయి. దేశ నలుమూలల నుంచి తరలివచ్చిన భక్తులకు ఆదివాసీల జీవన శైలి, సంస్కృతి, సంప్రదాయాలు తెలిసేలా ఈ కార్యక్రమాలకు రూపకల్పన చేశారు. ఆదివాసీల ఆహార్యంలో గిరిజనులు కొమ్ము బూరలు ఊదుతూ, డోలివాయిద్యాలతో చేసిన థింసా నృత్యాలు ఆకట్టుకున్నాయి.