ములుగు, జనవరి 6 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ దవాఖానలను పటిష్టం చేయడమే కాకుండా కార్పొరేట్ స్థాయి వైద్యం అందిస్తున్నది. దీంతో ప్రజలు ప్రైవేట్ను వీడి ప్రభుత్వ దవాఖానల బాటపడుతున్నారు. రాష్ట్రం ఏర్పడక ముందు ములుగు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానలో సంవత్సరం మొత్తం మీద 100 కాన్పులు మాత్రమే జరిగేవి. ఏరియా వైద్యశాల నుంచి జిల్లా దవాఖానగా అప్గ్రేడ్ అయిన తర్వాత రాష్ట్రంలో రెండు దఫాలుగా రికార్డు స్థాయి కాన్పులు చేసి ప్రజల నుంచి ప్రశంసలు అందుకుంది. నిపుణులైన వైద్యులు, వైద్య సిబ్బంది మెరుగైన వైద్యసేవలందించడంతో 2021 సంవత్సరంలో 12 నెలల్లో 1,899 ప్రసవాలు జరిగాయి. సగటున రోజుకు 5 నుంచి 6 డెలివరీలు జరిగి రాష్ట్రంలోనే ములుగు దవాఖాన వైద్య ఆరోగ్య శాఖలో రికార్డు స్పష్టించింది. వీటిలో 689 సాధారణ కాన్పులు జరుగగా 1,210 ఆపరేషన్లు చేశారు. ఒక్క నవంబర్ నెలలోనే అత్యధికంగా 215 మంది గర్భిణులు పురుడు పోసుకున్నారు.
ఏజెన్సీకి పెద్దదిక్కు
ములుగు జిల్లా దవాఖాన ఏజెన్సీ మండలాలకు పెద్దదిక్కుగా మారింది. రాష్ట్ర వైద్య విధాన పరిషత్ ఆధ్వర్యంలో నడుస్తున్నా తెలంగాణ రాక ముందు 30 పడకల స్థాయిలో మాత్రమే ఉండేది. ప్రజల అవసరాలను గుర్తించిన సీఎం కేసీఆర్ వైద్యశాలను అప్గ్రేడ్ చేసి 100 పడకలకు మార్చారు. కలెక్టర్ ఎస్ కృష్ణ ఆదిత్య ప్రత్యేక శ్రద్ధ వహించి అత్యధికంగా నిధులు కేటాయించడంతో మౌలిక వసతులతో పాటు వైద్య పరికరాలను సమకూర్చారు. దవాఖాన సూపరింటెండెంట్ జగదీశ్వర్ స్వతహాగా స్త్రీవైద్య నిపుణుడు అయినందున రిస్క్ డెలివరీ కేసులను సైతం ఇక్కడే చేసేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ఆయనతో పాటు మరో నలుగురు స్త్రీ వైద్య నిపుణులు, నలుగురు మత్తు మందు వైద్య నిపుణులతో పాటు పిల్లల డాక్టర్, 20 మంది వైద్య సిబ్బంది 24 గంటలూ విధులు నిర్వర్తిస్తున్నారు. ఆరోగ్యశ్రీ ద్వారా నవజాత శిశువులకు సైతం వైద్య సేవలందించి ప్రభుత్వం ద్వారా వచ్చే నిధులను దవాఖాన అభివృద్ధికి వైద్యులు కృషి చేస్తున్నారు.
పేదలకు తప్పిన రూ.6 కోట్ల ఆర్థిక భారం
2021 సంవత్సరంలో ప్రైవేట్ దవాఖానల్లో అందించే సేవలతో పోల్చితే ప్రభుత్వ దవాఖానలో మందులు, వైద్య ఖర్చులతో పాటు కేసీఆర్ కిట్ల విలువ రూ.6 కోట్లు ఉంటుంది. దీంతో పేదలపై ఆ ఆర్థిక భారం తప్పినట్లయింది. ములుగు జిల్లా దవాఖానలో 2021లో మొత్తం 1,899 కేసీఆర్ కిట్లు పంపిణీ చేశారు. గర్భిణులకు వారానికి 3 రోజులు ప్రత్యేకంగా వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. రోజుకు 110 నుంచి 150 మందికి గర్భిణులకు స్కానింగ్తో పాటు రక్త, మూత్ర పరీక్షలు నిర్వహిస్తూ పౌష్టికాహార లోపం లేకుండా మందులు అందజేస్తున్నారు.
అన్ని విభాగాల్లో వైద్య సేవలు
ములుగు ప్రభుత్వ దవాఖాన ఇటీవలే జిల్లా వైద్యశాలగా అప్గ్రేడ్ అయింది. మరికొద్ది రోజుల్లో అన్ని విభాగాల్లో మెరుగైన వై ద్య సేవలు అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. సిటీస్కా న్ సేవలు కూడా అందుబాటులో రానున్నాయి. కలెక్టర్ కృష్ణ ఆదిత్య ప్రత్యేక చొరవ తీసుకోవడంతో పాటు దవాఖానపై ప్రత్యేక దృష్టి సారించారు. ఎప్పటికప్పుడు నిధులు కేటాయిస్తూ అభివృద్ధికి తోడ్పడుతున్నారు. ఆయన ఆదేశాలతో కేసులను వరంగల్ ఎంజీఎం దవాఖానకు వెళ్లనివ్వకుండా ఇక్కడే మెరుగైన చికిత్స అందిస్తున్నాం. వైద్యులు, సిబ్బంది, శానిటేషన్ కార్మికులు, ప్రజలు, ప్రజాప్రతినిధుల సహకారంతోనే రికార్డు స్థాయిలో ప్రసవాలు చేయగలిగాం.