ములుగు, జనవరి 28:దళిత కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన దళితబంధు పథకాన్ని మార్చి 9వ తేదీలోగా అమలు చేస్తామని ములుగు జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య తెలిపారు. ఈమేరకు మొదటి విడుత పూర్తి చేసేందుకు ఎస్సీ కార్పొరేషన్ ఈడీని నోడల్ ఆఫీసర్గా నియమించి, కో ఆర్డినేషన్ కమిటీ మీటింగ్ పూర్తి చేశామని ఆయన పేర్కొన్నారు. జిల్లాలో దళితబంధు పథకం అమలుపై ‘నమస్తే తెలంగాణ’తో ప్రత్యేకంగా మాట్లాడారు.
ములుగు నియోజకవర్గంలో లబ్ధిదారులను ఎలా గుర్తిస్తారు ?
దళితబంధు పథకం కింద ములుగు నియోజకవర్గానికి 100 యూనిట్లు మంజూరయ్యాయి. వీటిని ప్రస్తుతం అన్ని మండలాల లబ్ధిదారులకు కాకుండా ప్రయోగాత్మకంగా ఏవైనా రెండు గ్రామాలను ఎంపిక చేసుకొని ఒకో గ్రామంలో 50మంది లబ్ధిదారులను ఎంపిక చేయాలని ప్రణాళికలు రూపొందిస్తున్నాం. దళితబంధు పథకం వల్ల కలిగే ప్రయోజనాలు పూర్తిస్థాయిలో ఒకో గ్రామానికి చేకూరాలని ఈ పద్ధతిని అవలంబిస్తున్నాం. ఎమ్మెల్యే సూచనల ప్రకారం లబ్ధిదారుల ఎంపిక పూర్తయిన తర్వాత నోడల్ ఆఫీసర్తో లబ్ధిదారులకు ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తాం. ఈ సందర్భంగా పథకం ప్రాముఖ్యత, దాని వల్ల కలిగే ఆర్థిక ప్రయోజనాలను పూర్తిగా వివరించి పథకాన్ని పకడ్బందీగా అమలు చేస్తాం.
లబ్ధిదారులకు ఏయే యూనిట్లు మంజూరు చేస్తారు ?
మండలాలకు చెందిన గ్రామాల్లో లబ్ధిదారులను ఎంపిక చేసే క్రమంలో స్థానిక డిమాండ్ మేరకు యూనిట్లు మంజూరు చేస్తాం. ఉదాహరణకు మంగపేట, ఏటూరునాగారం, కన్నాయిగూడెం మండలాల్లో లబ్ధిదారులను ఎంపిక చేసినటె్లైతే అకడ వ్యవసాయ యంత్రాలకు డిమాండ్ ఉంటుంది. అప్పుడు లబ్ధిదారులకు వరి కోత యంత్రాలు, ట్రాక్టర్లు, సరుకు రవాణా వాహనాలు అందిస్తాం. ములుగు మండలంలో లబ్ధిదారులను ఎంపిక చేసే అవకాశాలు ఉన్నట్లు అయితే, జిల్లాకేంద్రంగా మారిన తర్వాత ములుగు మండలంలో భవన నిర్మాణరంగంలో పనులు ఊపందుకున్నాయి. ఇందుకు అనుగుణంగా లబ్ధిదారులకు సెంట్రింగ్ యూనిట్లు, గృహ నిర్మాణ సామగ్రి యూనిట్లు మంజూరు చేస్తాం.
నమస్తే : జిల్లాలో దళితబంధు పథకం అమలుతీరు ఎలా ఉండబోతుంది ?
కలెక్టర్: ములుగు జిల్లాలో రెండు నియోజకవర్గాలు ఉన్నప్పటికీ భద్రాచలం నియోజకవర్గం పరిధిలోని వాజేడు, వెంకటాపురం(నూగూరు) మండలాల లబ్ధిదారుల ఎంపికను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నోడల్ అధికారి చేపడతారు. అలాగే ములుగు నియోజకవర్గంలోని ఏడు మండలాలతో పాటు మహబూబాబాద్ జిల్లాలోని కొత్తగూడ, గంగారం మండలాల లబ్ధిదారుల ఎంపికను ములుగు జిల్లా ఇన్చార్జి మంత్రి సత్యవతి రాథోడ్, ములుగు ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో నాతో పాటు నోడల్ ఆఫీసర్, దళితబంధు కోసం అర్హులను ఎంపిక చేస్తారు.
ఎంపిక ఎప్పటివరకు పూర్తవుతుంది ?
ములుగు నియోజకవర్గంలో దళితబంధు లబ్ధిదారుల ఎంపిక విషయమై ఇప్పటికే ఎమ్మెల్యేకు సమాచారం అందించాం. ములుగు ఎస్బీఐ బ్యాంకులో అకౌంట్ తెరచి దళితబంధు నిధులను రాష్ట్ర ప్రభుత్వం ద్వారా అధికారులు జమచేశారు. బ్యాంకర్లతో కూడా సమావేశం నిర్వహించి రుణాల మంజూరుపై దిశానిర్దేశం చేశాం. ఫిబ్రవరి 5వ తేదీ వరకు లబ్ధిదారుల ఎంపిక పూర్తిచేసి, 7వ తేదీన లబ్ధిదారులతో బ్యాంకు అకౌంట్లను ఓపెన్ చేయిస్తాం. మార్చి 9వ తేదీ వరకు పథకం ప్రక్రియను తొలి విడత పూర్తిచేస్తాం.
పథకం అమలుకు ఎలాంటి ప్రణాళికలు రూపొందించారు ?
దళితబంధు పథకం అమలు విషయంలో ఇప్పటికే జిల్లాస్థాయి అధికారులతో సమావేశాలు నిర్వహించాం. బ్యాంకర్లతో కూడా ప్రత్యేక సమావేశాలు ఏర్పాటుచేశాం. కోఆర్డినేషన్ కమిటీ మీటింగ్ను కూడా మేడారంలో ఇటీవల మంత్రి, ఎమ్మెల్యే సమక్షంలో నిర్వహించాం. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలను తూ.చ తప్పకుండా పాటిస్తూ పారదర్శకంగా లబ్ధిదారులను ఎంపిక చేసి స్థానిక అవసరాల మేరకు యూనిట్లను మంజూరు చేసి లబ్ధిదారులకు అందిస్తాం.