ముందస్తు మొక్కులతో మేడారం భక్తజనంతో పోటెత్తుతోంది. ప్రతి బుధ, శుక్ర, ఆదివారాల్లో రద్దీ ఎక్కువ ఉంటుండగా జనవరి 15 నుంచి ఇప్పటివరకు వనదేవతలను దర్శించుకున్న వారి సంఖ్య 40లక్షలకు చేరింది. క్రౌడ్ కంట్రోల్ కెమెరాల ద్వారా ఎప్పటికప్పుడు లెక్కిస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విభాగం అధికారులు.. ఆదివారం ఒక్కరోజే 10లక్షల మంది సమక్క-సారలమ్మలను దర్శించుకున్నట్లు వెల్లడించారు. ఈ లెక్కన మహాజాతర పూర్తి, తిరుగువారం వరకు సుమారు కోటిన్నర దాకా వచ్చే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు.
ములుగు, ఫిబ్రవరి 6(నమస్తే తెలంగాణ)/తాడ్వాయి : భక్తుల కొంగుబంగారమైన మేడారం సమ్మక సారలమ్మ మహాజాతరకు ముందస్తు మొకలలో భాగంగా భక్తుల సంఖ్య ఆదివారం నాటికి 40 లక్షలకు చేరిందని పోలీసు వర్గాలు తెలిపాయి. క్రౌడ్ కంట్రోల్ కెమెరాల ద్వారా భక్తుల సంఖ్యను ఎప్పటికప్పుడు లెకిస్తున్న ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ విభాగం పోలీసులు ఆదివారం ఒకరోజే అత్యధికంగా 10 లక్షల మంది అమ్మవార్లను దర్శించుకున్నట్లు వెల్లడించారు. కరోనా మహమ్మారి కారణంగా ఫిబ్రవరి 16 నుంచి 19వ తేదీ వరకు నిర్వహించనున్న మహాజాతర వరకు పరిస్థితులు ఎలా ఉంటాయోనని ఆందోళన చెందుతున్న భక్తులు గతేడాది డిసెంబర్ నుంచి ప్రతి బుధ, గురు, శుక్ర అదివారాలతోపాటు సెలవు దినాల్లో అత్యధికంగా తరలివచ్చి ముందస్తు మొకులను చెల్లించుకుంటున్నారు. ఇలా జనవరి 15వ తేదీ నుంచి ఇప్పటివరకు నలభై లక్షల మంది దర్శించుకున్నట్లు తెలిపారు.
కిక్కిరిసిన మేడారం..
వరాల తల్లుల సన్నిధికి భక్తులు పోటెత్తుతున్నారు. ఆదివారం సెలవుదినం కావడంతో వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో జనం తరలిరాగా తల్లుల గద్దెల ఆవరణ సందడిగా మారింది. మహాజాతరకు మరో 10 రోజులే ఉండడంతో ముందస్తు మొక్కులు జోరందుకుంటున్నాయి. జంపన్నవాగులో పుణ్యస్నానాలు ఆచరించి, కల్యాణకట్టలో తలనీలాలను సమర్పిస్తున్నారు. అనంత రం సమ్మక్క-సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్దరాజుల గద్దెలపై పసుపు, కుంకుమ, ఎత్తుబెల్లం, నూతన వస్ర్తాలు, పూలు, పండ్లు సమర్పించి మొక్కులు చెల్లించుకుంటున్నారు.