తాడ్వాయి, ఫిబ్రవరి 7 : వనదేవతల దర్శనానికి తరలివచ్చిన భక్తులతో మేడారం సోమవారం కోలాహలంగా మారింది. జంపన్నవాగు, తల్లుల గద్దెల ప్రాంతాలు కిటకిటలాడాయి. అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకుంటూ పరిసరాల్లోనే విడిది చేస్తుండడంతో ఇక్కడి అటవీ ప్రాంతం సందడిగా మారింది.
తల్లి రాకను కనులారా తిలకించేలా..
మహాజాతరకు వచ్చే ప్రతి భక్తుడు తల్లుల రాకను కళ్లారా చూడాలని కోరుకుంటాడు. ఇంతకు ముందు అమ్మవార్ల ఆలయాల వద్ద ఎలాంటి ఏర్పాట్లు లేకపోవడంతో సాధ్యం కాకపోయేది. కన్నెపల్లిలో సారలమ్మ గుడి చుట్టూ ఉన్న ప్రహరీని, చెట్లను ఎక్కి తల్లి రాకను చూసేవారు. కానీ ఈసారి దేవాదాయ శాఖ అధికారులు సారలమ్మ రాకను అందరూ వీక్షించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. రూ.40లక్షలతో సారలమ్మ గుడి చుట్టూ సాలహారం కడుతున్నారు. గుడి ఆవరణలో జరిగే కార్యక్రమాలు భక్తులకు కనిపించేలా సాలహారం కింద గ్రిల్స్ ఏర్పాటు చేస్తున్నారు.
పారిశుధ్య నిర్వహణ కోసం తొలిసారిగా యంత్రాల వినియోగం
మహాజాతరలో పారిశుధ్య నిర్వహణ కోసం జిల్లా పంచాయతీ అధికారులు అత్యాధునిక యంత్రాలను తొలిసారిగా వినియోగిస్తున్నారు. చెత్త కుప్పులను ఎత్తి ట్రాక్టర్లలో వేసేందుకు బాబ్ క్యాట్ రోబోలను అందుబాటులోకి తెచ్చారు. రోడ్లపై ఇసుక, దుమ్మును శుభ్రం చేసేందుకు స్వీపింగ్ మిషన్లను వినియోగిస్తున్నారు. గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ సహకారంతో యంత్రాలను మేడారానికి తెచ్చి పారిశుధ్య పనులకు వాడుతున్నారు. వ్యర్థాలు పోగు కాకుండా వెంటవెంటనే తరలించేందుకు ఈ ఏర్పాట్లు చేసినట్లు డీపీవో వెంకయ్య తెలిపారు. జీడబ్ల్యూఎంసీ నుంచి రెండు బాబ్ క్యాట్ రోబోలు, ఖమ్మం జిల్లా నుంచి స్వీపింగ్ మిషన్లను తెప్పించి పనులు చేయిస్తున్నట్లు తెలిపారు.